Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఈ ఎన్నికలు మా పాలనకు అగ్నిపరీక్ష'' అంటున్నారు బీజేపీ అగ్రనేత నితిన్గడ్కరీ. ''సంక్షేమం-సమానత్వం-కేపిటలిజం ఈ మూడు విషయాల్లో ప్రజలకు మా పట్ల అసంతృప్తి ఉన్నది'' అంటూ మోడీ సర్కారు వైఫల్యాలను పరోక్షంగానైనా సరే అంగీకరించారాయన. అందుకే తమ పార్టీ ఈ ఎన్నికల్లో పాలనా ప్రాతిపదికగా కాకుండా ''జాతీయవాదం'' పేరుతో ప్రజల ముందుకొస్తోందని కూడా కుండబద్దలు కొట్టారు..! ఏమిటీ జాతీయవాదం? ''మోడీ అంటే ఇండియా - ఇండియా అంటే మోడీ'' అని బీజేపీ ప్రచార యంత్రాంగం హౌరెత్తిస్తుంటే జాతీయవాదానికి అర్థం మారిపోతోంది. మోడీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టేనన్న ఉన్మాదమే జాతీయవాదమై చెలరేగుతుంటే.. మోడీ భక్తే దేశభక్తిగా చెలామణీ అవుతోంది! ఈ నేపథ్యంలోంచి గడ్కరీ వ్యాఖ్యలను పరిశీలిస్తేగానీ వీరి జాతీయవాదం ఎంత ప్రమాదకరమో బోధపడదు!
బీజేపీ మరో అగ్రనేత అద్వానీ వ్యాఖ్యల ప్రకంపనలు సద్దుమణగకముందే గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత హెచ్చరిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ అనేది ప్రతిపక్షాల విద్యుక్తధర్మం. కానీ... పధాని మోడీ మాత్రం రాహుల్ మొదలు కేజ్రీవాల్ వరకూ తననూ తన ప్రభుత్వాన్నీ విమర్శించేవారంతా దేశ ద్రోహులేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే అద్వానీ బ్లాగ్ ద్వారా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడమే కాదు, వాస్తవాలకూ అద్దం పడుతున్నాయి. రాజకీయంగా మనతో విభేదించేవారిని ప్రత్యర్థులుగా చూడాలే గానీ, శత్రువులుగా, జాతి వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చూడకూడదంటు న్నారాయన. పార్టీలోనూ, బయటా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అన్నారు. ''ముందు దేశం, తరువాత పార్టీ, ఆ తరువాతే నేను'' ఇదే బీజేపీ నేర్పిన పద్ధతి అని కూడా అన్నారు. వీటిలో నిజాయితీ, నిజానిజాల మాటెలావున్నా ఇవన్నీ ''ముందు నేను, తరువాత పార్టీ, ఆ తరువాతే దేశం'' అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీపై సంధించిన వ్యంగాస్త్రాలేనన్నది బహిరంగ రహస్యమే!
అద్వానీ, గడ్కరీల వ్యాఖ్యల వెనుక కారణాలేమైనప్పటికీ అవి వెల్లడిస్తున్న వాస్తవాలను విస్మరించలేం. వీరి జాతీయవాదం అనే ఉన్మాదం నేడు భారత సైన్యాన్ని సైతం మోడీ సైన్యంగా అభివర్ణించే స్థితికి చేరింది. క్షేత్రస్థాయి కార్యకర్తలు, చోటామోటా నాయకులు మాత్రమే కాదు.. సాక్షాత్తూ బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులే ఈ వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాద్ నుంచి కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీదాకా, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా నుంచి చివరికి రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్సింగ్ దాకా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నా వీరిపై ఎలాంటి చర్యలూ లేవు! పైగా వీటిని ఎవరు ప్రశ్నించినా, నిలదీసినా వారిని దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్న దుస్థితి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినా ఇదే పరిస్థితి. విమర్శ అనేది ఏవైపు నుంచి వచ్చినా అది దేశాన్నీ, ప్రభుత్వాన్నీ బలహీనపరిచే చర్యగా చిత్రిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇంతకంటే ప్రమాదమే ముంటుంది..!?
కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం వల్ల, నేతల తప్పిదాలను ప్రశ్నించడం వల్లనే ప్రభుత్వమూ, రాజ్యమూ బలహీనపడుతుందా? ప్రజల నిబద్ధత చెదిరిపోతుందా? ఈ ప్రశ్నకు నియంతలెప్పుడూ అవుననే సమాధానమిస్తారు. ప్రజాస్వామ్యవాదులు మాత్రమే కాదని చెపుతారు. దీనిని మన వర్తమానానికి అన్వయించుకుంటే ఈ దేశంలో నియంతలెవరో, ప్రజాస్వామ్యవాదులెవరో తేల్చుకోవడం అంత కష్టమేమీ కాదు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం, ప్రశ్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమిక లక్షణాలు. వాటికి సమాధానమివ్వడం ఏలికల విధి. ఆ సమాధానం కష్టమైనప్పుడే అసహనం బుసలు కొడుతుంది. నియంతృత్వానికి దారులుతీస్తుంది. ఈ ఐదేండ్ల ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పక్షం పోకడలు ఇదే సూచిస్తున్నాయి. అద్వానీ, గడ్కరీల వ్యాఖ్యలు ప్రమాదాన్ని మరింత ధృవీకరిస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని ఓడించడమే నేడు ప్రజాస్వామ్య ప్రగతిశీల శక్తుల ప్రథమ కర్తవ్యం. ఈ విషయాన్ని రాజకీయ పక్షాలన్నీ అంగీకరిస్తున్నా ఆచరణలో ఒక్క వామపక్షానికి మినహా ఏ పక్షానికీ నికరమైన వైఖరి లేకపోవడం నేటి విషాదం!
''మేథోపరమైన, నైతికపరమైన పతనం యధేచ్ఛగా జరుగుతుంటే, ప్రభుత్వం నిరంకుశంగా మారుతుంటే... కొంత మంది గోడమీద పిల్లులుగా మారిపోవడాన్ని లలితకళగా మార్చుకుంటున్నారు'' అంటారు జవహర్లాల్ నెహ్రూ. ప్రస్తుత పరిణామాలకు ఈ మాటలు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి! ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసి, రాజ్యాన్ని నిరంకుశంగా మార్చుతున్న ధోరణులు అధికార పక్షంలో స్పష్టంగా కనిపిస్తుంటే... దీనిని ప్రశ్నించి, ప్రతిఘటించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఇతర రాజకీయ పక్షాలు గోడమీద పిల్లుల్నే తలపిస్తున్నాయి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలో టీఆర్ఎస్ దాకా అన్ని పార్టీలూ అవకాశవాద వైఖరిలో ఒకదాన్ని మించి మరొకటి పోటీపడుతూ తమ లలిత కళానైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అద్వానీ, గడ్కరీలవి కేవలం వ్యాఖ్యానాలే కాదు హెచ్చరికలు...