Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోయేముందు ప్రజల కోసం నాలుగు మంచిపనులు చేసిపోతే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు. అవునో.. కాదో.. ఈ విషయం పక్కనపెడితే, హిందువుల ప్రతినిధి తామేనని గొంతు చించుకునే బీజేపీ ప్రజలకు లబ్ది చేకూరే పనులు చేయడానికి మాత్రం సిద్ధపడటం లేదు. అచ్చేదిన్ సామాన్యులకు కాదు.. కార్పొరేట్లకు, డబ్బున్న పారిశ్రామికవేత్తలకని తనపాలనలో మోడీ చేసి చూపించారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కాబోతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం అదానీ గ్రూపునకు మేలు చేసే పని చేయడం గమనార్హం. జార్ఖండ్లోని అదానీ విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) హౌదా కట్టబెట్టింది. ఎన్నికల షెడ్యూల్కు 12రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. 2014లో అధికారంలోకి రావడం కోసం మోడీకి అదానీ ఎంతగానో సహకరించారు. దానిఫలితమే ఈ గిఫ్టు. మళ్లీ అధికారంలోకి రావాలంటే అదానీ సాయాన్ని ఆశించారనడంలో నిజం లేకపోలేదు. ఇంతగా వేలకోట్ల మినహాయింపులు ఇచ్చినా ప్రభుత్వానికీ, ప్రజలకూ ఒరిగిదేమీ ఉండదు. ఎక్కడైనా, ఎంతకైనా విద్యుత్ అమ్ముకుని అదానీ తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈ హౌదా. ఇంతకంటే దారుణం ఏమి ఉంటుంది. 2014ఎన్నికల్లో నాటి వాగ్దానాలను అమలు చేయాలని రైతులూ నిరుద్యోగులూ కోరుతుంటే ఏనాడూ పట్టించుకోని మోడీ.. విద్యుత్ ప్లాంట్లకు ఎస్ఈజెడ్ హౌదా ఇవ్వాలని అదానీ గ్రూపు అడిగిన కొద్దిరోజులకే ఆమోదించడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇతర దేశాలకు అమ్ము కునేందుకు ప్రయోజనాలు కల్పించింది తప్ప దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏ మాత్రం ఆలోచించలేదు.
ఈ ఐదేండ్లూ మోడీ ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేక పాలన సాగించింది. కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడేందుకు, సంపన్నులకు అనుకూల అభివృద్ధి ఎజెండా అమలు చేసింది. 2014ఎన్నికల ముందు ఏడాదికి రెండుకోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి చూపిస్తామని, ధరలు తగ్గిస్తామని, నల్లడబ్బు వెలికి తీస్తామని వాగ్దానం చేసింది. ఈ ఐదేండ్లలో అవేమీ కాలేదు. ఒక్కొక్క వ్యవస్థ నాశనమవుతూ వచ్చింది. దేశానికి పట్టుగొమ్మల్లా ఉన్న రాజ్యాంగ వ్యవస్థలే కుప్పకూలాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన సరళీకరణ విధానాలను మరింత వేగవంతంగా అమలు చేయడంతో పాటు భూములు, గనులు, సముద్రతీరం, కేంద్ర ప్రభుత్వరంగ భారీ పరిశ్రమలను, బడా పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెట్టడానికి సకల ప్రయత్నాలూ చేసింది. 2013భూసేకరణ చట్టాన్ని పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు అనుగుణంగా సవరించింది. రక్షణరంగం, రైల్వేరంగాలు సహా నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. అడవులూ తీరప్రాంతాల్లో చివరకు వన్యప్రాణుల రిజర్వు ప్రాంతాల్లో సైతం బొగ్గుగనుల వంటి ఖనిజ తవ్వకాలకు అనుమతులను యిచ్చింది. అటవీ హక్కుల చట్టం, షెడ్యూల్ తెగల చట్టం, వన్యప్రాణి చట్టం, కోస్టల్ జోన్ రెగ్యులేషన్లను మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించింది. అటవీవాసులు, గిరిజనులు, మత్స్యకారుల జీవితాలను, జీవనోపాథీ దోచుకునేందుకు, పర్యావరణానికి తీవ్రహాని కలిగించేందుకు ద్వారాలు బార్లా తెరిచింది. అదానీ విద్యుత్ ప్రాజెక్టుకు ప్రత్యేకహౌదా ఇవ్వడంలో చూపిన చొరవ, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను, పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం అన్యాయం. పర్యావరణానికి విఘాతం కలిగించే వాటికి అనుమతులు ఇవ్వొద్దని, అటవీవాసుల జీవితాలను నాశనం చేయొద్దని పర్యావరణవేత్తలు కోరుతున్నా, న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా మోడీ సర్కార్ బేఖాతర్ చేస్తూ వచ్చింది. పారిశ్రామికవేత్తలకు అండగా ఉండి అడ్డొచ్చినవారిని ఏరిపారేయడానికి వెనుకాడటం లేదు.
స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగ పరిశ్రమల ద్వారా దేశం స్వయం సంవృద్ధి సాధించింది. అందుకే ప్రభుత్వరంగాన్ని ఆధునిక దేవాలయాలుగా నెహ్రూ అభివర్ణించారు. అంత ప్రసిద్ధిగాంచిన భారీ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు కల్పించడం ఎవరికోసం? ఎరువులు, మందులు, సిమెంట్, స్టీల్ లాంటి ప్రధాన రంగాల నుంచి అన్ని రంగాల అభివద్ధికి మూలం ప్రభుత్వరంగ పరిశ్రమలు. ఈ పరిశ్రమల వల్ల ఉపాధి భారీగా పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచాయి. వాటిని కాపాడాల్పిన మోడీ సర్కార్ నాశనానికి సిద్ధమవుతున్నది. ప్రభుత్వ రంగాన్ని కాపాడటం, మరింత వృద్ధి చేయటం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. కానీ మోడీ సర్కార్ ప్రభుత్వ రంగాన్ని పయివేటు వారికి అప్పగిస్తున్నది. బీఎస్ఎన్ఎల్కు గుండెకాయ లాంటి 70వేల సెల్ టవర్లను వేరు చేసి నాశనం చేయాలని ప్రయత్నించింది. దేశంలోని ఆరు ప్రధాన విమానాశ్రయాలను ఆదానీకి అప్ప జెప్పింది. పోర్టులను కార్పొరేట్లుగా మార్చడానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఇలాంటి కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం భారీ విగ్రహాలు, జాతీయ జెండాలు ప్రదర్శించి దేశభక్తి జపించడం విడ్డూరం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రణాళిక (యూఎన్డీపీ) 'ఈ రోజును చూడు - కానీ రేపటిని కూడా గుర్తుంచుకో' అని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఇవేవీ మోడీకి పట్టవు. పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ఆయన లక్ష్యం. ఇందుకే ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.