Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవాళి క్షేమం గురించి తలపోసే వారు యుద్ధాన్ని కోరుకోరు. చరిత్ర పొడుగునా రాజులు, చక్రవర్తులు, నియంతలు మాత్రమే యుద్ధాల్ని చేశారు. సామ్రాజ్య విస్తరణకాంక్షతో, అధికారపు ఉన్మాదంతో యుద్ధాలకు దిగారు. రాజులు తమ కోటల్ని, ప్రాంతాల్ని కాపాడుకోడానికి కత్తులు దూసారు. సైన్యాల్ని నిర్మించుకుని పరదేశాల సైన్యాలనే కాదు ప్రజల్ని సైతం ఊచకోత కోశారు. చరిత్ర పుటలనిండా యుద్ధపు రక్తమరకలే కనిపిస్తాయి. ఆటవిక దశలోనే కాదు అత్యంత ఆధునిక దశలోనూ గుణపాఠాలు నేర్చుకోలేదు. యుద్ధాల్ని విడనాడే విజ్ఞత ప్రదర్శించలేదు.
అశేష జనావళి యుద్ధాలకు దూరంగా ఉండాలనే అనుకుంటారు, రెక్కలకష్టం మీద బతికేవారు ఏనాడూ యుద్ధాల్ని వాంఛించలేదు. తమ శ్రమశక్తిని దోచుకున్నప్పుడు తిరగబడ్డారే తప్ప యుద్ధం తమ సమస్యలకు పరిష్కారమని భావించలేదు. ఎక్కడయినా, ఎప్పుడయినా మామూలు మనుషులు దాడులకు, దురాక్రమణలకు వ్యతిరేకం. పాలకవర్గాలే యుద్ధాలకు కాలుదువ్వుతాయి. ఆధునిక దేశాల ఆవిర్భావం తర్వాత పాలకుల దురహంకారం మరింత పెరిగింది. మార్కెట్ శక్తుల విజృంభణ ఫలితంగా సంపన్నదేశాలు, అధికారవర్గాలు యుద్ధాలకు ఊతమిచ్చాయి. చిన్నపాటి ఘర్షణల్ని సైతం యుద్ధాలకు పురిగొల్పేలా రెచ్చగొట్టాయి. అగ్రరాజ్యాల ఆయుధ వ్యాపారులు సరిహద్దు తగాదాలకు ఆజ్యం పోశారు. పదవుల్లో ఉన్నవారు పీఠాల్ని కాపాడుకునేందుకు ఈ తగాదాలే ఆసరా అయ్యాయి.
రాజ్యంలో ఆదరాభిమానాలు కోల్పోతున్న రాజు పరదేశాల మీద దాడులకు తెగబడి దేశభద్రత పేరిట ప్రజల్ని లోబరుచుకోవాలని మాకియవెల్లి అనే రాజనీతివేత్త అయిదు శతాబ్దాల కిందట చెప్పాడు. ఆ సూత్రాన్నే నేటికీ అమలు చేస్తున్నారు పాలకులు. జాతిభద్రత, దేశరక్షణ, ప్రాదేశిక సమగ్రత పేరిట ప్రజల భావోద్వేగాలతో జూదమాడుతున్నారు. పొరుగుదేశం పేరే చరిత్రలోంచి చెదిరిపోవాలనే ప్రకటనలు నేతల యుద్ధోన్మాదాన్ని సూచిస్తున్నాయి. కానీ శాంతికాముకులైన ప్రజలు యుద్ధాల్ని నిరసిస్తారు. పాలకుల కుటిల వ్యూహాల పట్ల అప్రమత్తులై తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తారు.
మనుషుల ప్రాణాలంటే లెక్కలేని పాలకవర్గాల క్రూర మనస్తత్వం ఎంతటి దారుణాలకు దారితీసిందో లియో టాల్స్టారు 'యుద్ధం-శాంతి' నవలలో చిత్రించారు. సామాన్యుల్ని హింసకీ, అగచాట్లకు గురిచేసే యుద్ధబీభత్సాన్ని 150ఏండ్ల కిందటే రూపుగట్టించారాయన. మనుషుల్ని హతమార్చే యుద్ధక్రీడ పాశవికతను నిరసించిన బృహత్తర నవల 'యుద్ధం-శాంతి'. అనేక భాషల్లోకి అనువాదమై లక్షలాది కాపీలు అమ్ముడయిన ఈ పుస్తకాన్ని ఈతరం చదవాలి.
పాలకుల సమరోన్మాదంలో ముఖ్యంగా బలయ్యేది మహిళలే. అన్నివిధాలుగా వారు బాధితులవుతారు. కోటలు శత్రువశమైనపుడు వందలాదిమంది మహిళలు ఆత్మాహూతి చేసుకున్న సందర్భాలు భారతదేశ చరిత్రలో చూస్తాం. ఆక్రమిత ప్రాంతాల్లో శత్రుసైనికుల దాడిలో శలభాలయ్యేది మహిళలు, పిల్లలే. అందుకే సోవియట్ రచయిత్రి, నోబెల్ బహుమతి గ్రహీత స్వెత్లానా అలెక్సీయెవిచ్ యుద్ధాల్ని బలంగా వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆమె స్వయంగా యుద్ధక్షేత్రాల్ని సందర్శించి, అక్కడి పరిస్థితులకు స్పందించి అనేక కథలు, నవలలు రచించారు. తనది కల్పన కాదు, కరకు వాస్తవమని చెప్పిందామె. ఆమె సృజించిన 'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' అన్న రచన తెలుగులో మరింత ఆదరణ పొందింది. యుద్ధం ఏ రకంగానూ వాంఛనీయం కాదని ఆమె రచనలు చదివిన వారు అంగీకరిస్తారు. ''మీరు ప్రజల మీద యుద్ధం చేయకండి. భావాలపైన యుద్ధం ప్రకటించండి. ఈ ప్రపంచాన్ని అనివాసయోగ్యంగా మలుస్తున్న, యుద్ధక్షేత్రంగా మలుస్తున్న భావాలను చంపేయండి. ప్రజల్ని వదిలేయండి'' అన్న ఆమె నవలలోని ఒక సైనికుని ఆకాంక్షనీ, ఆర్తినీ అర్థం చేసుకోవాలి.
మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల వల్ల వాటిల్లిన నష్టాల్నించి ఇంకా మానవాళి కోలుకోలేదు. అణుబాంబుల దాడికి గురయిన జపాన్ తనని తాను తిరిగి నిర్మించుకోడానికి ఎంతో మూల్యం చెల్లిస్తున్నది. పాలకుల యుద్ధోన్మాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు రక్తమోడుతున్నాయి. ఇరాక్ మీద విరుచుకుపడిన అమెరికా సైన్యాల పదఘట్టనలో లక్షల మంది ప్రాణాల్ని కోల్పోయారు. ఈనాటికీ అక్కడ శాంతి నెలకొనలేదు. పాలస్తీనా, సిరియా తదితర ప్రాంతాల్లో తుపాకుల గర్జనల మధ్య జనావళి దినదినగండం అన్నట్టుగా బతుకులు వెళ్ళదీస్తున్నది.
సినిమా రంగం కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ స్పందించిన ఉదంతాలున్నాయి. ఇవాళ యుద్ధానికి సన్నద్ధం కమ్మని పేరొందిన హీరోలు ప్రకటనలిస్తుంటే ఆనంద్ పట్వర్థన్ తీసిన 'జంగ్ ఔర్ అమన్' అనే సినిమా స్ఫురణకొస్తుంది. జంగ్ అంటే యుద్ధం. అమన్ అంటే శాంతి. 2003లోనే ఇంటర్నేషనల్ వీడియోఫెస్ట్లో బహుమతి గెలుచుకున్న చిత్రమిది. భారత్, పాకిస్థాన్ పాలకులు పోటీపడి అణ్వాయుధ సంపత్తి పెంచుకుంటున్న తీరుపై పదునైన నిరసన స్వరం ఈ చిత్రం. యుద్ధాలకు పురిగొల్పడం కాదు, శాంతిభావనల్ని ప్రోది చేసే ఈవిధమైన చిత్రాల్ని తీయాలి. ఇరుగుపొరుగు క్షేమంగా ఉండాలంటే స్నేహవారథులు నెలకొనాలి. ప్రజల మధ్య యుద్ధ వ్యతిరేక భావసమైక్యత పాదుకోవాలి. సమస్యల్ని పరిష్కరించుకునే సౌహార్ద్రం, సంయమనం ఉండాలి. యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే నేతల కుటిల వ్యూహాలకు లొంగని చైతన్యశీలత ఇనుమడించాలి. దీనికి అవసరమైన సాహిత్య, సాంస్కృతిక వికాసం ఇవాళ్టి అవసరం.