Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమే. పెద్దనోట్ల రద్దు నుంచీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వరకూ ప్రతీదాంట్లోనూ పారదర్శకత ఎక్కడుందీ? జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడీ బాలాకోటాలో సర్జికల్ దాడులూ అంతే! అసలు మోడీ చెప్పేవాటికి, చేస్తున్నదానికి పొంతనే లేదు. పెద్దనోట్ల రద్దుపై ఆర్బీఐ తాజా ప్రకటనతో ఎన్నికల ముందు కేంద్రం గుట్టు బట్టబయలైంది.
పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం అమలుచేసినా ఆర్బీఐ ఎలా అంగీకరించిందన్న ప్రశ్నలు అప్పట్లో వినిపించాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం పడిన ఈ అంశంలో కేంద్రానికి సూచనలు చేయలేదా? ఇలాంటివెన్నో సందేహాలొచ్చినా మోడీ బుకాయించే ప్రయత్నం చేశారు. వెంకటేష్ నాయక్ అనే సమాచార హక్కు ఉద్యమ కార్యకర్త ప్రశ్నతో పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎలా జరిగిందన్న విషయం వెలుగులోకొచ్చింది. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ కేంద్రాన్ని ముందుగానే హెచ్చరించామని సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్బీఐ వెల్లడించింది. నిర్ణయం తీసుకోవడానికి ముందే తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పామనీ తెలిపింది. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రయోజనం ఉండదనీ, నల్లధనం ఆగబోదని అప్పుడే చెప్పేశామనీ వివరించింది. రియల్ ఎస్టేట్, బంగారం వంటి ఆస్తుల రూపంలో నగదు ఉన్నప్పుడు నోట్లరద్దు ఆ ఆస్తులపై ఎలాంటి వాస్తవ ప్రభావాన్ని చూపదని బోర్డు డైరెక్టర్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్దాస్ కూడా ఉన్నారు. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయటం వంటివి నోట్లరద్దు ప్రధాన లక్ష్యాలుగా ప్రధాని మోడీ చెప్పినప్పటికీ, వాటిపై నోట్లరద్దు ప్రభావం ఏ మాత్రం వుండబోదని శక్తికాంత్దాస్ డైరెక్టర్గా వున్న బోర్డు అభిప్రాయపడటం గమనార్హం. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను పెట్రోల్ పంపుల వద్ద అనుమతించటం ద్వారా రద్దయిన కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి చేరుతుందని విశ్వసించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. వాస్తవానికి 2016 నవంబర్ 8 సాయంత్రం 5 గంటలకు జరిగిన సమావేశ మినిట్స్ బుక్ ప్రకారం రిజర్వు బ్యాంక్ డైరెక్టర్లు పెద్దనోట్ల రద్దుకు సంబంధించి కొన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆనాడే జాతీయ మీడియాలో వార్తలొచ్చినా బీజేపీ, సంఫ్ుపరివార్ శక్తులు వాటిని దేశ వ్యతిరేకులుగా ముద్రవేసి నానా రభస సృష్టించాయి. ఎప్పటికైనా నిజం బయటపడక తప్పదని చెప్పడానికి సమాచార హక్కు చట్టానికి ఇచ్చిన సమాధానమే తార్కాణం. ప్రస్తుతం నోట్రూపంలో బహిరంగంగా వెల్లడి కావడంతో కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్నది వేచి చూడాలి. రద్దయిన దాదాపు అన్ని నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరినట్టు రిజర్వ్బ్యాంకు గత ఏడాది ఆగస్టు 29న సమర్పించిన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2016 నవంబర్ 8 నాటికి చెలామణీలో వున్న నోట్లలో దాదాపు 99.3శాతం మేర (15.31 లక్షల కోట్ల విలువైన) నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరాయి. నోట్ల రద్దు ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనం బయటపడుతుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ రు.10,720 కోట్ల విలువైన పెద్దనోట్లు మాత్రమే బ్యాంకుకు చేరలేదు. పెద్దనోట్ల రద్దు రేపిన చిచ్చు ఎంత కల్లోలం సృష్టించిందో చెప్పనవసరం లేదు. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా గాయం ఇంకా మానలేదు. దాన్ని తలచుకుని ప్రజానీకం బాధపడని రోజు లేదంటే ఆశ్చర్యమే. అది గుర్తుకొచ్చి నప్పుడల్లా దేశమంతా కుమిలిపోతున్నా పాలకుల్లో తప్పు చేశామన్న భావన కలగకపోవడం దురదృష్టం. ఆర్బీఐకి చెప్పే చేశామంటూ కేంద్రంలోని పెద్దలు చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినా నోట్లరద్దు నల్లధనం చెలామణీని నిరోధించ లేదని చెప్పిన విషయాలను బయటకు చెప్పలేదంటే ఏమనుకోవాలి?. తాము నమ్మినబంటు శక్తికాంత్దాస్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడే సహచట్టం కింద మినిట్స్ నోటు ఇవ్వడం బీజేపీ జీర్ణించుకుంటుందా అన్నది కష్టమే.
2014 ఎన్నికల ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వం అవినీతిమయమైందంటూ అధికారంలోకొచ్చిన మోడీ ఈ ఐదేండ్లలో చేసింది శూన్యం. పెద్దనోట్ల రద్దుతో అవినీతి మరింత పెరిగింది. ధనవంతులకు నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు ఉపయోగపడగా, పేదలను మరింత పేదలుగా చేసింది. దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని, రైతులు, చిన్నతరహా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు దెబ్బతింటారని సీపీఐ(ఎం) చెప్పినా కేంద్రం చెవికెక్కించుక ోలేదు. ఉగ్రవాదుల ఆట కట్టించడం మాట అటుంచి ఎలక్ట్రానిక్ లావాదేవీలతో ఉగ్రవాదుల పని మరింత తేలికైంది. నగదు చెలామణి మీద ఆధారపడుతున్న చిన్న వ్యాపారుల కడుపుకొట్టి వాల్మార్ట్ లాంటి విదేశీ బహుళజాతి సంస్థలకు లబ్ది చేకూర్చడం కోసమే నోట్లరద్దు నాటకమన్నది కొద్దిరోజుల్లోనే తేలింది. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ పెట్టుబడుల కోసమే మోడీ నోట్లరద్దు చేశారు తప్ప నల్లధనం వెలికితీత కోసం కాదన్నది ఆర్బీఐ ప్రకటనతో వెల్లడైంది. మోడీ ప్రభుత్వం అమలు చేసిన ఇలాంటి నియంతృత్వ పోకడలను అడ్డుకోవాలంటే రానున్న ఎన్నికల్లో తగురీతిన స్పందించటమే మార్గం.