Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికలన్నా, బడ్జెట్టన్నా గతంలో ప్రజలు ఆసక్తిగా గమనించేవారు. వాటివల్ల ఏదో ఒక రూపేణా తమకు మేలు జరుగుతుందనే భావన ఉండేది. ఇప్పుడా పరిస్థితి వేరు. అధికారం కోసం, పదవుల కోసం పాలకవర్గ పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, బాధ్యత మరిచి ప్రత్యక్ష, పరోక్ష పన్నులేస్తూ ప్రజల్ని ఆర్థికంగా దివాళా తీయిస్తూ, తాము మాత్రం కోట్లకు పడగలెత్తుతున్న తరుణంలో ఎన్నికలన్నా, బడ్జెట్ అన్నా ప్రజలకు అసహ్యం కలుగుతోంది. తమ అవసరాల కోసం, స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య ప్రక్రియను భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచార ధోరణి. ఎన్నికల నిర్వహణకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్న భారత ఎన్నికల సంఘం ప్రకటన దేశంలోనే కాదు, రాష్ట్రంలోనూ విమర్శలను ఎదుర్కొంటున్నది.
ప్రచార పర్వంలో సంక్షేమ పథకాల గురించి ఆయా పార్టీలు అతిగా చెపుతున్నాయి. శాశ్వత ప్రాతిపదికన సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. ఓట్లకోసం తాత్కాలికంగా తాయిలాలను గుప్పించడమే ఎత్తుగడగా నడుస్తున్నాయి. జాతీయ ఉపాధి హామీ చట్టం అమలు నిర్వీర్యమైంది. ఈ నిధులకు కోత పెట్టి కేంద్రం గ్రామీణ పేదల నోటికాడి ముద్దను లాగేసుకుంది. కనీస వేతన చట్టాన్ని చెత్తబుట్టలో పడేసింది. తద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కార్మికుల పొట్ట కొడుతున్నది. పల్లెల్లో చేతివృత్తులు ధ్వంసం అవుతున్నాయి. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి గురించి పార్టీలు పట్టించుకోవడం లేదు. వృత్తిదారుల కుటుంబాల గురించి కనీస ఆలోచన లేదు. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటున్నది. వీటిపై పార్టీలకు స్పష్టమైన విధానమంటూ లేకపోవడం గమనార్హం.
లోక్సభ ఎన్నికలకు అనేక రాజకీయ పార్టీలకు ఒక అజెండా గానీ, ప్రత్యేక విధానం గానీ లేకుండా పోయింది. తమను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తామనే ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప, ప్రజల సమస్యల పరిష్కారానికి మౌలికమార్పులు ఏమి చేయనున్నారో ఆయా పార్టీల నేతల నోటి నుంచి మాట మాత్రంగా కూడా రావడం లేదు. అయితే రోత మాత్రం వెల్లువలా ఉప్పెనై వస్తున్నది. ఎన్నికల ప్రచారం తిట్ల దండకంలా తయారైంది. గెలిపిస్తే తామేమి ఉద్ధరిస్తారో చెప్పకుండా, ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలంచెల్లిన అభూతకల్పనలకు ప్రాణం పోస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒకపార్టీపై మరో పార్టీ, ఒక నేతపై మరో నేత బూతు పురాణమందుకుంటున్నారు. వ్యంగ్య బాణాలు, మాటల తూటాల నడుమ ప్రజలు బిత్తరపోతున్నారు. ప్రజాస్వామ్యం మౌనంగా కుమిలిపోతోంది. గాంధీజీ చెప్పిన మాటలు చెడు వినకూ, చెడు మాట్లాడకూ, చెడు చూడకూ అనేవి అక్షరాలా ప్రస్తుత ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే స్ఫురణకు తెస్తున్నాయి. వస్తాయి కూడా. మరో మాట కూడా గాంధీజీ సెలవిచ్చారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని, అంతేగాక ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు అవే అని కూడా అన్నారు. అయితే అందుకు తమ పార్టీ ఏమి చేస్తుంది, అందుకు ఆయా పార్టీ నాయకత్వం ఏవిధంగా పాటుపడుతుందనే సంగతి పక్కనపెట్టి, తమ సోది తాము చెప్పుకుంటూ పోవడమే తప్ప, ప్రజల మదిలో ఏముందో తెలుసుకుని మసలుకునే అలవాటు రాజకీయ నాయకుల్లో కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఇందుకు వామపక్షాలు మాత్రమే మినహాయింపు. అందుకేనేమో ప్రజలు సైతం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. సోమవారం నాటి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రధాని మోడీ ఎన్నికల సభలో కుర్చీలను జనంతో నింపడానికే బీజేపీ నేతలకు చెమటలు పట్టాయి. సభకు రావడానికి జనం నిరాకరిస్తున్నారని చెప్పడానికి ఇదో తార్కాణం. అంతకుముందు శుక్ర వారం రోజున సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సభ సైతం జనం లేక వెలవెలబోయింది. నిఘా వర్గాల నివేదిక మేరకు చేసేది లేక మిర్యాలగూడ నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం రావాల్సిన సీఎం ట్రాఫిక్జామ్ సాకుతో నేరుగా ప్రగతిభవన్ దారి పట్టారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పటికే ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎన్నికల బరిలోకి పసుపూ ఎర్రజొన్నా పండించే 178మంది రైతులు ఆమెతో పోటీకి ఎదురొడ్డి నిలిచారు. ఇదిలావుండగా మోడీ సొంత నియోజకవర్గం ఇందుకు మినహాయింపేమీ కాదు. వారణాసిలోనూ వందమందికి పైగా రైతన్నలు ఎన్నికల గోదాలోకి దిగి పోరాటపథాన్ని ఎంచుకున్నారు. వామపక్షాలు మినహా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రజల బాగోగులూ సమస్యలూ మరిచి ప్రచార సరళి కొనసాగిస్తున్నాయి. వ్యక్తిగత దూషణలూ వ్యంగాస్త్రాలూ ఆరోపణలతో బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయి. ప్రాస, యాసలతో కూడిన నినాదాలు ఈ ఎన్నికల ప్రచార పర్వంలో ఫ్యాషనైపోయాయి. నేడు దేశవ్యాప్తంగా ఉన్న యువశక్తికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి శక్తిసామర్థ్యాలను వెలికితీసి వారి బతుకులకు ప్రాణం పోయడం ద్వారా దేశ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దే ప్రణాళికలే ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, టీఆర్ఎస్ల దగ్గర లేకపోవడం విచారకరం. ప్రజాస్వామ్య లౌకిక శక్తులూ పాలకవర్గాల డొల్లతనాన్ని గుర్తించి తగిన రీతిన గుణపాఠం చెప్పటమే పరిష్కారం.