Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉలి దెబ్బలను తట్టుకోగల్గితేనే శిల శిల్పంగా మారుతుంది. సవాళ్లను స్వీకరించగలిగితేనే సామాన్యుడు సాహసిగా గెలుస్తాడు. నాయకుడిగా నిలుస్తాడు. జీవితంలో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడే మనిషిలోని నైపుణ్యం నాయకత్వ పటిమా వెలుగులోకి వస్తుంది. అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడే నాయకుడిగా తనను తాను నిరూపించుకోగలుగుతాడు. చరిత్ర చెప్పిన వాస్తవం కూడా అదే..!
ప్రతి మనిషిలోనూ సహజం గానే కొన్ని నాయకత్వ లక్షణాలు ఇమిడివుంటాయి. ఇవేవీ సాధారణంగా మనకు అర్థం కావు. ఏదో ఉపద్రవం ముంచుకొస్తే తప్ప సమస్య నుంచి బయటపడే మార్గాలు అన్వేషించరు. అందులోంచి బయటపడ్డాక తనలోనూ నాయకుడు ఉన్నాడనే భావనకు వస్తుంటారు. అయితే జీవితంలో ఏదో ఒకరోజు ఏదో ఒక రంగానికి నాయకుడు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రే కానక్కర్లేదు. రాజకీయ నాయకుడే కానవసరం లేదు. అడ్డాలో పనిచేస్తున్న కూలీలను నడిపించేవారు కూడా నాయకులే. ఆ మాటకొస్తే ఒక కుటుంబ పెద్ద కూడా నాయకుడూ లేదా నాయకురాలే. తన కుటుంబానికి ఏ అవసరాలున్నాయో నిర్ణయించి తీరుస్తుంటారు. కుటుంబ పెద్దగా ఇంటి బాగోగులూ సమస్యలూ పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంటాడు.
వ్యక్తిగా రాణించడం కంటే ఒక జట్టుకు నాయకత్వం వహించడం కొంచెం కష్టమైన పనే! నాయకులపై అనివార్యంగానే భారం ఉంటుంది. తమను తాము నిర్మించుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ప్రకృతిని పరికించినా అదే స్ఫురిస్తుంది. గూటికి చేరే పక్షులు ఆకాశంలో ఒకదాని వెనుక ఒకటి ప్రయాణిస్తుంటాయి. అక్కడో పక్షి, ఇక్కడో పక్షి అసలే కనిపించదు. ఆ పక్షి సమూహానికి నేతృత్వం వహించిన పక్షి ముందుండి తన రెక్కలతో గాలిని చీలుస్తుంది. దాంతో ఆ వెనుక వచ్చే పక్షులపై భారమేమీ పడకుండా ప్రయాణిస్తాయి. నాయకపక్షి అలసినప్పుడు కొంతవేగం తగ్గుతుంది. ఆ సమయంలో రెండో పక్షి ముందుకెళ్లి నాయకత్వం వహిస్తుంది. ఇలా పక్షులన్నీ పరస్పరం సహకరించుకుంటూ నాయకత్వాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ఫలితంగా నాయక పక్షిలో నైతిక స్థైర్యం పెరిగి అవి తమ గమ్యస్థానాలను అలుపూసొలుపూ లేకుండా చేరుకుంటాయి. ఇది ప్రకృతి సహజం!
నిత్య జీవిత అనుభవాలు, చుట్టూ కనీ వినిపించే ప్రతి విషయం నుంచీ నాయకత్వ లక్షణాలను గ్రహించవచ్చు. ఉదాహరణకు గ్రీన్ టీ బ్యాగు ఎంత నాణ్యంగా ఉంటే అంత అద్భుతమైన టీ తయారవుతుంది. అయితే అది టీగా మారాలంటే వేడినీటిలో మునగాల్సిందే. అప్పుడే చిక్కటి తేనీరు తేరుకుంటుంది. నాయకులు అనేవారు కూడా సంక్షోభంలో ఎప్పుడు మునుగుతారో అప్పుడే అనేక అనుభవాలతో పాటు అనూహ్యమైన నైపుణ్యాలు ఆవిష్కృతమవుతాయి. టీ బ్యాగు దారాన్ని పైకీ కిందకూ లాగుతున్నట్టే.. ఏ సంస్థలోనైనా నాయకుల్నీ దారంలాగా గుంజుతూనే ఉంటారు. అలాగని దారాన్ని ఒక్కసారిగా తెంచేస్తే టీ బ్యాగు వేడినీటిలో మునిగిపోతుంది. మన చుట్టూ పరస్పరం విభిన్న లక్షణాలు కలిగిన మనుషులుంటారన్నది కూడా వాస్తవం. వారందరినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడుగానీ ఆ వ్యక్తి నాయకత్వ లక్షణాలు బయటకు రావు. ''నాయకులంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవారు కాదు. నాయకులంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవారు కాదు. నువ్వు జనంలో కలిసిపోవాలి, నిత్య పోరాటమయంగా జీవితాన్ని మలుచుకోవాలి, అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి'' అంటారు పుచ్చలపల్లి సుందరయ్య. అది అక్షరాలా నిజం.
'నాయకుడంటే ఒక ఆశాసౌధం లాంటివాడు' అంటాడు నెపోలియన్. తన సామర్థ్యంతో ఇతరులలో ప్రేరణ కలిగించి, ముందుకు నడిపించగలగాలి. అది ఒక సంస్థ కావొచ్చు... వ్యవస్థ కావొచ్చు. సాటివారిలో ప్రేరణ కల్గిస్తూ ముందుకు తీసుకుపోగలగాలి. లీడర్గా ముందువరుసలో ఉండి నడిపించాల్సిందిపోయి, వెనుక ఎక్కడో తానుమాత్రం భద్రమైన స్థలంలో ఉండి 'పోరాడండి యోధులారా..! ముందుకు సాగండీ..!!' అంటూ కేకలు పెడితే ప్రయోజనం ఉండదు. నాటి సిపాయిల తిరుగుబాటు అందుకు ఉదాహరణ. ఆంగ్లేయుల వద్ద ఆధునిక పద్ధతిలో యుద్ధ తర్ఫీదు పొంది, తగినన్ని తుపాకులు, ఆయుధాలు, సైనిక బలం సమకూర్చుకున్నప్పటికీ ఓటమి చవిచూశారు. ఏకకాలంలో యుద్ధం ప్రారంభించినా నాయకుల మధ్య సమన్వయం కొరవడటం, తగిన వ్యూహరచనకు సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో బ్రిటీష్సేన ముందు నిలువలేకపోయారు. అందుకే సైన్యాధిపతి ముందుండి చావును సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడి సైన్యాన్ని నడిపించకపోతే, సైనికులు మనస్ఫూర్తిగా యుద్ధరంగంలో నిలబడలేరు. ఏ రంగానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. నాయకులైన వారు అన్ని త్యాగాలకూ సిద్ధపడాలి. జీవితాన్ని ఒక కార్యసాధనలో ఫణంగా పెట్టగలగాలి. ఏ విధమైన త్యాగాలు చేయకుండానే నాయకులం కావాలని కోరుకుంటే ఫలితం శూన్యం. చివరకు మనం చెప్పేది వినేందుకు కూడా ఎవరూ మిగలరు. సేవకులకు సేవకులుగా తమనుతాము భావించుకునేవారే నిజమైన నేతలు..!