Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీకి 150సీట్లూ కాంగ్రెస్కు 100సీట్లూ దాటవని వ్యాఖ్యానించారు. అలాగే మరో అడుగు ముందుకేసి భావసారూప్యత గల ప్రాంతీయ పార్టీలకు 100సీట్లు ఖాయమని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 16సీట్లు ఇస్తే కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు నేరవేర్చుకోవచ్చనీ మనమాట వినే కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చుకోవచ్చనీ సెలవిచ్చారు కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన మాటలనే పరిగణనలోకి తీసుకుంటే, భావసారూప్యత అంటే ఏంటి? ఇప్పటిదాకా కేంద్రంపై చేయలేని ఒత్తిడిని ఇకముందెలా తెస్తారు? అన్న ప్రశ్నలు ఉదయించకమానవు. నిన్న, మొన్నటి దాకా కేంద్రం అడుగులకు టీఆర్ఎస్ మడుగులొత్తుతూ వచ్చింది. నోట్ల రద్దు దగ్గర నుంచి జీఎస్టీ బిల్లు వరకు బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే వేగంగా గులాబీ సర్కారు మద్దతునిచ్చింది. అయినా మన రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూపలేదు కేంద్రం. ఇప్పుడేమో 16లోక్సభ సీట్లు, భావసారూప్యత గురించి చెబుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో ఉన్నవి మొత్తం లోక్సభ సీట్లే 17. అందులోని 14సీట్లు ప్రస్తుతం టీఆర్ఎస్వే. గతంలో ఉన్న 14సీట్లకు, ఇప్పుడు అడుగుతున్న 16సీట్లకూ పెద్ద తేడా ఏమీ లేదు. అయినా ఇప్పటిదాకా కేంద్రంతో సఖ్యతగా ఉండి సాధించింది ఏమిటీ? ఢిల్లీకి వెళ్లి రోజుల తరబడి ఉండటం, పదే పదే ప్రధాని నరేంద్రమోడీ వినతిపత్రాలు ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయినా కేంద్రం ఏమాత్రం సహకరించిందనీ, మోడీ పాపాలకు అండగా నిలబడ్డారు. ఒక్కటేమిటి.. దాదాపు అన్ని విషయాల్లోనూ మోడీకి సాగిలపడ్డారు. అయినా మోడీ కరుణించిన దాఖలాల్లేవు. తాజాగా రెండు వారాల క్రితం ప్రధానిని కలిసి 16సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అది కూడా ఎన్డీయే సర్కారు చెత్తబుట్టలోకి విసిరేసింది. ఇప్పుడు సమస్యలు పరిష్కరించని కేంద్రం, 16సీట్లు గెలిపిస్తే.. భవిష్యత్తులో ఎలా చేస్తుంది? ఫ్రెండ్లీ సర్కారు ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, అవినీతి, ధరలు, ఫెడరల్ స్ఫూర్తి గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాయి. జాతీయంగా నిధుల విషయంలో నిటిఅయోగ్ తప్పుడు నిర్ణయం, ఈశాన్య రాష్ట్రాల పౌరసత్వ సమస్య తదితర సమస్యలు ఉత్పన్నమైనప్పుడు టీఆర్ఎస్ స్పందించలేదు. తన విధానాన్నీ ప్రకటించలేదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల విషయానికొచ్చినప్పుడు కాళేశ్వరం జాతీయ హోదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ప్లాంట్ తదితర సమస్యలను పరిష్కరించుకోవడంలో బీజేపీతో ఇప్పటికే ఉన్న స్నేహం పనికిరాలేదా? విభజన హామీలు గాలికి కొట్టుకుపోయాయి. గిరిజనులు, మైనార్టీ రిజర్వేషన్లను పేరుకు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపి చేతులను దులుపుకున్నది టీఆర్ఎస్ సర్కారు. తమిళనాడు ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంటే కేసీఆర్ చడీచప్పుడు చేయలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, రా, కాగ్, తదితర వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నా, న్యాయమూర్తుల మీద ఒత్తిడి చేస్తున్నా కుయ్యిమనీ అనలేదు. రాఫెల్ యుద్ధవిమానాల విషయంలో దేశమంతా బీజేపీ వైపు అనుమానంగా చూస్తున్నా, తనకేమీ సంబంధం లేనట్టు వ్యవహరించారు. నిర్లక్ష్యం చేశారు. పశ్చిమబెంగాల్లో సీబీఐ అధికారులకూ, బెంగాల్ పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తినా కేసీఆర్ స్సందించలేదు. అంతేగాక అంతకుముందే ఫెడరల్ ఫ్రంట్పై దీదీతో రెండుసార్లు భేటీ అయినప్పటికీ, కేంద్రానికి వ్యతిరేకంగా పన్నెత్తి మాట మాట్లాడలేదు.
పుల్వామా ఘటనను ఎన్నికలకు మోడీ వాడుకోవడం, ఎన్నికలకు ముందే యుద్ధం వస్తుందని బీజేపీ తనకు ముందే చెప్పిందని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించడం అందరికీ తెలిసిందే. కాశ్మీర్ విషయంలో కనీసంగా కూడా స్పందించలేదు. దేశ భద్రతకు సంబంధించి అఖిలపక్షాన్నీ రెండుసార్లు పిలిచిన కేంద్రం, ఆ సమావేశాలకు నరేంద్రమోడీ డుమ్మా కొట్టడాన్ని ప్రతిపక్షమంతా ఏకమై ప్రశ్నించింది. అప్పుడూ కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. ఇలా అనేక విషయాల్లోనూ టీఆర్ఎస్కు స్పష్టమైన విధానమంటూ లేదని తేటతెల్లమైంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భావసారూప్యత పేర 100సీట్లు వస్తాయనడం ఆశ్చర్యకరం. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ అంటున్న టీఆర్ఎస్ భావసారూప్యత అంటే ఏమిటో, ఏయే విషయాలలో ఏయే పార్టీలతో టీఆర్స్కు భావసారూప్యత ఉన్నదో మాత్రం చెప్పలేదు. కీలకమైన ఏ సందర్భంలోనూ మాట్లాడలేదు. బీజేపీతో అంతర్గత అవగాహన ఉందని ఇతర పార్టీలు గులాబీ పార్టీపై ఆరోపణలు చేస్తున్నా, కేసీఆర్ సమాధానం చెప్పకపోవడం అందరూ గమనిస్తున్నదే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అవకాశవాదమే విధానంగా పెట్టుకున్నదన్న విమర్శకు జవాబు చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ నాయకత్వంపైన ఉన్నది.