Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకేం కావాలో మనం ఎంపిక చేసుకోవాలి. మనకేది ఇష్టమో అదే చేయాలి. కానీ మన ఇష్టం మన చేతుల్లో ఉందా? అసలు మనకు ఏం ఇష్టమో మనకు తెలుసా? ఇతరుల ఇష్టాలే మన ఇష్టాలుగా చేసుకుంటున్నామా? మనకు కావాల్సింది ఏమిటో స్వయంగా, ఇష్టపూర్తిగా ఎంపిక చేసుకునే పరిస్థితి ఉందా? మనకు తెలియకుండానే మార్కెట్ ప్రవచించే సూత్రాలే మన ఇష్టాలవుతున్నాయా? మన ఎంపిక స్వేచ్ఛ మన చేతుల్లో ఉందా? ఆలోచిస్తే, వివేచిస్తే ప్రశ్నలు అనేకం. దైనందిన జీవితంలోకి మార్కెట్ చొచ్చుకువచ్చిన వైనం గమనిస్తే మనదైన చాయిస్ (ఎంపిక) ఎక్కడ అన్నది ప్రశ్నగా మిగిలిపోతుంది.
మనకు తెలియకుండానే మార్కెట్ మన నట్టింట్లోకి చొచ్చుకు వచ్చింది. మన ఇంట్లో టీవీ ఎంత సేపు చూడాలి, ఏం చూడాలి, ఏ సమయంలో చూడాలనే యోచనకు కూడా తావు లేదు. గంటలకొద్దీ టీవీ మోగుతూనే ఉంటుంది. వార్తలు కూడా వినోదమయ్యాయి. సానుకూల వార్తల కన్నా ప్రతికూల వార్తలు వేగంగా వ్యాపిస్తాయి మన సమాజంలో. నేరగాథలు, మోసాలు, ప్రమాదాలకు సంబంధించిన విషాదవార్తలు ఎక్కువగా చదివిస్తాయన్నది మీడియా సూత్రం. ఇలాంటి వార్తాకథనాలే టీవీల్లో పదేపదే చూపిస్తూ వీక్షకుల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కనుకనే పత్రికల్లో ఎలాంటి వార్తలు చదవాలో, టీవీల్లో ఎలాంటి కార్యక్రమాలు చూడాలో ఎవరికివారు నిర్ణయించుకోవాలి.
ప్రతికూల వార్తలు మనిషి మెదడు మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆలోచనల్ని నియంత్రిస్తాయి. ఒక హత్యోదంతాన్ని చదివినప్పుడు ఉండే మానసిక స్థితి కన్నా సైన్స్, మెడిసిన్ రంగాల్లోని మహత్తర సంఘటనలకు సంబంధించిన కథనాల్ని చదివినప్పుడు ఉండే స్థితి భిన్నమైంది. అందుకే రోజూ పత్రికలు చదివేవారు, టీవీలు చూసేవారు ఏం చదవాలో, ఏం చూడాలో ఎంపిక చేసుకోవాలి. పత్రికలు, టీవీలు విలువైన, ఉపయుక్తమైన సమాచారాన్ని, విశ్లేషణల్ని సైతం అందిస్తాయి. వాటిలో మీరు చదవాల్సిన, చూడాల్సిన వాటిని ఎంపిక చేసుకోవాలి.
టీవీ సీరియల్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. టీవీ సీరియల్స్, కామెడీ ప్రొగ్రామ్స్ ఎందుకు చూస్తున్నామో, వాటిలో మహిళల్ని తులనాడే అంశాలున్నా ఎందుకు అవమానంగా భావించడం లేదో యోచించాలి. మహిళ అంటే ఒక తల్లి, ఒక భార్య, ఒక కూతురు, ఒక అక్క, ఒక చెల్లి... ఇలా ఎవరో ఒకరు మన ఇంట్లో ఉంటారు. వారిని కించపరిచే ప్రసారాలు నవ్వుకుంటూ చూడటం విచిత్రం. ఆడవాళ్ళను తక్కువగా చూస్తూ వాళ్ళనే ప్రేక్షకులుగా మలచుకోడమన్నది మీడియా బేహారుల క్రూర పరిహాసం. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నా స్పందించలేనంతగా మొద్దుబారిపోవడం ఎంత విషాదం! చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామనే వాదన టీవీలవాళ్ళు, సినిమా వాళ్ళు చెబుతుంటారు. ఇక్కడే మన ఎంపిక స్వేచ్ఛ మొద్దుబారిపోయింది.
టీవీ తరువాత మొబైల్ మన బతుకులోని విలువైన కాలాన్ని హరించివేస్తున్నది. అవసరాలు కాని వాటిని అవసరాలుగా భ్రమింపజేసి మనిషిని అన్నివిధాలుగా చెదపట్టిస్తున్నది. దాని అవసరం ఎంతవరకో అంతవరకే ఉపయోగించాలి. మొబైల్, కంప్యూటర్ వినియోగంలో తప్పులేదు. వాటిని దుర్వినియోగం చేయడం మన ఎంపిక రాహిత్య ఫలితం.
ఇదివరలో తీరిక సమయాల్లో పుస్తకాలు చదివేవాళ్ళు, మిత్రుల్ని కలిసేవాళ్ళు, ఇంట్లో మంచీచెడు మాట్లాడుకునేవాళ్ళు. కానీ తల్లి, తండ్రి, ఒకరో ఇద్దరో ఉండే పిల్లలు, వాళ్ళ చేతుల్లో మొబైల్స్, లాప్టాప్స్... వాటిలో తలమునకలయి తమని తాము విస్మరిస్తున్నారు. ఇక చాలామంది సోషల్ మీడియాలో అర్ధరాత్రివరకు తలపెట్టి లేని చిరాకుల్ని నెత్తిమీదకు తెచ్చుకుంటున్నారు. ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో ఏదో స్పందించారని సోషల్మీడియాని వ్యక్తిగతవైరాలకు, అసూయాద్వేషాలకు వేదికగా వాడుకుంటూ చిత్తశాంతికి దూరమవుతున్నారు. ఇక్కడా ఎదురయ్యేది ఎంపిక సమస్యనే. మిత్రుల జాబితాలో వేలాదిమంది ఉండాలని ఎవరెవరినో చేర్చుకుంటారు. వారి తలనొప్పులన్నీ వీరికి చుట్టుకుంటాయి.
పనిప్రదేశాల్లో ఇష్టంలేనివారితో కప్పు కాఫీకి కూడా వెళ్ళరు. కానీ ఫేస్బుక్లో వాదాలకు, వివాదాలకు తెరలేపి, వాటిలో తలదూర్చి విలువైన కాలాన్ని కోల్పోతున్నారు అనేకులు. ఎవరు హితులో, సన్నిహితులో, భావసారూప్యత ఉన్నవారెవరో కాదో తెలుసుకోకుండా వాదాలకు దిగడం వల్ల ఉపయోగం ఉండదు. తెగని, ముడిపడని చర్చలతో, నిర్హేతుక వాదనలతో కాలాన్ని వృధాచేయడం ఎంత అర్థరాహిత్యం! సోషల్మీడియాని ఎంతవరకు, ఎలా ఉపయోగించుకోవాలన్న వివేచన తప్పనిసరి.
అత్యాధునిక టెక్నాలజీ, విస్తరించిన మార్కెట్ కారణంగా ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందనిపిస్తుంటుంది. కానీ మనుషుల్లో సంకుచిత ధోరణులు తొలగిపోలేదు. కులం, మతం గోడలు దాటలేదు. శాస్త్రీయ దృక్పథానికీ, వివేచనకీ బతుకులో చోటునివ్వడం లేదు. డబ్బు సంపాదన ఒక్కటే పరమధ్యేయంగా బతకడమే గొప్ప అనే భావజాలాన్ని పిల్లల్లోనూ రుద్దుతున్నారు. అందుకే తల్లిదండ్రులకీ, పిల్లలకీ నడుమ ఎడం పెరుగుతున్నది. మానవ సంబంధాల్లో పరాయీకరణ చోటు చేసుకున్నది. వీటి మూలాలు మనం ఎంపిక చేసుకున్న జీవన విధానాల్లో ఉన్నాయి. అందుకే పదుగురికి మేలు చేసే బతుకురీతి అవసరమన్న ఎరుక ప్రధానం. అందుకు అనుగుణంగానే మన చదువులు, వృత్తి ఉద్యోగాలు, అభిరుచులు, అలవాట్లు ఉండాలి. ప్రలోభాలకు అతీతంగా మంచిని పెంచే జీవనవిధానాలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే ఎంచుకునే స్వేచ్ఛకు సార్థకత.