Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దశాబ్ధాల తరబడి రగులుతూ ఉన్న రామజన్మభూమి వివాద పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యవర్తి సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్గగోరు నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు మార్గాలు సూచించేందుకు ముగ్గురు సభ్యులతో ప్యానల్ను నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మొహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా నేతృత్వం వహించే ఈ మధ్యవర్తుల బృందంలో శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచూలు సభ్యులుగా ఉంటారు. మధ్యవర్తుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ కీలకనిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎనిమిది వారాల గడువు విధించింది. అలాగే, మధ్యవర్తిత్వ బృందం కార్యకలాపాలను మీడియా రిపోర్ట్ చేయరాదని ఆదేశించింది. మధ్యవర్తుల బృందం ఫైజాబాద్ కేంద్రంగా పనిచేయాలని, నాలుగువారాల తరువాత ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రగతి నివేదిక కోర్టుకు సమర్పించాలని నిర్ధేశించింది.
రామజన్మభూమి వివాదం దేశ ప్రజల మనోభావాలను మాత్రమే కాదు, రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. భారత రాజకీయాలు బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు, కూల్చివేత తరువాత అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. 1949లో మొదలైన రామజన్మభూమి వివాదాన్ని తమ చేతుల్లోకి తీసుకోకముందు, నేడు అధికారంలో ఉన్న బీజేపీ పార్లమెంటులో కేవలం ఇద్దరు సభ్యులను మాత్రమే కలిగి ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుంచుకుంటే.. ఈ వివాదాన్ని రాజకీయంగా ఆ పార్టీ ఎంతగా ఉపయోగించుకుందో అర్థమవుతుంది. విద్వేష భావజాలమే సిద్ధాంతంగా కలిగిన సంఘపరివార్ శక్తులు రామజన్మభూమి చుట్టూ ప్రజల భావోద్వేగాలను కేంద్రీకరించి రాజకీయంగా బలపడ గలిగారు. ఇప్పటికీ తమకు రాజకీయ అవసరం ఏర్పడిన ప్రతిసారీ రామజన్మభూమి వివాదాన్ని రాజేయగలుగుతున్నారు. ఇలా మతాన్నే ప్రధాన రాజకీయ ఆయుధంగా ప్రయోగించగల శక్తులు అధికారంలో ఉండడంతో రామజన్మభూమి వివాద పరిష్కారం మరింత సంక్లిష్టమైపోయింది.
ఎప్పడో శతాబ్ధాల క్రితం మొఘల్ చక్రవర్తి బాబర్ ఇప్పుడు హిందూత్వవాదులు రామజన్మభూమిగా చెపుతున్న చోట మందిరాన్ని పడగొట్టి మసీదును నిర్మించారని ఆరోపించింది సంఘపరివార్. ఆ సాకుతో మసీదును పడగొట్టి అక్కడ తిరిగి రామమందిరాన్ని నిర్మించడమే తమ ధ్యేయమనీ ప్రకటించుకున్న సంఫ్ుపరివారం బాబ్రీ మసీదును కూల్చడం ద్వారా తమ లక్ష్యంలో సగభాగాన్ని సాధించగలిగింది. అప్పటివరకూ పాలకుల చేతుల్లో ఉన్న ఈ వ్యవహారం ఆ తరువాత పూర్తిగా న్యాయవ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాలకుల చేతుల్లోనే ఈ వ్యవహారం ఉండిఉంటే పరిస్థితి చేయిదాటిపోయేది. పర్యావసానాలు ప్రమాదకరంగా మారేవి. కానీ, వ్యవహారం న్యాయవ్యవస్థ చేతుల్లో ఉండడంతో ఈ శక్తుల పప్పులుగకడంలేదు. అయినా ఆ శక్తులు న్యాయవ్యవస్థపై తీవ్ర వత్తిడి తేవడం మానలేదు. అయినా, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా, తన స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ వివాదం ద్వారా దేశం అల్లకల్లోలం కాకుండా కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా వివాద పరిష్కారానికి మధ్యవర్తులను నియమించడం, ఖచ్చితమైన స్వల్పకాలిక గడువు విధించడం ద్వారా ఏకాభిప్రాయ సాధనకు ఒక ప్రయత్నం ప్రారంభించింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యకు పరిష్కారం దొరికితే మంచిదే. సాధ్యాసాధ్యాలు వేచి చూడవల్సిందే.
నేటి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయత్నిస్తే తప్ప గతాన్ని తవ్వుకుంటూపోతే ఈ వివాదానికి పరిష్కారం లభించదు. సాక్ష్యాలు లేని, నమ్మకాలపై ఆధారపడి వర్తమానంపై ఇచ్చే తీర్పులు విషాదాన్ని నింపే ప్రమాదముంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే సర్వోన్నత న్యాయస్థానం సమస్య పరిష్కారానికి మధ్యవర్తుల సహాయం కూడా తీసుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నది. ఈ మధ్యవర్తుల కృషి ద్వారా సామరస్యంగా పరిష్కారానికిమార్గం ఏర్పడితే ఇరుపక్షాలకు మాత్రమే కాదు, మొత్తం దేశ ప్రజలందరికీ సంతోషమే. కానీ అప్పుడే విశ్వహిందూపరిషత్ లాంటి శక్తులు కోర్టు తీర్పును గౌరవిస్తాం కానీ అంగీకరించలేమని మెలికవేస్తున్నాయి. భేషజాలకు పోకుండా, రాజకీయ ప్రయోజనాల రొచ్చు అంటించకుండా ఇరువర్గాల పెద్దలూ మధ్యవర్తుల బృందానికి సహకరించి శాంతియుతంగా సమస్య పరిష్కారానికి తోడ్పడాలి. సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలు ఇకనైనా ఆపాలి. సమస్య గర్భంలోనే పరిష్కార మార్గమూ దాగి ఉంటుంది. ప్రపంచ చరిత్రలో పరిష్కరించుకోలేని సమస్య అంటూ ఏదీ లేదు. అయితే పాలకులు విజ్ఞతతో ప్రజల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే రక్తపాత రహితంగా సమ్యలు పరిష్కరించబడుతాయి. అలా కాకుండా రాజకీయ స్వార్థంతో వ్యవహరిస్తే ప్రజల మధ్య సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి నష్టం లేకుండా ఈ వివాదం సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో మధ్యవర్తుల ద్వారానే పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ఆశిద్దాం. అందుకు సహకరిద్దాం. అంతిమంగా కోర్టు తీర్పుకు కట్టుబడదాం. అదే ఈ దేశ భవిష్యత్తుకు క్షేమకరం.