Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోక్సభతోపాటు, పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తీరును గమనించిన ఎవరిలోనైనా 'అసలు ఈ ఎన్నికలు ఎవరికోసం?' అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఐదేండ్లపాటు ప్రజల భవిష్యత్తుకు పూచీ పడాల్సిన ఎన్నికలు, కేవలం నాయకుల భవిష్యత్తుకు మాత్రమే హామీ ఇస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రజల కోసం కాకుండా నాయకుల కోసమే జరుగుతున్నాయని చెప్పక తప్పదు. ప్రజల ఎజెండా పక్కనపెట్టి, ఎన్నికలను నాయకుల సొంత వ్యవహారంగా మార్చేసిన ఘనత జాతీయ, ప్రాంతీయ బూర్జువా పార్టీలన్నిటికీ సమానంగా చెందుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజల కోసం నాయకులు అన్నమాట తిరగబడి, నాయకుల కోసం ప్రజలు అన్నమాట స్థిరపడి పోతున్నది. అసలు ఈ దేశంలో ప్రజలే లేనట్టూ ఉన్నా వాళ్ళు కేవలం తమకు ఎన్నికల్లో ఓట్లేసేందుకు మాత్రమే ఉన్నట్టూ నాయకులు భావిస్తున్నారు. కాబట్టి పార్టీల వాగ్దానాలూ, నాయకుల ప్రసంగాలూ ఎన్నికలలో ప్రజలు తమకు ఓట్లేసేలా ప్రలోభ పెట్టేందుకు మాత్రమే పరిమిత మవుతున్నాయి.
ఇప్పటికీ మనది వ్యవసాయక దేశం. నిరుద్యోగ భారతం. నిరుపేదల సంగమం. కానీ ఎన్నికల ఎజెండాలో వీరి స్ధానం శూన్యం. వ్యవసాయదారు లను అప్పుల నుంచీ, ఆత్మహత్యల నుంచీ రక్షించేందుకు మేమిది చేస్తామని చెప్పడం లేదు. నిరుద్యోగ రక్కసిని తుదముట్టించేందుకు మా కార్యాచరణ ఫలానా.. అని ప్రకటించడం లేదు. పేదరిక సుడిగుండం నుంచి పేదలను రక్షించేందుకు తమ ప్రణాళికను ప్రస్ఫుటం చేయడం లేదు. దేశ ప్రజానీకాన్ని చుట్టుముట్టి ఉన్న సవాలక్ష సమస్యల పరిష్కారానికి మార్గాలను చూపించడం లేదు. అభ్యర్ధులు నోట్లకట్టలతో సీట్లు కొనుక్కుంటే, ప్రలోభాలతో ఓట్లు కొల్లగొట్టేందుకు పోటీలు పడుతున్నాయి పార్టీలు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు అసెంబ్లీ టికెట్ను వందకోట్లు ఇచ్చి ఓ పార్టీ అభ్యర్థి కొనుక్కున్నాడని ఓ ప్రముఖ పత్రిక ప్రకటించిందంటే పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థం చేసుకోవచ్చు. సీటుకు నోటు.. ఓటుకు నోటు ఇవ్వలేనోడికి ఎన్నికల వ్యవహారంలో లేనేలేదు చోటు.. అన్ని బూర్జువా పార్టీలూ కలిసి ఎన్నికలను ఓ ఖరీదైన వ్యాపార వ్యవహారంగా మార్చేశాయి. గుణానికి కాదు, ధనానికే ఇక్కడ చోటు అని తేల్చేశాయి. పదుల కోట్ల ఆస్థిలేని వారెవరికైనా ఎన్నికలలో పోటీ చేయాలన్న ఊహ సైతం రాకుండా చేసేశాయి. దీంతో నీతిపరులూ, నిజాయితీపరులూ, ప్రజల పట్ల అంకిత భావం ఉన్నవాళ్లూ ఎన్నికల ప్రధాన స్రవంతి వెలివేతకు గురైపోయారు. అభ్యర్థులను ఎన్నుకునేందుకు ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. 'పండ్లూడగొట్టుకునేందుకు ఏ రాయి అయితేనేం' అని నిట్టూర్చే దుస్థితికి నెట్టివేయబడిన జనం నిస్సహాయులై పోయారు. తమ బతుకులను మార్చేవారు ఎన్నికలరంగంలో కానరాక తమను ఎవరు ఎక్కువ ఏమార్చగలరో వారి మాయలోపడి తమ ఐదేండ్ల భవిష్యత్తునూ అంధకారం చేసుకుంటున్నారు.
బూర్జువా పార్టీలన్నీ సహకరించుకుని ఎన్నికల ఎజెండాను నిర్ణయించేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేను చౌకీదార్ (కాపలాదారు) అని ప్రకటించేశారు. కాదు.. అని నిరూపించడమే ఇతర పార్టీలు పనిగా పెట్టుకున్నారు! ఏపీలో ఒక్క సీటులోనూ పోటీ చేయని 'కసీఆర్ (టీఆర్ఎస్)కూ తనకూ మధ్యే ఈ ఎన్నికలలో పోటీ' అని చంద్రబాబు ప్రకటించేశారు. అదెలాగా అని జనం ఆశ్చర్యంలో మునిగి పోయారు! 'సారు - కారు - పదహారు - ఢిల్లీలో సర్కారు' అని టీఆర్ఎస్ ప్రకటించేసింది. ఇదెలా సాధ్యం అని తెలంగాణ ప్రజల దిమ్మ తిరిగిపోయింది.. అబద్ధాలూ.. అతిశయాలూ.. ఏమార్చడాలూ.. కొనడాలూ.. నాయకులకోసం, నాయకుల చేత, నాయకుల తోటి నిర్వహించబడుతున్న జూదంలా తయారయ్యింది. ఇక ఈ ఎన్నికల ఎజెండాలో ప్రజలకూ వారి సమస్యలకూ చోటెక్కడ ఉంటుంది?
అయితే, ఎన్నికల యుద్ధంలో ప్రజానుకూల శక్తులకు చోటే లేదని నిర్ధారించుకోవడం పొరపాటే అవుతుంది. ప్రజలు తమకు వ్యతిరేకులను తప్ప అనుకూలురను ఆదరించరని తీర్మానించడం తప్పే అవుతుంది. ఇన్ని అననుకూలతల మధ్య కూడా ప్రజానుకూల సిద్ధాంతాలకు కట్టుబడి బూర్జువాపార్టీలను మట్టి కరిపిస్తూ ఉన్న కమ్యూనిస్టు శక్తుల విజయాలు వేగు చుక్కలై దారి చూపిస్తూనే ఉన్నాయి. అలాగే, దేశం నలుమూలలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రైతాంగ, కార్మిక, విద్యార్థి ఉద్యమాలు బూర్జువా రాజకీయ పార్టీలకు ఓ పక్క వొణుకు పుట్టిస్తున్నాయి. ఉద్యమాలలో పాల్గొంటున్న చేతులు అదే చైతన్యంతో ఓట్ల మీట నొక్కేందుకు సిద్ధమైతే తమకు పుట్టగతులు ఉండవని తెలిసిన బూర్జువాశక్తులు ఉద్యమ చైతన్యం ఓట్ల చైతన్యంగా మారకుండా అడ్డుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నాయి. ఇందుకోసం అన్ని వ్యవస్థలనూ అడ్డంగా వాడుకుంటున్నారు. తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు అన్ని దారులు, అడ్డదారుల్లో చేస్తున్న ప్రయత్నాలు చివరిదశకు చేరుకున్న తరువాత ఈ ప్రజా వ్యతిరేక శక్తులకు ఇక ఏ దారీ మిగలదు గోదారి తప్ప.. ప్రజానుకూల శక్తుల ఇప్పటి తక్షణ కర్తవ్యం ఉద్యమ చైతన్యాన్ని ఓటు చైతన్యంగా మలచడమే!