Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని సమాయాల్లో మనుషులకీ, సమాజాలకీ ఏకాంతం మంచిదంటారు తత్వవేత్త జాన్ మిల్టన్. ఎందుకంటే ఇవాళ ఏకాంతం కోసం వెంపర్లాడిపోతున్న దశలో ఉన్నారు మనుషులు. అత్యాధునిక టెక్నాలజీ మన బతుకుల్లోకి చొచ్చుకు వచ్చాక మనకు మనం కాకుండా పోతున్నాం. ఇవాళ ఎవరి జీవితానికి వాళ్ళు బందీ అయిపోయారు అన్నారు ప్రముఖ కవి శివారెడ్డి ఒక సందర్భంలో. మనిషి చేతిలో మొబైల్ ఉండటం కాదు, మొబైల్కు మనిషి బందీ అయ్యాడు. మన ప్రాధాన్యాలు, మన పనులు, మన సమయాలు అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఏ పనిలోనూ మనస్ఫూర్తిగా లీనమవడం లేదు. చివరకు హాయిగా, ప్రశాంతంగా నిద్రపోడం లేదు.
మనుషులు తమ సహజాతాలకు విరుద్ధంగా బతకడంలోని వికృతత్వం ఎల్లెడలా చూస్తున్నాం. 'నా జీవితం నా ఇష్టం' అంటుంటారు మామూలుగా. కానీ మీ జీవితం మీ చేతుల్లో లేదు. మీ ఇష్టాలకు అనుగుణంగా మీరు మనలేరు. మీరు ఏం చదవాలో, ఏ ఉద్యోగాలు చేయాలో, ఏం తినాలో, ఏం చూడాలో, ఎలా బతకాలో అన్నీ గ్లోబల్ మార్కెట్ నిర్ణయిస్తుంది. 'నాదయిన అభిరుచి నాకు ఉంది' అని గర్వంగా చెప్పలేరు. తమదైన విలక్షణతని చాటలేరు. ఏదీ క్లాసికో, ఏది నాసిరకమో, ఏది ఆధునికతో, ఏది కాస్మోపాలిటనో, ఏది సంప్రదాయమో, ఏది కాదో అన్నిటినీ మార్కెట్ నిర్ణయించే క్రూరమైన వ్యవస్థలో బతుకుతున్నాం.
మొబైల్, ఇంటర్నెట్ వంటి సాధనాలు బతుకులో భాగమయ్యాయి. అంతేకాదు మన బతుకుని నిర్ణయిస్తున్నాయి. మీరు ఎవరితో మాట్లాడారో, ఎంతసేపు మాట్లాడారో, ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో చెప్పేస్తుంది. ఎక్కడ ఎవరితో గడిపారో, నెట్లో మీరు ఏం బ్రౌజ్ చేశారో చెబుతుంది. మీకు ఎంత వస్తుందో, ఎంత పోతుందో, ఎలా ఖర్చు పెడుతున్నారో అన్నిటికీ అన్నీ తెలిసిపోతున్నాయి. మార్కెట్శక్తులు మనిషి ఏకాంతంలోకి చొచ్చుకువచ్చిన పర్యవసానమిది.
'అసలు నేను ఏమిటి? నాకు ఏం కావాలి? నా దు:ఖం, బాధ, ఆనందం, విషాదం వేటితో ముడిపడివున్నాయి' అని ఎప్పుడయినా ఆలోచించారా? ఇందుకు సమయం ఇవ్వకుండానే మన బాల్యాన్ని, కౌమారాన్ని, యవ్వనాన్ని, నడిప్రాయాన్ని, ముదిమిని మార్కెట్ కబ్జా చేసిన అత్యాధునిక జీవన సందర్భంలో ఉన్నాం. అవసరాలు కాని వాటిని అవసరాలుగా భ్రమింపజేసి మనిషి సర్వశక్తుల్ని హరించివేసే మహామాయమేయ వ్యూహాల్లో మనుషులు చిక్కుపడ్డారు.
సాధారణంగా మానవులకు పబ్లిక్, ప్రయివేట్, రహస్య జీవితాలుంటాయంటాడు గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మన అభిప్రాయాలకీ, ఆలోచనలకీ, అభిరుచులకీ ఏకాంతం లేదు. ఇదివరలో మనం ఉత్తరం రాస్తే వాళ్ళకు మాత్రమే అది చేరేది. కానీ ఇవాళ ఒక ఈమెయిల్లో గానీ, ఫోనులోగానీ, ప్రయివేట్ మెసేంజర్లోగానీ మన ఆలోచనల్ని పంచుకుంటే ఏకాంతం ఉండట్లేదు. భావసారూప్యత ఉన్న కొందరితో మీ ఆలోచనల్ని పంచుకుంటే, అది పూర్తిగా మీ ప్రయివేట్ వ్యవహారం. అది కూడా ఎవరో రికార్డు చేసి పబ్లిక్లోకి వైరల్ చేస్తారు.
ప్రతి మనిషికి ఒక రహస్య జీవితం ఉంటుందనే మాట అసత్యమేమీ కాదు. రహస్యమనగానే ఇల్లీగల్, ఇమ్మోరల్ అనుకోనక్కర్లేదు. మనకు ఇష్టమైన వారిని ఏకాంతంలో కలుసుకోవాలనుకుంటాం. అలాగే వారితో అనేక విషయాలు కలబోసుకుంటాం. అవేవీ పబ్లిక్కు గానీ, కుటుంబసభ్యులకు గానీ తెలియక్కర్లేదు. ప్రశాంతచిత్తంతో పనిచేసుకోడానికి ఒక చిత్రకారుడు, ఒక రచయిత రహస్యంగా కొన్నిరోజుల పాటు ఏ కన్యాకుమారికో, ఊటీకో వెళతారు. దగ్గర మొబైల్ ఉంటే మాత్రం వారి ఏకాంతం భగమవుతుంది.
మనం దేనికి స్పందిస్తున్నామో, ఎందుకు స్పందిస్తున్నామో కూడా తెలియకుండా భావోద్వేగాలకు లోనవడం అలవాటయింది. సోషల్మీడియా మన ఉద్వేగాలతో చెలగాటమాడుతుంది. ఎవరికివాళ్ళు తమదైన తీర్పులు ప్రకటిస్తుంటారు. ఎవరూ అడక్కుండానే అభిప్రాయాల్ని గుమ్మరిస్తారు. వాటిని చూసి మరికొందరు బాధతో, కోపంతో, అశాంతితో, ఆవేశంతో అల్లాడిపోతుంటారు. తమ ఏకాంతాన్ని, ఆనందాన్ని, ఆలోచనల్ని భగం చేసుకొని చింతిల్లుతారు. లేదంటే తీవ్ర పదజాలంతో ప్రతిస్పందిస్తారు. ఒక అంశంపై ఆరోగ్యకరమైన చర్చ కన్నా అశాంతికీ, అలజడికీ దారితీసే అభిప్రాయాల వెల్లువే సోషల్ మీడియాలో ఎక్కువ. ఈ క్రమాన తమకు తెలియకుండానే గుర్తింపు సంక్షోభానికి లోనై డిప్రెషన్తో అల్లాడేవారు అనేకులు.
సామాజిక మాధ్యమాల్లో చొరబడ్డవారు తమ ఉద్వేగాలపై అదుపును కోల్పోతున్నారు. దేనికీ, ఎందుకు, ఎప్పుడు ఎలా స్పందించాలో తెలియక స్థిమితం తప్పుతున్నారు. హితులెవరో, స్నేహితులెవరో గ్రహించనందున ఏకాంతం భగమవడమే కాదు, మనుషులు ఏకాకులవుతున్నారు. ఏకాకితనం, ఏకాంతం వేర్వేరు అంశాలు. ఏకాకితనం కాదు ఏకాంతం కావాలి. ఈ నేపథ్యంలోనే తమ ఏకాంతాన్ని అర్థం చేసుకుని మసలుకోగల మిత్రుల కోసం మనుషులు ఆరాటపడుతున్నారని ప్రఖ్యాత సైన్స్ఫిక్షన్ రచయిత సి.ఎస్.లూయీస్ అంటారు.
ఫేస్బుక్లో వేలల్లో మిత్రులుంటారు, మనసులో మాట పంచుకోగల మనిషొక్కరూ కనిపించరు. సమూహాల్లో తిరుగాడుతూనే ఏకాకులయి ఆర్తి చూపే మనిషి కోసం దప్పికగొని ఉన్నాయి మానవ సమూహాలు. అందుకోసమే ఎవరికివాళ్ళు తమదైన ఏకాంతాన్ని కాపాడుకోవాలి. కాసింత మౌనానికీ, ధ్యానానికీ చోటునివ్వాలి. గుండె గొంతుకలో కొట్టుకులాడే మాట చెప్పుకుంటే వినగల సహృదయ కోసం చూడాలి. కనీసం మనిషి చివరకు తనకు తనయినా మిగిలితే అదే బతుక్కి ధన్యత.