Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన రక్షణ బడ్జెట్ కోసం అమెరికా తయారు చేసిన ప్రతిపాదనలు యావత్ మానవాళికే హెచ్చరికగా ఉన్నాయి. ఇతర దేశాలపై ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు చేస్తూ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలపై అమెరికా క్రూరమైన దాడులు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని దెబ్బతీస్తోంది. అత్యంత శక్తివంతమైన ఈ సామ్రాజ్యవాద అగ్రరాజ్యం ఒకవైపు ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణాలకు చేస్తున్న కేటాయింపులలో కోత విధిస్తూ మరోవైపు రక్షణ వ్యయాన్ని చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెంచుతోంది. రక్షణ మంత్రిత్వశాఖ (పెంటగాన్) వర్తమాన వ్యయంపై తన బడ్జెట్ను 2.4శాతం పెంచాలని కోరుతుండగా ట్రంప్ ప్రభుత్వం ఏకంగా దానికి రెండు రెట్లు అంటే 4.7శాతం పెంచుతూ ప్రతిపాదనలు తయారుచేసింది. పెంటగాన్ పెంచమని అడిగింది 17బిలియన్ డాలర్లు(ఒక బిలియన్ డాలరు దాదాపు రూ.7కోట్లకు సమానం) అయితే ప్రతిపాదనలు 34బిలియన్ డాలర్లకు తయారు చేశారు. 2018సంవత్సరంలో అమెరికా రక్షణ వ్యయం 750బిలియన్ డాలర్లు. 14 ప్రధాన దేశాలైన చైనా, సౌదీ అరేబియా, రష్యా, ఇండియా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇజ్రాయిల్, ఇరాక్ల సైనిక వ్యయాన్ని మొత్తం కలిపినా అమెరికా రక్షణ వ్యయంతో సమానం కాదు. ఓవర్సీస్ కాన్టిన్జెన్సీ ఆపరేషన్స్(ఓసీఓ) కోసం తయారుచేసిన ప్రతిపాదనలు బహుశా ఈ రక్షణ ప్రతిపాదనలన్నింటికంటే ప్రమాదకరం. ఎందుకంటే అప్ఘానిస్థాన్, ఇరాక్, సిరియావంటి దేశాలలో సైనిక జోక్యం చేసుకునేందుకు అయ్యే వ్యయం కోసమే కాకుండా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, రష్యా సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్ యుద్ధ క్రీడ కోసం కూడా ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ పద్దు కింద గతేడాది 69బిలియన్ డాలర్లను ఖర్చుచేస్తే, వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం ఊహాతీతంగా 164బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఓవర్సీస్ కాన్టిన్జెన్సీ ఆపరేషన్స్ కోసం 100బిలియన్ డాలర్లను అదనంగా వ్యయం చేయటానికి అమెరికా సంకల్పించటం ఇరాన్, రష్యా, చైనాలను కలవరపెడుతుందనటంలో సందేహం లేదు. ఇరాన్, వెనిజులావంటి దేశాలపై పూర్తిస్థాయి యుద్ధం చేయటానికి ఈ నిధులు సరిపోతాయి. ఈ 164బిలియన్ల కేటాయింపు చైనా రక్షణ బడ్జెట్కు దాదాపు సమానం. ఈ కేటాయింపు 63బిలియన్ల రష్యా రక్షణ బడ్జెట్కు మూడు రెట్లు ఉంటుంది. ప్రత్యేక విభాగాల కోసం తయారుచేసిన ప్రతిపాదనల్లో పరిశోధన, అభివృద్ధి విభాగానికి 104బిలియన్ డాలర్ల కేటాయింపును అభ్యర్థించారు. ధ్వనికంటే అమిత వేగం(హైపర్సోనిక్)తో ప్రయాణించే క్షిపణులు, విమానాలు, సైబర్ యుద్ధం, స్వయంచాలక యుద్ధక్షేత్ర ఆయుధాలలో ఉపయోగపడే కృత్రిమ మేధ తదితర విషయాల అభివృద్ధికి ఈ నిధుల్ని ఉపయోగిస్తారు. అలాగే నౌకాదళం రెండు అత్యాధునిక జెరాల్డ్ ఫోర్డ్ తరహా విమానవాహక నౌకలను సమకూర్చుకుంటుంది. ఈ నౌకల్ని నిర్మించటానికి ఒక్కోదానికి 13బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. అలాగే ఆధునీకరింపబడిన ఎఫ్-15 యుద్ధ విమానాలను బోయింగ్ నుంచి, ఎఫ్-35 యుద్ధ విమానాలను లాక్హీడ్ మార్టిన్ నుంచి వాయుసేన కొనుగోలు చేస్తుంది.
ఇలా అమెరికా ప్రభుత్వం రక్షణ బడ్జెట్ పెంపుదలకు సమాయత్తమవుతూ మరోవైపు ఆరోగ్య సంరక్షణకు కేటాయించే నిధులలో భారీ కోత పడేలా చేస్తోంది. ఈ కోత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గత పదేండ్లలో 2ట్రిల్లియన్ల డాలర్ల(ఒక ట్రిల్లియన్ డాలరు దాదాపు రూ.70లక్షల కోట్లకు సమానం) వరకు ఉంది. అంతేకాకుండా ఒబామా కాలంలో ప్రవేశపెట్టిన ఒబామా కేర్ పథకం రద్దు కాబోతోంది. దీనితో ఒక కోటిమంది ప్రజలకు ఆరోగ్య సంరక్షణ దూరమవుతుంది. ఫెడరల్ ప్రభుత్వ సామాజిక వ్యయం మరింత కుదింపునకు గురవుతుందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. పేదలకు అందించే ఆహార కూపన్లపై చేస్తున్న వ్యయంలో గత పదేండ్లలో 327బిలియన్ డాలర్ల కోతపెట్టింది. ఫెడరల్ ఉద్యోగుల రిటైర్మెంట్ సహాయంలో 200బిలియన్ డాలర్లు, కళాశాల విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించటానికి తీసుకునే అప్పుపై చేసే వ్యయంలో 207బిలియన్ డాలర్లూ తగ్గాయి.ఇంత జరుగుతున్నా అమెరికన్ కాంగ్రెసులో ప్రతిపక్షంలో వున్న డెమోక్రటిక్ పార్టీ, మీడియా తమ దృష్టిని సరిహద్దు గోడ కోసం ప్రతిపాదించిన 8.6బిలియన్ డాలర్ల పైనే కేంద్రీకరించాయి. ఈ అంశంపైనే జనవరిలో 35రోజులపాటు ప్రభుత్వం పాక్షిక మూసివేతకు గురైంది. ఇది కావాలని ప్రజల దృష్టి మరల్చే చర్య అని చెప్పక తప్పదు. ఎందుకంటే 4.6ట్రిల్లియన్ల అమెరికా బడ్జెట్లో డెమోక్రాట్ల అభ్యంతరాలు నామమాత్ర విషయాలపైనే ఉన్నాయి. ఇలా ట్రంప్ ప్రభుత్వంతో లాలూచీ కుస్తీ చేస్తూ అందుకు ప్రతిఫలంగా డెమోక్రాట్లు తమకు ప్రీతిపాత్రమైన మిలిటరీ-ఇంటెలిజెన్స్ యంత్రాంగానికి మరిన్ని నిధులను కేటాయింపజేసుకుంటారు. ఈ యంత్రాంగం యావత్ ప్రపంచానికి అత్యంత ప్రమాదకారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా రక్షణ బడ్జెట్ మానవాళి అస్థిత్వానికే సవాలుగా మారింది. కాబట్టి అమెరికా యుద్ధ పిపాసను నిలువరించటానికి ప్రపంచ స్థాయిలో ప్రజలు ఉద్యమించవలసి ఉంటుంది.