Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయపార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టో(ఎన్నికల ప్రణాళిక)లు దేశ భవిష్యత్తుకు దిక్సూచి లాంటివి. గతాన్ని సమీక్షించుకుని రాబోయే ఐదేండ్లలో తమ హయాంలో దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతామన్నది ఎన్నికల ప్రణాళికల ద్వారా ప్రజలకు తెలియజెప్పాల్సి ఉంటుంది. కానీ బీజేపీ మ్యానిఫెస్టోను పరిశీలిస్తే ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కనిపిస్తున్నది. హిందూత్వ ఓటు బ్యాంకును ఒక్కటి చేయటమే బీజేపీ లక్ష్యమన్నది దీనిద్వారా అర్థమవు తున్నది.
'సంకల్పిత్ భారత్, సశక్త్ భారత్' శీర్షికతో 45పేజీల మ్యానిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ సమక్షంలో మోడీ సోమవారం విడుదల చేశారు. జమ్మూ-కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, 35ఎ రద్దు కోసం ప్రయత్నిస్తామని, గ్రామీణాభివృద్ధికి రూ.25లక్షల కోట్లు కేటాయిస్తామని, భూ రికార్డుల డిజిటలైజేషన్, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని బీజేపీ ప్రకటించింది. రాజ్యాంగ పరిధిలోనే రామమందిర నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పడంతో పాటు శబరిమల అంశాన్ని కూడా చేర్చింది. దేశవ్యాప్తంగా పౌర రిజిస్టర్ అమలుచేస్తామని, ఉగ్రవాదం మీద రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొంది. ఒకప్పటి జనసంఫ్ు కాలం నాటి అంశాలను తెరమీదికి తెచ్చి హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాన్ని మ్యానిఫెస్టో ద్వారా చూపడం గమనార్హం. సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా శబరిమలలో పూజలు ఉండేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పడమంటే, ప్రస్తుతం ఇచ్చిన తీర్పును కాదని చెప్పడమా? లేక సమస్యను వివాదం చేయడమా? జమ్మూకాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపకుండా 370 ఆర్టికల్ రద్దు చేస్తామనడమంటే, కాశ్మీర్ అంశాన్ని రెచ్చగొడుతూ మతం చుట్టూ రాజకీయాలు నడపడమే. ఇలాంటి ప్రకటనల ద్వారా భావోద్వేగాలను రెచ్చగొట్టడం అవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు. ఐదేండ్లు రామమందిరం గురించి మాట్లాడకుండా మళ్లీ మ్యానిఫెస్టోలో చేర్చడం ఉద్దేశ్యమేంటీ? ఎన్నికల్లో లబ్ది పొందేందుకు తప్ప రామమందిర నిర్మాణం చేపట్టాలన్న నియమం బీజేపీకి లేదన్నది వాస్తవం. దేశంలో మత విభజన వేగవంతం చేయడానికే ప్రణాళికలో మందిర నిర్మాణాన్ని ప్రస్తావించినట్టు అర్థమవుతున్నది. ఇది భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికే పెను సవాలు.
మోడీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే మోడీ అనే నినాదాన్ని గత ఎన్నికల్లో బీజేపీ వాడుకున్నది. మోడీ వస్తే దేశం దూసుకుపోతుందని, నల్లధనం ఎక్కడున్నా తవ్వి తీస్తామనీ, పేదల అకౌంట్లలో లక్షలు జమ చేస్తామనీ హామీలు గుప్పించారు. ఆ అంశాలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి. ఐదేండ్ల తర్వాత చూస్తే మోడీ చెప్పిన మేకెన్ ఇండియా లేదు. అచ్చేదిన్కి లేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల్లేవు. బీజేపీ విధానం జాతీయ వాదమేనని, సుపరిపాలన తమ మంత్రమనీ అంటున్న మోడీ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదు. సుపరిపాలన గురించి మోడీ పేర్కొనడమే ఒక వింత. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత దాని ఊసే మరిచారు. ఇప్పుడు 2020నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటే నమ్మేదెవరు? కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఎకౌంట్లలో రెండువేల రూపాయలు జమచేస్తామని చెప్పి సగం మందికి కూడా వేయలేదు. గ్రామీణాభివృద్ధి పట్ల ప్రేమ కనపరుస్తున్న బీజేపీ, ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు ఎందుకు తగ్గించిందన్నది ప్రశ్న. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.50 లక్షల వడ్డీలేని రుణాలను అందిస్తానంటున్న బీజేపీ, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో నష్టపోయిన చిన్న పారిశ్రామికవేత్తలను ఎందుకు ఆదుకోలేదు. ఈ రెండింటితో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఇప్పటికీ ప్రజలు కోలుకోలేదు. పౌరసత్వబిల్లుపై ఇప్పటికే ఈశాన్య ప్రాంతాలు రగులుతుంటే, దానిని మిగతా రాష్ట్రాలకూ వర్తింపజేస్తామని చెప్పడంలో అర్థమేంటి? దేశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవడానికా? పదేండ్లుగా అమలు చేస్తున్న విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటూ వస్తున్నదని, భవిష్యత్తులో ఇలానే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ పిచ్ తెలియజేసింది. పెట్టుబడులు ఏ మాత్రం పెరగకపోవడం, నిరుద్యోగం ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. మరో ఐదేండ్లకు అధికారం కట్టబెడితే మరింత బాగా దేశాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తామని కాషాయపెద్దలు చెప్పడం విడ్డూరం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయకుండా మతం పేరిట ప్రజల మధ్య విద్వేషాలు రాజేసిన బీజేపీ ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదం. ఇంకా ఆ దిశగా ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే అవివేకమే. మోడీ విధానాలతో నష్టపోయిన ప్రజలు ఆలోచించాలి. మత ప్రాతిపదికన చిచ్చుపెట్టాలని చూస్తున్న పార్టీల పట్ల జాగరూకతతో వ్యవహరించాలి.