Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభివృద్ధి, అవినీతి రహితం అంతా అబద్ధమేనని తేలిపోయాక.. ఇంకా 'వికాస్ పురుష్ నరేంద్రమోడీ' అంటే చెల్లదు కదా! అందుకే ఇకపై 'చౌకీదార్ నరేంద్రమోడీ.' సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రధాని సరికొత్త అవతారమిది. ఆయన తాజా ప్రచార నినాదం ''మై భీ చౌకీదార్'' క్యాంపెయిన్లో భాగంగా ఆదివారం ట్విట్టర్లో తన పేరునే ''చౌకీదార్ నరేంద్రమోడీ''గా మార్చేసు కున్నారు. ఆయనను అనుసరిస్తూ సాయాంత్రానికల్లా అమిత్షా మొదలు షీయూష్గోయల్ దాకా వారి పార్టీ నాయకులు, మంత్రివర్గ సహచరులంతా చౌకీదార్లుగా మారిపోయారు. పాపం ఫాతిమా నసీఫ్.. ఇంతమంది చౌకీదారు లుండగా తన కొడుకు జాడ అంత కష్టమేం కాదనుకుందేమో... 'కాపలా దారుల్లారా నా కొడుకు ఏమయ్యాడు? ఎక్కడున్నాడో చెప్పండీ..' అని అడుగుతోంది. మూడేండ్ల క్రితం జేఎన్యూలో అనుమానాస్పదంగా అదృశ్యమైన తన కొడుకు నజీబ్ ఆచూకీకోసం ఆ మాతృమూర్తి ఘోషిస్తున్నా చౌకీదార్ల నోళ్లు మాత్రం పెగలటం లేదు.
ఈ 'చౌకీదార్' ఈ దేశానికి కొత్తేం కాదు. 2014లోనే తనను ప్రధానిగా కాదు, ఓ కాపలాదారుడిగా ఢిల్లీకి పంపండని వేడుకున్నాడు మోడీ. లూటీ అవుతున్న దేశ సంపదకూ, ప్రజల రెక్కల కష్టానికీ కాపలా కాస్తానని బాస చేశారు. అధికారం అప్పగిస్తే ఏం జరిగింది. ఈ కాపలాదారు ఉండగానే దేశంలో దొంగలు పడ్డారు. లలిత్మోడీ, నీరవ్మోడీ, విజరుమాల్యా, మోహల్చోక్సీ, జతిన్ మెహతా, జయంత్లాల్సందేశ్ ఇలా ఒకరా ఇద్దరా సుమారు 36మంది దాదాపు 41వేల కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసి దేశం విడిచి పారిపోయారు. వీరంతా ఏలినవారి కనుసన్నలలోనే సరిహద్దులు దాటారనడానికి ఆనవాళ్లూ ఉన్నాయి. ఇలా వేలకోట్ల జనం సొమ్ము అప్పనంగా దిగమింగి దేశంలోనే దర్జా వెలగబెడుతున్న తిమింగలాలూ తక్కువేం లేవు. వీరంతా కలసి స్వాహా చేసిన సొమ్ము అక్షరాలా లక్షా మూడువేల రెండువందల యాభై కోట్లన్నది రిజర్వుబ్యాంకే చెపుతున్నమాట. ఇది కాకుండా కొత్తగా లక్షల కోట్లు ఎగవేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దమనుషుల జాబితా ప్రధాని కార్యాలయానికిచ్చానని చెపుతున్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ మాట ఉండనే ఉన్నది. వెరసి ఈ మొత్తం పదిలక్షల కోట్లు దాటుతుందని ప్రభుత్వ లెక్కలే చెపుతుండగా చౌకీదార్ ఎవరికి కాపలాకాస్తున్నట్టు? ఎన్నికలొస్తే తప్ప రైతుల రుణమాఫీ గురించి కనీసం మాట్లాడటానికి కూడా నోరురాని ఈ చౌకీదార్ జనం సొమ్ము దోచుకుతింటున్న దొంగలకు మాత్రం 2లక్షల 72వేల కోట్ల అప్పు రద్దు చేశారు! ప్రధానమంత్రే పార్లమెంటుకు చెప్పిన పచ్చి నిజమిది! ఇందుకోసం తెగనమ్మిన ప్రభుత్వ (ప్రజల) ఆస్తుల విలువ 2లక్షల 60వేల కోట్ల పైచిలుకు. ఇది చాలదన్నట్టు నమ్మి ఓటేసిన ప్రజలపై లెక్కకు మించిన పన్నుల భారం మోపుతూ వెన్ను విరగ్గొడుతున్నారు. కేవలం పెట్రోలు వినియోగదారుల నుంచే ఏడున్నర లక్షల కోట్లు వసూలు చేశారంటే వీరి పన్నుపోటు ఏ మోతాదులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు జనం జేబులకు చిల్లులు పడుతుంటే, మరోవైపు ప్రజాధనం కొల్లగొట్టబడుతుంటే ఈ చౌకీదార్ ఎవరికి కాపలాకాస్తున్నట్టు!?
ఒక్క చౌకీదార్తోనే ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు బీజేపీ నేతలూ, మంత్రులూ అంతా చౌకీదార్లుగా మారిపోతున్నారు. ఇంకెంత నష్టం జరుగుతుందోననే ఆందోళన సహజంగానే ప్రజల్లో తలెత్తుతుంది. కానీ అలాంటి భయాలేం అవసరం లేదంటున్నారు కమలనాథలు. ఎందుకంటే ఇప్పుడు చౌకీదార్కు అర్థం మారిపోయింది! ఇప్పుడు దేశం లోపల కాదు సరిహద్దుల్లో కాపలా కాస్తాం అంటున్నాయి కాషాయ దళాలు. అందుకోసమే ఈ నయా ''చౌకీదార్'' క్యాంపెయిన్. ఇది కాశ్మీర్లో ఉగ్ర ఘాతుకం, పాకిస్థాన్పై దాడులు, ప్రతిదాడుల నేపథ్యాన్ని ఉపయోగించుకుని ఈ దేశానికి తాము మాత్రమే కాపలాదారులమని చెప్పుకునే ప్రయత్నం. ఈ వంకతో తమ పాలనా వైఫల్యాలన్నిటినీ మరుగునపడేసి, తీవ్రవాదం, యుద్ధం, దేశభద్రత, జాతీయత వంటి భావోద్వేగాల మాటున పాకిస్థాన్ను బూచీగా చూపి మరోసారి ఢిల్లీ పీఠమెక్కేందుకు సంధించిన మాయాస్త్రం.
ఇదంతా చూస్తుంటే గత ఐదేండ్ల తమ ప్రభుత్వ పాలన ఆధారంగా ఎన్నికల్లో ఓట్లడిగే స్థితిలో బీజేపీ లేదని స్పష్టంగానే అర్థమవుతోంది. ఏటా రెండుకోట్ల ఉద్యాగాల వాగ్దాన భంగానికి, తీవ్రమైన వ్యవసాయ సంక్షోభానికీ అంతకు మించిన ఆర్థిక పతనానికి, పెచ్చరిల్లిన అవినీతికీ ఆశ్రితపక్షపాతానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడింది బీజేపీ. అందుకే తిరిగి మందిర నిర్మాణం, హిందూత్వ ఉద్రిక్తతలతో తమ విద్వేష రాజకీయాలకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో పుల్వామా ఉగ్రదాడి వీరికి అందివచ్చిన అవకాశంగా మారింది. అందుకే దేశభక్తి ముసుగులో ఎన్నికల ఎజెండానే మార్చజూస్తున్నారు. దేశరక్షణను, సైనిక పాటవాన్ని ఎన్నికల ప్రచారానికి వాడకూడదని ఎలక్షన్ కమిషన్ చెపుతున్నా వీరి చెవికెక్కడం లేదు. ఫలితంగా జీఎస్టీ, నోట్లరద్దు, రాఫెల్ కుంభకోణం, వ్యవస్థల విధ్వంసంవంటి తీవ్రమైన అంశాలతోపాటు ప్రజల జీవిత సమస్యలన్నీ అనామకంగా మారిపోతుంటే.. కాషాయ పరివారం మాత్రం దేశరక్షకులుగా ఫోజులు కొడుతోంది. పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకుని సమస్యలన్నిటినీ మరిచిపొమ్మంటోంది. దేశభక్తి ముసుగులో ఈ ఎన్నికలను గెలవడానికి కొత్త పన్నాగాలను సిద్ధం చేస్తోంది. ప్రజలు అప్రమత్తం కాకుంటే ఈ దేశమే ప్రమాదంలో పడుతుంది.