Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేంద్ర మోడీ నియంత మనస్తత్వానికి ఇప్పుడు సొంతపార్టీ నుంచే చీదరింపులు ఎదురవుతున్నాయి. స్వయానా మోడీ రాజకీయ గురువు, బీజేపీ వృద్ధనేత అద్వానీ వ్యాఖ్యలు ఈ ఎన్నికలవేళ దేశ ప్రజలను ఆలోచనలో పడవేస్తున్నాయి. ''బహుళత్వాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించడమే భారత ప్రజాస్వామ్య సారాంశం. పార్టీ నెలకొల్పిన దగ్గరనుంచీ ఎప్పుడు కూడా బీజేపీ తనను రాజకీయంగా వ్యతిరేకించేవారిని 'శత్రువులు' గా చూడలేదు. కేవలం 'ప్రత్యర్ధులు'గానే భావించింది. మా జాతీయవాద భావన విషయానికొస్తే.. రాజకీయంగా మాతో ఏకీభవించని వారిని 'జాతి వ్యతిరేకుల' ని భావించలేదు'' అంటూ అద్వానీ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. అద్వానీ వ్యాఖ్యలు అర్థసత్యాలే కావచ్చు. బీజేపీ భావజాల కార్యాచరణ చూసిన వారికి ఆయన వ్యాఖ్యలు కుత్రిమంగా తోచవచ్చు. కానీ ఆయన వ్యాఖ్యల సందర్భం, ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది గమనించినపుడు అద్వానీ వ్యాఖ్యలు దేశ ప్రజలు తప్పక పట్టించుకోవలసినవిగా అనిపిస్తాయి. ఈ దేశంలో మత రాజకీయాలకు ఒక సంకేతంగా కనిపించే అద్వాని, స్వయంగా తన శిష్యుడు మోడీని పరోక్షంగా ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు మోడీ ఎంత ప్రమాదకారో తేటతెల్లం చేస్తాయి. మోడీ గద్దెనెక్కిన ఏడాదికే 'దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయి' అని కూడా వ్యాఖ్యానించిన అద్వానీ, ఇప్పుడు ఈ ఎన్నికలవేళ మోడీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నది తన అభిప్రాయంగా చెప్పకనే చెప్పారు. రాజకీయాలలో ఇలాంటి వ్యాఖ్యలు సహజమేననీ, తమకు వ్యక్తిగతంగా ఒక వ్యక్తినుంచి నష్టం జరిగినపుడు రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడతారనీ సరిపెట్టుకోవలసిన విషయం కాదిది.
'ప్రజలను హిందువీకరించండి. హిందువులను సైనీకరించండి' అన్న హిందూత్వవాది సావార్కర్ నినాదాన్ని నరేంద్రమోడీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ భారత సైన్యాన్ని 'మోడీ కాసేన' అన్నారు. ఆదిత్యనాధ్ వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి, మాజీ సైనికాధికారి వీకే సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. 'భారత సైన్యాన్ని మోడీ సేన అనడం దేశ ద్రోహమే' అన్నారు. మోడీ కేబినెట్లోని మంత్రే ఇలా వ్యాఖ్యానించడం మోడీ ద్వారా దేశానికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. 'మోడీ మళ్లీ ప్రధాని అయితే ఈ దేశంలో ఇకపై ఎన్నికలే ఉండవు' అని ఓ బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించడాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్లేషించుకుంటే.. మోడీ ఈ దేశానికి ఒక నియంతలా మారబోతున్నారని అర్థమవుతుంది. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతున్నాయని అర్థమవుతుంది.
నియంతలు సాధారణ ప్రజా స్పందనలకు అతీతులు. తమ చర్యలను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారనేది వారికి అనవసరం. ప్రశ్నించే చైతన్యాన్ని నియంతలు సహించలేరు. చలనశీల ప్రజలను కాకుండా స్పందనలేని గాజుబొమ్మలు మాత్రమే తమ ఏలికలో ఉండాలని నియంతలు ఆకాంక్షిస్తారు. జవాబుదారీతనాన్ని వారు భరించలేరు. తమ చర్యలకు దండనలకు వారు భరించలేరు. ఇందుకు నిదర్శనం కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలు. భారత సైన్యాన్ని మోడీ సేన అన్నందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఎన్నికల కమిషన్ నోటీసులు అందుకున్న రోజే ఎలాంటి జంకూబొంకూ లేకుండా 'మన క్షిపణులు, రక్షణ సిబ్బంది ఉగ్రవాదుల కోటలపై విరుచుకుపడి వారిని ఏరిపారేశారు. ఇదేదో ఆషామాషీ సాహసం కాదు. ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే 'మోడీ సేన' జరిపిన దాడులపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఆధారాలు అడుగుతున్నాయి' అని శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాంపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నఖ్వీ విపక్షాలను విమర్శించారు. భారత సైన్యం మోడీ సేనేననీ, మోడీ చెప్పిన మాటలను ఎవ్వరూ ప్రశ్నించకూడదనీ ఒక కేంద్ర మంత్రి బరితెగించి మాట్లాడడం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తోంది.
గత ఎన్నికల్లో అనేక మాయమాటలు చెప్పి, ప్రజలను ఆశలపల్లకీలో ఊరేగించి మోడీ విజయం సాధించారు. అయితే, ఈ ఐదేండ్లలో తాను ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ నెరవేర్చలేక పోయారు. సరికదా, దేశాన్ని సర్వనాశనం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలను రేకెత్తించి, ప్రశ్నించే గొంతులను మట్టుబెట్టి, సామాన్యులను ఆర్థికంగా దివాళా తీయించి దేశాన్ని సమస్యల సుడిగుండంగా మార్చేశారు. తాము చేసిన దుశ్చర్యల కారణంగా ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది మోడీ పరివారానికి. తాము చేసిన మంచి పనులు చూపి ప్రజలను ఓట్లడిగేందుకు ముఖం చెల్లక మూర్ఖపు వాదనలతో పెట్రేగిపోతున్నారు. ప్రజలను ఒక ఉన్మాదంలోకి నెట్టి ఓట్లు దండుకునేందుకు బరితెగిస్తున్నారు.
దేశ ప్రజలకు ఇది అత్యంత కీలక సమయం. మోడీ పరివారం ప్రదర్శిస్తున్న కనికట్టుకు ఏమాత్రం ఏమారినా ఈ దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. దేశ ప్రజలు స్వేచ్ఛలేని బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. నరేంద్ర మోడీని గద్దె దించాల్సిన తరుణం ఆసన్నమైంది.