Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులూ కార్మికులూ పదవీ విరమణ తరువాత అధిక పింఛను పొందేందుకు వీలు కల్పిస్తూ మంగళవారం అత్యున్నత ధర్మాసనం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఇక నుంచీ ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి వారు అందుకునే చిట్టచివరి వేతనం, డీఏపై ఈపీఎఫ్ పింఛను లెక్కించి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి షాకే. లక్షలాదిమంది ఈపీఎఫ్ కార్మికుల పెన్షన్కు కోతపడేలా 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995' కు సవరణలు తెస్తూ 2014 ఆగస్టు 22న మోడీ తెచ్చిన నోటిఫికేషన్కు ఈ తీర్పుతో చెల్లుచీటీ. దీనిపై గతంలోనే 2018 అక్టోబర్ 12న కేరళ హైకోర్టు కేంద్ర నోటిఫికేషన్ను కొట్టేసింది. తీర్పును వ్యతిరేకిస్తూ ఈపీఎఫ్వో దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. ఈపీఎఫ్వో వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ కేరళ హైకోర్టు తీర్పును అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. వ్యాజ్యానికి విచారణార్హత లేదని తాము భావిస్తున్నందున తోసిపుచ్చుతున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, ఇతర న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ తీర్పు విశ్రాంత జీవులకు శుభవార్త. ముఖ్యంగా కార్మికుల పోరాటానికి దక్కిన ప్రతిఫలం. ఎన్నికల సమయంలో ఈ తీర్పు మోడీ సర్కార్కు చెంపపెట్టు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాసేలా కొత్తగా అధికారం చేపట్టేవారు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆలోచించాల్సిందే. ఈ ఎన్నికల్లో కార్మికుల హక్కుల గురించి కూడా రాజకీయపార్టీలు సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం మీద వచ్చిన అసంతృప్తి ఆధారంగా అనేక వాగ్దానాలతో అధికారంలోకొచ్చిన మోడీ ప్రభుత్వం, ప్రారంభం(2014)లోనే ఈపీఎస్ పింఛన్దార్లకు మొండిచేయి చూపింది. ఏ లక్ష్యాలతో 1995లో ఈపీఎఫ్ ప్రారంభమైందో.. దాని స్వరూప స్వభావాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నించింది. కార్మికులు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునే విధంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కు సవరణలు చేసింది. వేతన సీలింగ్ను రూ.6500 నుంచి రూ.15వేలకు పెంచుతూనే మరోవైపు ఎంప్లాయీస్ పెన్షన్ పథకానికి(ఈపీఎస్) సవరణలు తెచ్చింది. పెన్షనబుల్ వేతనానికి గతంలో ఉన్న ఆఖరి 12నెలల సరాసరిని 60నెలల సరాసరికి పెంచింది. దీంతో అందే ఆ కాస్త పెన్షన్ కూడా తగ్గుతుంది. 1996 సవరణ ప్రకారం యజమాని, ఉద్యోగి అంగీకరిస్తే సీలింగుకు మించిన వేతనంపై కూడా యజమాని కట్టిన వాటాలో 8.33 శాతాన్ని పెన్షన్ ఫండ్కు మళ్లించాలి. అయితే, పెన్షన్కు సంబంధించి సీలింగు రూ.6500 నుంచి రూ.15 వేలకు మార్చాల్సిన ప్రభుత్వం ఆ నిబంధనను పూర్తిగా తొలగించి దుర్మార్గ నిబంధన చేర్చడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. కార్మికులకు నష్టం కలిగించే రీతిలో ఉన్న ఈ సవరణలు చెల్లబోవని ఆనాడు కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఉద్యోగి చివరి ఏడాది సగటు నెల జీతాన్ని ప్రాతిపదికగా తీసుకుని పెన్షన్ చెల్లింపు వేతనాన్ని లెక్కించాలని కోర్టు తీర్పు చెప్పింది. అంటే 33ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఒక ఉద్యోగి చివరి జీతం రూ.50 వేలు అయితే.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.25వేల మేరకు నెలవారీ పెన్షన్ వస్తుంది. అంతకు ముందు ఆ ఉద్యోగికి లభించే రూ.5,180 పింఛన్కంటే ఇది 383శాతం అధికం. ఇప్పటికే 2014 సెప్టెంబరు ముందు పదవీవిరమణ చేసిన వారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీనికోసం ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఎప్పుడైనా ఆప్షన్ ఇచ్చుకోవచ్చని, గడువేమీ లేదని వెసులుబాటు కల్పించింది. న్యాయస్థానం ఆదేశాలను ఈపీఎస్ పాటించేలా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది కేంద్రప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉన్నది. ముప్పై, నలభై ఏండ్లు సమాజానికి సేవ చేసిన కార్మికులకు పదవీ విరమణ తర్వాత జీవించేందుకు సరిపడా పెన్షన్ ఇచ్చేందుకు కేంద్రానికి మనసొప్పడం లేదంటే ఏమనుకోవాలి. మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు రూ.5లక్షల కోట్లకు పైగా ప్రతీ ఏడాదీ రాయితీలివ్వడానికి వెనుకాడటం లేదు. వారికి అనుకూలంగా చట్టాలు చేస్తున్న పాలకులు, కార్మికులకు ఉన్న ప్రయోజనాలను కోతపెడుతూ చట్టాలను మార్చడం విడ్డూరం. ప్రభుత్వం చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. కానీ ఈపీఎఫ్, ఈపీఎస్ చట్టాలు ఆ రకంగా లేవు. కార్మికులకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల మరికొంతమంది న్యాయం కోసం పోరాడేందుకు ఊపిరినిచ్చింది. వాస్తవానికి దేశంలో కోట్లాదిమంది కార్మికులకు తాజా సీలింగ్ వేతనాన్ని చేరుకోగలిగే పరిస్థితి లేదు. వారికి కనీస పింఛన్ పెంచాలనే డిమాండు ఎప్పట్నుంచో ఉంది. ఇందుకు పోరాటాలు కొనసాగుతున్నాయి. చాలాసార్లు కార్మికసంఘాలు ఆందోళనలు చేసినా కార్మికుల డిమాండ్లను బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చింది. చివరి బడ్జెట్లో కార్మికులకు వరాలు కురిపిస్తున్నట్టు చెప్పిన లెక్కలన్నీ ఎన్నికల జిమ్మిక్కు తప్ప మరోటి కాదు. గోవుల సంరక్షణకు కేటాయించి నంత బడ్జెట్ కూడా కార్మికులకు లేదంటే ఈ సర్కార్ ఎవరిపక్షం ఉందనేది తెలుస్తూనే ఉంది. ఈపీఎస్ పెన్షనర్లకు డీఏ ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా అమలు చేయకుండా కమిటీలతో కాలయాపన చేయడం దుర్మార్గం. ఎన్డీఏ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతున్నది. ప్రస్తుత తరుణంలో నాలుగుకోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులు, ఈపీఎస్ పెన్షనర్లు వాస్తవం గ్రహించాల్సిన అవసరముంది.