Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీతి, నిజాయితీ ఇంకా చావలేదని, విలువలు ఇంకా బతికే ఉన్నాయని చెప్పకనే చెప్పారు ఉపాధ్యాయులు, అధ్యాపకులు. నల్లగొండ- ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తెలంగాణ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపించడం ద్వారా ప్రజల ఓట్లతో నేరుగా ఎన్నికై అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు 'పారాహుషార్' అంటూ పరోక్షంగా సంకేతాలు పంపారు. ప్రజాప్రతినిధుల ఉనికే ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో నర్సిరెడ్డి గెలుపు ప్రజస్వామ్యానికి ఏడారిలో ఓయాసిస్సులాంటిది. టీచర్ల నాడిని ముందే పసిగట్టిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా అభ్యర్థులను నిలబెట్టలేదు. గతంలో గెలిచిన తర్వాత కారెక్కి పోరాటాలు చుట్టచుట్టి పక్కనపడేసి ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలను అటు తెలంగాణ భవన్కు, ఇటు ప్రగతిభవన్కు తాకట్టుపెట్టిన అధికార పార్టీ అనుయాయులకు ఇది పెద్దదెబ్బే. ఉమ్మడి సర్వీసు నిబంధనలు మొదలు ఉద్యోగోన్నతులు, ఐఆర్, పీఆర్సీ వరకు అన్నింటిలోనూ కంటి తుడుపు జీవోలకు పరిమితమైన ప్రగతిభవన్కు, శాసనమండలికి నర్సిరెడ్డిని పంపడం ద్వారా ఉపాధ్యాయ ప్రపంచం సవాల్ విసిరింది. తేడా వస్తే తామూ ఎదురొడ్డి నిలుస్తామని హెచ్చరించింది. సమస్యలను నానబెట్టి పబ్బంగడుపుకునే పాత సంస్కృతినే కొనసాగిస్తున్న కేసీఆర్కు, గతంలోని అనుభవాన్నీ, తాజాగా మరోసారి రుచి చూపించడం గమనార్హం. చట్టసభలకు తమ ప్రతినిధులుగా పంపితే, తమనే మరచి అధికార పార్టీకి, దాని నాయకుడికి సాగిలపడి తమ బతుకును, భవిష్యత్ను బండలు చేసే కుటిల యత్నాలను ఉపాధ్యాయలు తిరస్కరించారు. నల్లగొండే కాదు అటు కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోనూ ఇదే ఫలితం వెలువడటం గురువుల తెగువకు ఆనవాలు. ఏప్రిల్ 11 లోక్సభ ఎన్నికల తరుణంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల నుంచి వెలువడిన ఫలితాలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అసహజ రాజకీయ వాతావరణానికి అడ్డుకట్ట వేసేవే. అధికార పార్టీకి మింగుడు పడకపోయినా, ఒకసారి జనవాణిని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సమయంలో గుణపాఠం నేర్చుకోకతప్పదని స్పష్టంగా చెప్పేవే. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ఓటును వేలకు వేలు పెట్టి కొన్నట్టుగా, ఇక్కడా అదే కాసుల ఫార్ములాను అమలుచేయవచ్చని విర్రవిగీన అధికార పార్టీకి, దాని వంధిమాగదులకు గురువులకు పంగనామాలు పెట్టడం అంత సులభం కాదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. ఏదిఏమైనా ప్రజాస్వామ్య వాదులకు, వామపక్ష శక్తులకు ఈ ఎన్నికల ఫలితాలు నూతనోత్తేజాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన నీతిబాహ్యమైన ఫిరాయింపుల క్రీడను, గోడదుంకుడు వ్యవహారాలను నయాతెలంగాణలో ఉద్యమనేత సైతం కొనసాగిస్తుండటం గమనార్హం. కాగా తాజా విజయం దిగజారుడు రాజకీయ పరిణామాలకు చెల్లుచీటి కావాలి. విలువలకు లోబడి చారిత్రక విజయాన్ని అందించిన ఉపాధ్యాయ, అధ్యాపకులకే ఈ విజయం అంకితమన్న నర్సిరెడ్డి వ్యాఖ్యలు సముచితం. ఉపాధ్యాయ వ్యవస్థను ప్రయివేటీకరణ చేయడం దేశంలోకెల్లా వేగంగా తెలంగాణలోనే జరుగుతున్నదని, దీనిని అడ్డుకోవడమే తన ప్రాథమిక కర్తవ్యమని నల్లగొండలో నర్సిరెడ్డి మీడియాకు చెప్పడం, సర్కారు సదువుల పురోగతి పట్ల యూటీఎఫ్కు ఉన్న స్పష్టమైన విజన్కు తార్కాణం. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన శాసనమండలిలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య నేతృత్వాన ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పడిన సంగతి తెలియనిది కాదు. ఆనాడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, జార్జి, విక్టర్ బాలసుబ్రమణ్యం తదితరులతో ఆ ఫ్రంట్ ఉపాధ్యాయ సమస్యలేకాదు నిరుపేదల బతుకు చిత్రాన్ని మండలిలో పెట్టి, పరిష్కరించడానికి నడుంకట్టిన మాటా అక్షర సత్యం. వాళ్లు ఏనాడూ పాలకవర్గాలకు లొంగిపోలేదు. బస్స్టేషన్లల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందంటూ ఏకంగా బస్భవన్ ఎదుటే ధర్నాకు బైఠాయించిన ఘనత నాగేశ్వర్ది. అనాటి ఆ పోరాటానికి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బాసటగా ఉన్నాయి. విద్యాలయాల్లో కనీస వసతులు మెరుగుపరిచి, పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు మరింతగా అందించాల్సిన అవసరముందని మండలిలో గొంతెత్తిన చరిత చుక్కా రామయ్యది. అందుకే వారిని ఉపాధ్యాయ, విద్యార్థిలోకం నేటికి గుర్తుంచుకుంది. అందలం ఎక్కిందే తడవుగా ఆవురావురుమంటూ ఆంబోతులా గడ్డికరిస్తే చీత్కారాలే మిగులుతాయని నిరూపించింది.. రాష్ట్రంలో లక్షా 20 వేల మంది ఉపాధ్యాయ,అధ్యాపక సమస్యలు ఏండ్ల తరబడి పెండింగ్లో పెట్టి, అప్పనంగా పరిపాలన చేద్దామనుకున్న పాలకులకు చెంపపెట్టు ఈ ఎన్నికలు. ఒక్కో ఓటును రూ. 15 వేల నుంచి రూ. 50 వేలకు ఖరీదు చేయాలని, బంగారం, పట్టుచీరలను ఆశగా జూపి గంపకింద కమ్మాలని జూసిన నేతలకు ఆశనిపాతమే. మేధావులు, విద్యార్థుల్లో అభ్యుదయ విలువల పట్ల విశ్వాసం ఉందని ఈ ఎన్నికలు మరోసారి నిజం చేశాయి. ఫిరాయింపులతో రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టిపోతున్న ఈ తరుణంలో వామపక్షవాదుల గెలుపు ప్రగతిశీల ఆలోచనలకు నిలువుటద్ధం.