Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమస్య వెన్నంటే పరిష్కార మార్గం కూడా ఉంటుందని నానుడి. ఆ సమస్య పరిష్కారానికి రకరకాల పద్ధతుల్లో ప్రయత్నించటం సహజం. ముందుగా ప్రభుత్వంతోపాటు సంబంధిత అధికారులకు దరఖాస్తులు పెడతారు. కదలిక లేకపోతే గట్టిగా గొంతెత్తుతారు. అప్పటికీ స్పందన రాకపోతే వినతీ విజ్ఞప్తుల స్వరూపం కాస్తా ఆందోళన రూపం సంతరించుకుంటుంది. రోడ్డెక్కు తారు. ప్రభుత్వ బెదిరింపులు, పోలీసుల లాఠీ దెబ్బలు, కోర్టు కేసులను సైతం ఎదుర్కోవడానికి వెనుకాడరు. ఇది సహజం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్య వినూత్న రూపాన్ని సంతరించుకున్నది. మద్దతు ధర కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తొలుత సావధానంగా చెప్పిన నిజామాబాద్ రైతులు ఆందోళనకు దిగక తప్పలేదు. పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నది. కొందరు రైతులు జైలుకు సైతం వెళ్లారు.
తమ సమస్యను ప్రభుత్వాలు, సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు కొంగొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఇలాంటి పరిణామాలు జరిగినా, సమస్యలను రాష్ట్రంలోని 4.5కోట్ల మంది ప్రజల దృష్టికి, దేశంలోని వందకోట్ల భారతావని మదికీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు వెయ్యిమంది రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీచేయాలని నిర్ణయించారు. ఒక్కో గ్రామం నుంచి రెండు నుంచి ఐదు నామినేషన్లు, పెద్ద ఊరైతే 10నామినేషన్లూ వేయాలని స్థానిక రైతులూ రైతు సంఘాలూ తీర్మానించాయి. గతంలో నల్లగొండజిల్లా ఫ్లోరైడ్ బాధితులు సైతం ఇదే బాటన 280నామినేషన్లకుపైగా వేశారు. అలాగే 2014లో నిజామాబాద్ నుంచే 27మంది పసుపు రైతులు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు. బ్యాలెట్పోరుతోనైనా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో వారు రాజ్యాంగ ప్రక్రియవైపు మళ్లుతున్నారు. ప్రపంచంలో దాయాది దేశమైన పాకిస్థాన్తో పాటు హైపి, తైవాన్, థాయిలాండ్ దేశాల్లో కూడా పసుపు ఉత్పత్తి అవుతున్నది. అమెరికాలో అంతంతే. మన దేశంలో 11రాష్ట్రాల్లో సాగవుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్, ఒడిషా, గుజరాత్, మేఘాలయ, మహారాష్ట్ర, అసోం తదితర రాష్ట్రాల్లో పసుపును పండిస్తారు. ఏపీ, తెలంగాణలో 4.50లక్షల ఎకరాల నుంచి ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ప్రతియేటా ఈ రెండు చోట్లా 5లక్షల టన్నులమేర పసుపు ఉత్పత్తవుతున్నది. దేశం మొత్తంలో 80శాతమైతే ప్రపంచంలో 50శాతంగా ఉంది. పసుపు పంటపై పేటెంట్ చేజిక్కించుకోవడానికి జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రయత్నించి అమెరికా విఫలమైంది. చివరకు ఆ పేటెంట్ హక్కులు మన దేశానికే దక్కాయి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి, మందులు, పేస్టులు, వంటకాల్లో వాడతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పంటకు మంచి డిమాండ్ ఉంది. ఇతర దేశాల్లోకి 60శాతం మేర మన రాష్ట్రాల నుంచే ఎగుమతి అవుతున్నది. ఎగుమతి ధర కిలోకు రూ.50 నుంచి 55వరకూ కొనుగోలు చేస్తారు. కనీస మద్దతు ధర లేదు. రాజ్యాంగం ప్రకారం మద్దతు ధరలు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుని, రైతుల దగ్గర కొనుగోలు చేయొచ్చు. ఆ మేరకు వారికి న్యాయం చేసే అవకాశం ఉంది. అయితే అవేవీ పట్టించుకోడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలుగా తన మ్యానిఫెస్టోలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తాననీ హామీ ఇస్తూ వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఏండ్ల తరబడి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుతో అంటకాగినా, పసుపుబోర్డు ఫైలు అడుగు కూడా ముందుకు కదల్లేదు. అయితే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాత్రం పలుమార్లు ప్రధాని మోడీకి వినతిపత్రాలు ఇచ్చారు. అయినా కేంద్రంలో జాగృతి తేలేకపోయారు. మాటలు కోటలు దాటినా, చేతలు మాత్రం గడప దాటలేదు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం పసుపు, ఎర్రజొన్న రైతులనూ వారి సమస్యలనూ నిర్లక్ష్యం చేశాయి. చేస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పసుపుబోర్డును సొంతంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోడం లేదని రైతు సంఘాలు అంటున్నాయి.
ఎకరాకు రూ.1.30లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతున్నది. అలాగే అదే ఎకరాకు 10 నుంచి 12క్వింటాళ్ల మేర దిగుబడి కూడా వస్తుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఎగుమతి చేయాలి. కాకపోతే ఎగుమతి అనుమతులు మాత్రం కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. విదేశాల్లో రూ.150 నుంచి 200వరకూ కిలో పసుపు విక్రయిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో కిలోకు రూ.150 మేర అమ్ముతున్నారు. రైతుల బతుకుతెరువు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకరిపై మరొకరు నెట్టేసుకోవటమే తప్ప రెండు ప్రభుత్వాలూ రైతుల పట్ల నిజాయితీగా లేవు. ఒక ప్రాంతంలో, ఒకటీరెండూ పంటలకు చెందిన రైతులు మాత్రమే కదిలినందువల్ల ఖాతరు చేయటం లేదు. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాపితం కావటం అవసరం.