Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని ప్రజా వ్యతిరేక నేతకు ఒక చిహ్నంగా ఇప్పటికీ ఈ ప్రపంచం గుర్తుంచుకుంటోంది. ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్రమోడీ నిర్వాకం నీరోను మించిపోతున్నది. ఫిబ్రవరి14న పుల్వామాలో ఉగ్రవాదులు అతికిరాతకంగా మన సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుపెట్టిన తరువాత దేశమంతా అట్టుడికి పోతుంటే ప్రధాని ప్రవర్తన మాత్రం తన రాజధర్మాన్ని చాటుకునేలా లేదు. పుల్వామా దాడి జరుగుతున్న సమయంలోనే ప్రధాని తన రాజకీయ ప్రచార చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. దాడిపై తక్షణ స్పందన ఎందుకు కొరవడిందన్న ప్రశ్నకు 'ప్రధానికి సమాచారం సకాలంలో అందలేదు'అన్న హాస్యాస్పద సమాధానం లభించింది. పుల్వామా దారుణం తరువాత రెండు సార్లు అఖిలపక్ష సమావేశం జరుగగా రెండింటికీ డుమ్మా కొట్టిన ప్రధాని మోడీ దక్షిణ కొరియాలో అవార్డు అందుకునేందుకు ఆగమేఘాలమీద హాజరయ్యారు. వీటన్నిటికీ పరాకాష్టగా గురువారం ఆయన ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ను చెప్పవచ్చు. ప్రపంచ చరిత్రలోనే మొదటిదిగా కమలనాథులు ప్రచారం చేసుకుంటున్న, దేశవ్యాప్తంగా 15వేల కేంద్రాలలో కోటిమంది బీజేపీ బూత్స్థాయి కార్యకర్తలు పాల్గొన్న ఆ కాన్ఫరెన్స్లో ప్రధాని మాట్లాడుతూ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోశారు. సైన్యానికి తామంతా అండగా నిలుస్తామని ప్రతిపక్షాలు పదేపదే చెబుతున్నప్పటికీ నరేంద్ర మోడీ వాటిపై విరుచుకుపడడం గమనార్హం. కాగా, అదేసమయంలో శత్రుదేశ చెరలో చిక్కి సాటిలేని ధైర్యసాహసాలతో దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసిన వాయుసేన యోధుడు అభినందన్ పేరెత్తక పోవడం గర్హనీయం. అధినాయకుని వాలకం చూసి కమలనాథులు మరింతగా రెచ్చిపోయి యుద్ధవాతావరణాన్ని ఎన్నికల సాధనంగా మలచుకునేందుకు పోటీలు పడుతున్నారు. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాయని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. ఆ వ్యాఖ్యలపై పెద్దఎత్తున దుమారం రేగినా ఏమాత్రం చలించకుండా తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం, యడ్యూరప్ప వ్యక్తిగత నైజాన్నే కాక, మొత్తం కమలనాథుల ఆలోచనా విధానాన్ని చాటిచెపుతోంది.
మతం- యుద్ధం ఇవి రెండూ తమకు సులువుగా ఓట్లు సాధించిపెట్టే సాధనాలుగా భావిస్తారు హిందూత్వ వాదులు. 1992 రామజన్మభూమి, 2002 గుజరాత్ గోద్రా, 1999 కార్గిల్ యుద్ధాలను తమ ఎన్నికల విజయానికి సోపానంగా మార్చుకోవడంలో సఫలమయ్యారు కూడా! ఇప్పుడు పుల్వామా అనంతర పరిణామాల నేపథ్యంలో దేశంలో అలముకున్న యుద్ధవాతావరణాన్ని కూడా రాబోవు సార్వత్రిక ఎన్నికల విజయానికి సోపానంగా మార్చుకునే ఎత్తుగడను శరవేగంగా అమలు చేస్తున్నారు. మోడీ చర్యలను ప్రశ్నించే వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తూ, మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయడం జాతివ్యతిరేకమన్న భావనను వ్యాప్తి చేస్తున్నారు. బాహ్య, అంతర్గత శత్రువులతో జాతి ప్రమాదంలో పడిందనీ, ఆ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడే శక్తి ఒక్క మోడీకి మాత్రమే ఉన్నదని ఊదరగొడుతున్నారు. పుల్వామా ఘటనకు ముందటి ఎన్నికల నినాదాలు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు. సంక్షేమం, అవినీతీ తదితర విషయాలు అటకెక్కాయి. 21ప్రతిపక్ష రాజకీయ పార్టీల కూటమి మహాఘట్ బంధన్ కాదు మహాకల్తీ. వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే దేశం అత్యవసర చికిత్స గది(ఐసీయూ)లోకి వెళుతుందని స్వయంగా మోడీ ప్రచారం చేస్తున్నారు. శాంతి వచనాలు దేశ ద్రోహాలుగా చిత్రీకరించ బడుతున్నాయి. పుల్వామా అమర వీరుడు బబ్లే సంత్రా సతీమణి మీతా సంత్రా దేశహితం కోరి 'యుద్ధానికి బదులు చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలి. యుద్ధం జరిగితే మరింత ప్రాణనష్టం జరుగుతుంది.' అని పలికిన హిత వ్యాఖ్యలపై మోడీగణం విరుచుకు పడుతున్నారంటే కాషాయంబరులు యుద్ధోన్మాదాన్ని ఎంతగా రెచ్చగొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గురువారం 21ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా మోడీ చర్యలను ఎండగడుతూ ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.
యుద్ధవాతావరణం సహజంగానే జాతిని సమైక్యం చేస్తుంది. ఈ సమైక్య భావన అధికారపార్టీ ఉపయోగిం చుకునే ప్రయత్నం చేస్తుంది. యుద్ధం ద్వారా దేశ ప్రజలు ఎదుర్కొనే కష్టనష్టాల నుంచి వారిని కాపాడే బాధ్యత, అధికారం ప్రధానంగా అధికారపార్టీకే ఉంటాయి కాబట్టి అధికారపార్టీ విజయాలుగా ప్రజలలో ప్రచారం చేసుకుంటుంది. ఈ స్థితిలో ప్రభుత్వ చర్యలు ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అధికార పార్టీపై ప్రతిపక్షాలు కటువుగా విమర్శిస్తే వారికి దేశభక్తి లేదని ఎదురుదాడి చేస్తారు. ఈ పరిస్థితులను రాజకీయంగా సొమ్ముచేసుకునే అవకాశం అధికారపక్షానికి ఇస్తే అంతిమంగా ప్రజలే నష్టపోతారు. స్వల్పకాలిక ఎన్నికల ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక దేశ ప్రయోజనాలు బలి అయిపోతాయి. ఈ స్థితిలో జనం జాగురూకతే దేశానికి రక్ష!