Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వం తన అవసరాల కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదనడానికి మరో నిదర్శనమే 'ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్.' తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు చట్టాలను కూడా చుట్టి పడేస్తోందీ ప్రభుత్వం. ఈ ఎన్నికల బాండ్ల చట్టం కోసం ఆదాయపన్ను చట్టం, కంపెనీల చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టాలకు తూట్లు పొడుస్తూ తెచ్చిన సవరణలు దీనినే సూచిస్తుండగా ఈ రెండేండ్ల అనుభవమూ అదే నిజమని రుజువు చేస్తున్నది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యలపై 'సీపీఐ(ఎం)' మరో స్వచ్ఛంద సంస్థ 'అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్' పిటీషన్ వేయగా ఏప్రిల్ 2న సుప్రీమ్కోర్టు విచారించనుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వంతోపాటు ప్రతివాదిగా ఉన్న ఎన్నికల కమిషన్ కూడా ఈ ఎన్నికల బాండ్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది.
మోడీ ప్రభుత్వం ఈ ఎన్నికల బాండ్ల చట్టాన్ని ప్రకటించినప్పుడే అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయపార్టీల విరాళాల సేకరణలో అవినీతికి అవకాశమివ్వకుండా, అవకతవకలను చక్కదిద్దేందుకే ఈ చట్టం తెచ్చామని చెప్పింది ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ఎవరూ ఏ రాజకీయపార్టీకి నేరుగా విరాళమివ్వడానికి వీల్లేదు. సాధారణ పౌరుల నుంచి సంపన్న కార్పొరేట్ సంస్థల వరకు విరాళాలివ్వదలచుకున్న వారెవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ద్వారా బాండ్లను కొనుగోలు చేసి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు పొందిన ఏ పార్టీకైనా ఇవ్వొచ్చు. ఇది వినడానికీ చెప్పుకోవడానికీ బాగుంది. కానీ ఈ బాండ్ ఎవరు కొనుగోలు చేశారు, ఏ పార్టీకి ఇచ్చారన్నది మాత్రం 'రహస్యం'! అసలు రాజకీయమంతా ఈ రహస్యంలోనే దాగుంది!!
ఈ రహస్య కుతంత్రాన్ని రాజకీయ పార్టీలే కాదు ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుపడుతోంది. ఈ నిబంధన పారదర్శకతకు భంగం కలిగిస్తుందన్నది ఎన్నికల సంఘం ఆక్షేపణ కాగా ఇది కార్పొరేట్ సంస్థలు, అధికారపార్టీల ప్రయోజనాలకే ఉద్దేశించబడిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. జరుగుతున్నది కూడా ఇదేనన్నది ఆచరణలో తేలుతున్న పచ్చి నిజం! వేయి, పదివేలు, లక్ష, పదిలక్షలు, కోటి రూపాయల విలువల్లో ఈ బాండ్లను ఎస్బీఐ విక్రయిస్తుండగా ఇప్పటి వరకు వేయి, పదివేల బాండ్లు ఏ ఒక్కటీ అమ్ముడుపోలేదు. లక్ష, పది లక్షలు, కోటి విలువగల బాండ్లే అమ్ముడు పోయాయి. ఎవరు కొన్నారు, ఏ పార్టీకిచ్చారు అన్నది రహస్యమే అయినా అమ్ముడుపోయిన బాండ్లను బట్టి కొన్నది సామాన్యులు కాదు సంపన్నులేనన్నదీ, వ్యక్తులు కాదు సంస్థలేనన్నదీ తేటతెల్లం! ఇక ఈ నిధుల్లో 95శాతం అధికార బీజేపీ ఖజానాకే చేరుతుండటాన్ని బట్టి కొన్నవాళ్లు ఏ పార్టీకిస్తున్నారన్నది కూడా తేటతెల్లమే! ఇలా ఎందుకు జరుగుతుందీ అంటే 'ఇలా జరుగడానికి వీలుగా రూపొందించిందే ఈ చట్టం కనుక' అన్నది విశ్లేషకుల మాట!
ఇక్కడ కార్పొరేట్ల ప్రయోజనాలు, పాలకపార్టీల ప్రయోజనాలు పరస్పర ఆధారితాలు అన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి అధికారపార్టీ ప్రయోజనాలకే అధిక అవకాశాలుంటాయన్నదీ అంతే నిజం. ఇక ఎంత రహస్యమైనప్పటికీ ఈ బాండ్లు కొనాల్సింది, వాటిని తిరిగి సొమ్ము చేసుకోవాల్సింది ఎస్బీఐ వద్దే కాబట్టి ఆ వివరాలు బ్యాంకుకు తెలియాల్సిందే. ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ సంస్థ. కాబట్టి బ్యాంకు ద్వారా ఆర్ధికమంత్రిత్వ శాఖకు, అటునుంచి ప్రభుత్వానికి, ఆపైన పాలకపార్టీకీ తెలిసి తీరాల్సిందే! అటువంటప్పుడు అధికారపార్టీకి తప్ప, ప్రతిపక్షపార్టీలకు బాండ్లు ఇచ్చే సాహసం ఎవరు మాత్రం ఎందుకు చేస్తారు? ఈ చట్టం అధికారపార్టీలకు నిధులపంట పండించడానికి, ప్రతిపక్షపార్టీలకు నిధుల కొరత సృష్టించడానికి ఉద్దేశించిందేనని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
కంపెనీల చట్టం ప్రకారం ఏ కంపెనీ అయినా తన నికర లాభాల్లో 7.5శాతం మాత్రమే రాజకీయపార్టీలకు విరాళాలివ్వవచ్చు. ఇప్పుడీ నిబంధన ఎత్తేసి 100శాతం ఇవ్వొచ్చని చట్టానికి సవరణ చేశారు. దీని వలన బోగస్ కంపెనీలను సృష్టించి, ఆ కంపెనీలకు విపరీతమైన లాభాలను చూపించి, ఆ లాభాలన్నిటిని రాజకీయపార్టీలకు ధారాదత్తం చేయడానికి అవకాశమేర్పడుతుంది. ఈ ముసుగులో డొల్ల కంపెనీల నల్లధనమంతా ఆధికారపార్టీల బొక్కసాల్లో నిండుతుంది. ఇక ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29బి మన రాజకీయపార్టీలకు విదేశీ నిధుల్ని అనుమతించదు. ఎందుకంటే విదేశీ బహుళజాతి సంస్థల నుంచి నిధులు స్వీకరించినట్టయితే ఆ సంస్థలు సంబధిత రాజకీయపార్టీలను, తద్వారా ప్రభుత్వాలను, ప్రభుత్వ విధానాలనూ ప్రభావితం చేసే ఆస్కారముంటుంది కాబట్టి. కానీ మోడీ సర్కారు ఇప్పుడీ చట్టానికి కూడా తూట్లు పొడుస్తూ సవరణ చేసింది. దాని ప్రకారం ఇప్పుడు విదేశీసంస్థలు కూడా తమ భారతీయశాఖల ద్వారా భారీ విరాళాలందించవచ్చు. ఇది భవిష్యత్తులో దేశ సార్వభౌమత్వానికే పెద్ద సవాలుగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే మొదటినుంచీ విపక్షాలు నిరసిస్తున్నా, ఎలక్షన్ కమిషన్ సైతం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నా మోడీ ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు. చివరికి సుప్రీం విచారణ నేపథ్యంలో ఈ చట్టం రాజకీయపార్టీల విరాళాల సేకరణలో అవినీతిని కట్టడి చేయకపోగా మరింత పెంచిపోషిస్తుందనీ, స్వచ్ఛతకు, పారదర్శకతకు భంగం కలిగిస్తుందనీ ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో కోర్టుకు స్పష్టం చేసింది. ఇప్పుడిక సుప్రీంకోర్టుతో పాటు ప్రజాకోర్టూ స్పందించాలి.