Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడులో దారుణం జరిగిపోయింది. అధికారపార్టీ అండదండలు ఉన్న ఓ ముఠా దాదాపు రెండు వందలమంది మహిళలను మాయమాటలతో లోబర్చుకుని, వారిని లైంగికంగా వాడుకుని ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న ఘోర ఉదంతం బయటపడింది. రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో ఈ ముఠా ఘోరాలు గత ఏడేండ్లుగా సాగుతున్నాయి. ఈ ముఠా వెనుక కొందరు మంత్రులూ అధికార అన్నాడీఎంకే పార్టీ నేతలూ ఉన్నారన్న వార్తలు భీతిగొలుపుతున్నాయి. అధికార, పోలీసుల అండలేకుండా ఈ ముఠా యిన్నేండ్లుగా ఇటువంటి ఘోరాలకు పాల్పడలేదన్నది సత్యం. ఫేస్బుక్ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని వారిని మభ్యపెట్టి లోబరుచుకుని, వారితో అశ్లీల చిత్రాలు తీసి ఆ తరువాత బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ ముఠాబారిన పడ్డవారిలో విద్యార్ధినులతోపాటు, ఉపాధ్యాయులూ ఇతర ఉద్యోగులూ ఉండటం గమనార్హం. ఇదే ముఠా బారినపడిన ఓ కళాశాల విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోర అకృత్యాలు వెలుగుచూశాయి. ఆ బాధితురాలితో ఫేస్బుక్ద్వారా పరిచయం పెంచుకుని మాయమాటలతో కారులో ఎక్కించుకుని, వివస్త్రను చేసి ఆ దృశ్యాన్ని వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ గత కొన్ని నెలలుగా డబ్బు గుంజుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేని ఆ విద్యార్థిని విషయం తన కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. అయినా పోలీసులు మొదట స్పందించ లేదు. ఇదే ముఠా నాయకుడు తిరునవక్కరసు అధికార అన్నాడీఎంకే నాయకుడు కావడంతో పోలీసులు కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిలోకం ఆందోళనలకు దిగడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. బాధితురాలి గుర్తింపును బహిర్గత పరచరాదని చట్టంలో ఉన్నా పోలీసులు ఆమె పేరు, చిరునామాలను బహిరంగం చేయడంపై రాష్ట్రంలో పెద్ద దుమారం రేగుతోంది. ఈ కేసుతో మంత్రులూ అధికార పార్టీ నాయకులకు సంబంధాలు ఉన్నాయని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్హాసన్ తీవ్ర ఆరోపణలు చేసారు. పొలాచ్చి పట్టణంలో 2012 నుంచి జరిగిన మహిళల ఆత్మహత్యల కేసులన్నిటినీ రీఓపెన్ చేయాలని ఆల్ఇండియా డెమొక్రటిక్ ఉమెన్ అసోసియేషన్(ఐద్వా) నాయకురాలు రాధిక డిమాండ్ చేశారు. అయినా ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పటికీ ఈ దారుణంపై స్పందించలేదు.
ఈ ముఠా చేతిలో చిక్కిన బాధితులు దాదాపు రెండువందలమంది ఉన్నారని వార్తలు వస్తున్నప్పటికీ పోలీసులు బాధితురాలి పేరు, కళాశాల, నివాస స్థలాన్ని బయట పెట్టడంతో మిగిలిన బాధితులు ముందుకు రావడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరుడిపై దాడి జరిగింది. దాడి చేసిన నిందితులు వసంతకుమార్, సింధిల్, నాగరాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఈ ముఠా సభ్యులైన వసంతకుమార్, శబరీష్, సతీష్, తిరునవుక్కరుసులను అరెస్టు చేసిన పోలీసులు వీరిపై 59/19, యు/ఎస్, 354(ఏ), 354(బీ), ఐపీసీ ఆర్/డబ్ల్యూ66(ఇ), ఐటీచట్టం 2000, 2004, తమిళనాడు మహిళలపై వేధింపుల చట్టాల కింద కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి పంపారు. నిందితులనుంచి స్వాధీనపరచుకున్న నాలుగు సెల్ఫోన్లలో కొందరు మహిళల వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే బాధితుల వివరాలపై పోలీసులు స్పష్టతకు రాలేకపోతున్నారు. పొలాచ్చి దారుణంపై జాతీయ మీడియా క్షమించరాని మౌనం పాటిస్తోంది. ఢిల్లీ లాంటి చోట్ల జరిగిన సంఘటనపై ఎంతో ప్రచారం చేసిన జాతీయ మీడియా ఒక రాష్ట్రంలో అందునా మారుమూల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంపై మౌనం దాల్చడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాగా, బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకే అధికారంలో ఉండడం, ఈ వ్యవహారంలో ఆ పార్టీ నాయకులకు సంబంధం ఉండటంతో కావాలనే బీజేపీ అనుకూల మీడియా మౌనం దాల్చుతున్నదన్న ప్రచారం జరుగుతోంది. క్షణికావేశంలో చోటు చేసుకునే నేరాల విషయం వేరు. అలా కాకుండా పకడ్బందీ వ్యూహంతో ఏండ్ల తరబడి సాగుతున్న ఇలాంటి ఘోర నేరాలపై అత్యంత కఠినంగా న్యాయవ్యవస్థ స్పందించాల్సి ఉంది. వందలాది మంది మహిళల జీవితాలను బజారుకీడ్చి ఘోరమైన నేరాలు చేసి రాక్షసక్రీడ సాగించిన ఇలాంటి కిరాతకులకు, మళ్లీ మరొకరు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకుండా భయపడేలా శిక్షలు ఉండాలి. ఇలాంటి దుర్మార్గులకు ఏదోఒకవిధంగా సహాయపడే పోలీసులను కూడా కఠినంగా శిక్షించాలి. అలాగే, మహిళలు, ప్రధానంగా యుక్తవయస్సు విద్యార్ధినులు ఇలాంటి ముఠాల ఎడల అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ముఠాలమాయలో పడి బంగారు భవితను నాశనం చేసుకోకుండా ఆడపిల్లలు జాగ్రత్తపడాలి.