Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడినీ, దానిపై ప్రతీకార దాడులను అడ్డం పెట్టుకుని ఈ అయిదేండ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నది బీజేపీ. కానీ ప్రభుత్వాన్ని రాఫెల్ వివాదం ఇంకా వెంటాడుతూ ఉండగానే సార్వత్రిక సమరానికి సైరన్ మోగింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదంలో క్రమేణా మోడీ సర్కార్ దోషిగా తేలుతున్నది! ఒక అబద్ధాన్ని నమ్మించడానికి వంద అబద్ధాలాడుతూ, ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వరుస తప్పులు చేస్తూ ఈ ఒప్పందం వెనుక పెద్ద గుట్టే దాగుందని చెప్పకుండానే ఒప్పుకుంటున్నది! నిన్నటిదాకా మీడియాలో వెలువడిన ప్రసారాలూ కథనాలూ వాటి ఆధారంగా చూపిన రక్షణశాఖ పత్రాలూ అన్నీ అబద్ధాలేనని బుకాయించిన ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు ముందు రక్షణశాఖ రహస్య పత్రాలు దొంగిలించబడ్డాయనే తప్పుడు వాదనకు దిగడం దీనిని మరింత రుజువు చేస్తున్నది.
రహస్య పత్రాలు దొంగిలించబడ్డాయన్న తాజా వాదన ద్వారా ప్రభుత్వం ప్రజల్లో నెలకొన్న ఓ సందేహాన్ని నివృత్తి చేయగా, కొత్తగా మరో సందేహాన్ని రేకెత్తిస్తోంది. ఈ సందేహాలు రెండూ ఈ ఒప్పందంలో ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలనే సూచిస్తుండటం గమనార్హం! ఇప్పటిదాకా 'ది హిందూ' ప్రచురించిన డాక్యుమెంట్సే అబద్ధమని కొట్టిపారేసిన ప్రభుత్వం ఇప్పుడు డాక్యుమెంట్స్ దొంగిలించబడ్డాయని చెప్పటమంటే ఆ డాక్యుమెంట్స్ నిజమేనని అంగీకరించడమే! కనుక హిందూ ప్రచురించిన పత్రాలు నిజమా అబధ్ధమా అన్న సందేహాలకిక తావులేదన్నది ఎంత నిజమో ఆ పత్రాల్లోని విషయమూ అంతే నిజమన్నది స్పష్టం. అంటే... రాఫెల్ డీల్లో భారత రక్షణశాఖ సంప్రదింపుల బృందానికి సమాంతరంగా ప్రధానమంత్రి కార్యాలయమూ చర్చలు జరిపిందనీ, మన సంప్రదింపుల బృందం నియమ నిబంధనల మేరకు సంబంధిత దసాల్ట్ కంపెనీకి బ్యాంకు గ్యారంటీ, ఫ్రాన్స్ ప్రభుత్వ సావరిన్ గ్యారంటీ కోరుతుండగా... ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం అవేవీ అవసరంలేదని చెప్పడమే కాక, ఇందులో అవకతవకల నివారణకు ఉద్దేశించిన యాంటీ కరప్షÛన్ క్లాజు ఎత్తేసి మరీ ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకుందనీ తేటతెల్లమవుతున్నది. దీనితో ఈ యుధ్ధవిమానాల కొనుగోలులో భారీ కుంభకోణం దాగుందనీ, హెచ్ఏఎల్ స్థానంలో రిలయన్స్ను చేర్చేందుకు ప్రభుత్వం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టిందనీ, ఫలితంగా రక్షణ వ్యవస్థకు నష్టం జరగడమే కాకుండా వేలకోట్ల ప్రజాధనం ప్రయివేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిందనీ తేలుతున్నది.
ఇక రక్షణశాఖ రహస్య పత్రాలనే కాపాడలేని వారు దేశ భద్రతనెలా కాపాడుతారన్నది కొత్తగా తలెత్తుతున్న సందేహం! ఇదే ఆంశంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తడంతో నాలుక కరుచుకున్న ప్రభుత్వం, పోయింది అసలు పత్రాలు కాదనీ, వాటి నకలు అని మాట మార్చడం మరింత విస్మయానికి గురిచేస్తున్నది. పోయింది నకలైనా అది అసలుకు కాపీయే కదా! తన సురక్షిత హస్తాల్లోనే దేశం భద్రంగా ఉంటుందని చెప్పుకుంటున్న మోడీ మాటలన్నీ ఉత్త డొల్లేననడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పైగా ఈ రహస్యాలు ఛేదించిన వార్తాసంస్థలపై బెదిరింపులకు దిగుతున్నారు. ఎమర్జెన్సీ తరువాత పత్రికారంగంపై ఈ రకమైన బెదిరింపులను ఈ దేశం తొలిసారిగా చూస్తున్నది! ప్రభుత్వ అటార్నీ జనరల్ స్వయంగా సుప్రీంకోర్టు వేదికగానే ఈ బెదిరింపులకు వొడిగట్టారు! రక్షణశాఖ రహస్య పత్రాలను, వాటి ఆధారంగా కథనాలను ప్రచురించిన వార్తా సంస్థలపై అధికార రహస్యాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని ప్రకటించటం బెదిరింపు కాక మరేమవుతుంది?
నిజానికి ఈ ఒప్పందంలో తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టింది ప్రభుత్వమే. కాగా ఆ నిజాన్ని బయటపెట్టి తన కర్తవ్యాన్ని నిర్వహించింది మీడియా. మోడీ ప్రభుత్వం అనుసరించిన అవకతవకలను, అవినీతిని, ఆశ్రితపక్షపాతాన్నే మీడియా వెల్లడించింది తప్ప దేశరక్షణ రహస్యాలకెక్కడా భంగం కలిగించలేదు. కాబట్టే తాము తమ బాధ్యతను మాత్రమే నిర్వహించామనీ, ఈ బెదిరింపులు అనైతికం, అప్రజాస్వామికమనీ, వాటికి ఎంతమాత్రం భయపడబోమనీ స్పష్టం చేస్తున్నారు 'ద హిందూ పబ్లిషింగ్ గ్రూప్' చైర్మన్ ఎన్.రామ్. ఆయన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. గతంలో రాజీవ్గాంధీ హయాంలో బోఫోర్స్ బండారాన్ని బయటపెట్టింది కూడా పాత్రికేయులేనన్నది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.. అప్పట్లో పత్రికల కృషిని అభినందించటమే కాక, బోఫోర్స్ను అడ్డుపెట్టుకుని ఇప్పటికీ కాంగ్రెస్ను ఎత్తిపొడిచే మోడీ పరివారం తమదాకా వచ్చేసరికి తప్పుబడుతున్నది! బెదిరింపులతో తప్పించుకో జూస్తున్నది! ఇప్పుడే కాదు, రాఫెల్ డీల్పై గత ఏడాదికాలంగా వరుస కథనాలు వెలుగుచూస్తున్నాయి. ఇవి ఈ ఒప్పందం ముసుగులోని లొసుగులన్నీ ఒక్కొక్కటిగా వెలికితీస్తుంటే మోడీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. మొదటి నుంచీ తన డొంకతిరుగుడు సమాధానాలతో, దాటవేత ధోరణులతో, అడ్డదారులు తొక్కుతూ న్యాయస్థానాన్నే కాదు, పౌరసమాజాన్నీ పక్కదారి పట్టిస్తున్నది. సరిగ్గా ఎన్నికల ముంగిట కమలనాథుల కపటనీతి మరోసారి పట్టుబడ్డ వేళ...ఇప్పుడు తీర్పు చెప్పాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే కాదు... ప్రజాకోర్టు కూడా!