Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ చౌకీదార్ క్యాంపెయిన్ని అధికారపక్షమే కాదు, ప్రతిపక్షమూ విస్తృతంగా చర్చిస్తున్నది! ''చౌకీదార్ ఒక వ్యవస్థ కాదు.. అది ఓ స్ఫూర్తి'' అంటున్నారు మోడీ. ''ఏ స్ఫూర్తిలేదు.. అది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మోడీ పడుతున్న అవస్థ మాత్రమే'' అంటోంది ప్రతిపక్షం. మొత్తానికి అసలు సమస్యలను అటకెక్కించి చౌకీదార్, చౌకీదార్ చోర్ నినాదాలే దేశమంతటా హౌరెత్తుతున్నాయి. ఆదివారం ఒకేసారి 500 ప్రాంతాల్లోని సుమారు 5000 మంది మై భీ చౌకీదార్ మద్దతుదారులతో మరోసారి మాట్లాడారు ప్రధాని. ఈ సందర్భంగా ''ఈ దేశానికి నేనే అసలు సిసలు చౌకీదార్''నని పునరుద్ఘాటించారు. ''అవును ఆయన సూటు బూటు వాలాలకే అసలు సిసలు చౌకీదార్.. అందుకే వాళ్లు అందినకాడికి దోచుకుని అవుతున్నారు పరార్'' అంటూ విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? ఇటీవలి పరిణామాలను, సంఘటనలను కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే నిజానిజాలేమిటో తెలుసుకోవటం పెద్ద కష్టమేమీకాదు!
ప్రస్తుతం ఒకవైపు నరేంద్రమోడీ ఈ చౌకీదార్ క్యాంపెయిన్ని వేడెక్కిస్తుంటే.. మరోవైపు నీరవ్మోడీ కేసు ఉదంతం దీనిని నీరుగారుస్తుండటం సరికొత్త పరిణామం! మన ఘనమైన కాపలాదారు కన్నుగప్పి పారిపోయిన ఘనాపాటి ఈ నీరవ్ మోడీ. ఈ ఆర్థిక నేరస్తుడి కేసును విచారిస్తున్న అధికారులను ఉన్నఫళంగా బదిలీ చేయడం, ఆపై వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది. గతంలో సీబీఐలో జరిగింది కూడా ఇదే తంతు. అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై విచారణకు సిద్ధపడుతున్నారన్న వార్తలు వెలువడుతుండగానే తొలగింపునకు గురయ్యారు. ఆ తరువాత ప్రహసనంలో సీబీఐ ప్రతిష్ట మంటగలిసిన తీరు ఇంకా ఈ దేశం మరువనే లేదు. ఇంతలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో మరో తంతు! ఈ తంతులన్నీ ఎందుకోసం? ఎవరి కోసం?
ఇప్పటికే పన్నెండువేల కోట్ల ప్రజాధనాన్ని మూటగట్టుకుని నీరవ్మోడీ ఉడాయిస్తుంటే మన కాపలదారు కండ్లు మూసుకున్నారా? అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ప్రభుత్వమూ, ప్రధాని నిర్లక్ష్యం వల్లనే ఈ ఆర్థిక నేరస్తులంతా సరిహద్దులు దాటుతున్నారన్న అనుమానాలూ ఆరోపణలూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. విజరుమాల్యా లాగే నీరవ్మోడీ కూడా లండన్లో తలదాచుకుం టున్నాడని మీడియా కోడైకూస్తున్నా విశ్వాసంలోకి తీసుకోని మన ఏలికల తీరు వీటికి ఇంకింత ఆజ్యం పోస్తూనే ఉన్నది. మరోవైపు ''నీరవ్ మోడీని మేము అరెస్టు చేయాలంటే మాకు కొన్ని ఆధారాలూ డాక్యుమెంట్లూ కావాలి. వాటిని పంపించమంటే భారత ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది.'' అన్న బ్రిటిష్ అధికారుల ప్రకటన వీటిని మరింత ధృవీకరిస్తున్నది. అయినా మన సర్కార్లో, చౌకీదార్లో చలనం లేదు! చివరికి బ్రిటిష్ ''టెలిగ్రాఫ్'' పత్రిక నీరవ్ మోడీ లండన్లోనే తిరుగాడుతున్నాడని ఆధారాలతో సహా ప్రచురిస్తేగానీ స్పందించక తప్పలేదు ఎన్డీయే ప్రభుత్వానికి! ఈ అనివార్యమైన పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం అడిగిన ఆధారాలను, డాక్యుమెంట్లను పంపించడం, ఆపై నీరవ్మోడీ అరెస్ట్ కావడం అందరికీ తెలిసిందే.
ఇక అరెస్టయిన నీరవ్మోడీని తిరిగి ఇండియాకి తరలించాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో... ఆ కేసును విచారిస్తున్న ఈడీ జాయింట్ డైరెక్టర్ సత్యబ్రతకుమార్ను బదిలీ చేసారు. ఉన్నట్టుండి అకారణంగా అధికారులను ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? బదిలీ చేసినవాళ్లు తిరిగి కొన్ని గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది? అవినీతిపరులకు నేనంటే హడల్ అని ప్రగల్భాలు పలుకుతున్న ప్రధాని ఆ అవినీతి తిమింగలాలను వదిలేసి వారిపై విచారణలు జరుపుతున్న అధికారులపై ప్రతాపం చూపడం దేనికి సంకేతం? అంటే నీరవ్ మోడీని కాపాడాలనుకుంటున్నారా? ఈ విచారణ ముందుకు సాగితే తమ బండారమేమయినా బయటపడు తుందని భయపడుతున్నారా? అందుకే కేసును నీరుగార్చాలని చూస్తున్నారా? ఈ కారణంగానే ఈ బదిలీలకు పూనుకున్నారా? తీరా ఎన్నికల ముందు ఇది వివాదమవుతుందని గమనించి బదిలీలను ఉపసంహరించు కున్నారా? ఇవన్నీ సమాధానం రావాల్సిన ప్రశ్నలు.
కానీ వీటికి ఏ సమాధానం చెప్పకుండానే ఆదివారం మరో అనర్గళ ప్రసంగం చేస్తూ ''నేనే ఈ దేశానికి అసలు సిసలు చౌకీదార్''నని ప్రధాని పదే పదే చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమే. ''ప్రభుత్వానికి ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ఆ డబ్బుపై ప్రజలకే హక్కుంటుంది. ప్రభుత్వం దానికి కాపలాదారు మాత్రమే. ఆ కాపలాదారుగా దానిపై ఎవరికన్నూ పడనివ్వను'' అంటూ ఆదివారం తాజాగా మరోసారి సెలవిచ్చారు ప్రధాని. మరి ఈ అయిదేండ్లలో 36మందికి పైగా నేరగాళ్లు 41వేల కోట్లు కొల్లగొట్టుకుని విదేశాలకు పారిపోతుంటే ఈ చౌకీదార్ ఏం చేసినట్టు? అంతకు మించి పది లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టిన దొంగలంతా ఈ కాపలాదారు కండ్లముందే దర్జా వెలగబెడుతుంటే ఏం చేస్తున్నట్టు? ప్రజలను గోల్మాల్ చేయడంలో గోబెల్స్ను మించిపోయిన వీరు.. ఎవరికి కాపలాదారులో తెలియడానికి ఇంతకన్నా రుజువులేం కావాలి?