Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో వ్యవస్థల హననం యధేచ్ఛగా సాగుతోంది. 'ఎన్నికల సంఘం నిజాయితీగా వ్యవహరిస్తున్నదన్న నమ్మకం కలగడం లేదు. అన్ని పార్టీలనూ ఒకే రీతిన చూడకుండా, కొన్ని పక్షాలపై కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నందున ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజలలో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది' అంటూ 66మంది మాజీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి కోవింద్కు లేఖ రాయడం మోడీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగబద్ధ స్వతంత్ర వ్యవస్థలకు ఏ గతి పట్టిస్తున్నదో సూచిస్తోంది. ప్రజాస్వామ్యానికి ప్రాణపదం ఎన్నికలు. ఆ ఎన్నికలను నిస్పక్షపాతంగా, పారదర్శకంగా నిజాయితీగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. కానీ, అలాంటి ఎన్నికల వ్యవస్థే ఇప్పుడు ఎన్నడూ లేనన్ని విమర్శలు ఎదుర్కొంటున్నది. తన విశ్వసనీయతకు తానే పరీక్ష పెట్టుకుంటున్నది.
నిజానికి, ఆవిర్భావం నుంచీ భారత ఎన్నికల సంఘం విమర్శలకు అతీతంగా ఏమీ లేదు. పాలకుల పెత్తనానికి లొంగకుండా స్వతంత్రంగా నిలబడాలన్న రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలను వమ్ముచేస్తూ, తనకున్న తిరుగులేని అధికారాలను ప్రజాసంక్షేమార్థం ప్రయోగించడంలో విఫలమై నాలుగు దశాబ్దాల పాటు వెన్నెముకలేని వ్యవస్థగా వాసికెక్కింది. ఎన్నికల కమిషన్ మరింత ప్రజాస్వామికంగా పనిచేసేందుకంటూ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ కూడా ఆచరణలో అధికార పార్టీల పాదాక్రాంతమయ్యింది. ఎన్నికల కమిషన్ను తమ తొత్తుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ - బీజేపీలు దొందూదొందే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. 'ఏ కీలక అధికార పదవికీ తగడు' అంటూ సర్కారియా కమిషన్ ఆంక్షలు విధించిన వ్యక్తిని కూడా ఎన్నికల సంఘంలో కొలువు దీర్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే!
అయితే, మోడీ హయాం ప్రారంభమైన తరువాత పరిస్థితి మరింతగా విషమించింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉండాలన్న లా కమిషన్, పార్లమెంటరీ సంఘాల సిఫార్సును పట్టించుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు 2017లోనే తప్పుపట్టినా, సీఈసీ సహా ఎన్నికల కమిషనర్ల పారదర్శక నియామకాల నిమిత్తం 324(2) అధికరణ ప్రకారం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని నిర్దేశించినా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి రాజ్యాంగ వ్యవస్థలపై తన చిన్నచూపును చాటుకుంది. అంతేకాదు, అప్పటి వరకూ ఈసీని తనకు అనుకూలంగా వాడుకోవడంతో సరిపెట్టుకోకుండా, తన శతృవులపై ప్రయోగించడం ప్రారంభించింది. ఈ శృతిమించిన ధోరణి సృష్టిస్తున్న కల్లోలాన్నే దేశంలో మనమిప్పుడు చూస్తున్నాం. ఓటర్ల జాబితా నుంచి పేర్ల గల్లంతు, మాట వినని అధికారుల విచ్చలవిడి బదిలీలు, రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ, ఈడీ ముప్పేట దాడులు, అస్తవ్యస్థ ఎన్నికల నిర్వహణ, ఏమాత్రం జవాబుదారీతనాన్ని పాటించకపోవడం వంటి చర్యలతో ఎన్నికల సంఘం పాలకుల చేతికీలుబొమ్మగా, ప్రతిపక్షాల పాలిట విలన్గా అపకీర్తి మూటగట్టుకుంటూ, ప్రజాస్వామిక విలువలకు పాతరేస్తోంది. కాబట్టి 'పశ్చిమబెంగాల్ ఉన్నతాధికారులపై తక్షణ చర్యలు తీసుకున్న ఈసీ- గుట్కా కుంభకోణంలో నిందితుడైన తమిళనాడు డీజీపీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు' అని విశ్రాంత అధికారుల బృందం ఈసీని ప్రశ్నించాల్సి వచ్చింది. ఇక, పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అయితే ఈసీ లీలలు ఇన్నిన్ని కావు. సీఈవో సిసోడియా చురుగ్గా వ్యవహరించ లేక పోతున్నాడంటూ ఆయన స్థానంలో ద్వివేదీని నియమించింది. ద్వివేదీకి తోడుగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన మాజీ ఐపీఎస్ అధికారి కేకే శర్మను ప్రత్యేక ఎన్నికల పరిశీలకునిగా నియమించింది. ఎన్నికల ప్రక్రియతో ఏ మాత్రం సంబంధంలేని ఇంటెలిజెన్స్ డీజీని తప్పించింది. అంతటితో ఆగకుండా ఏకంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అనీల్ చంద్ర పునీతను బదిలీ చేసింది. ఏపీలోని మోడీ యేతర పక్షాలు ఎంతగా మొత్తుకుంటున్నా, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు ధర్నాలకు కూర్చున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. దీంతో గురువారం ఏపీలో జరిగిన పోలింగ్ ప్రక్రియ చరిత్రలో ఎన్నడూ లేనంత చెత్తగా సాగింది. వృద్ధులూ, మహిళలూ, వికలాంగులూ ఏమాత్రం కనీస సదుపాయాలు లేకుండా గురువారం ఉదయం 7గంటల నుంచి అర్థ రాత్రి 1గంట వరకూ సాగిన పోలింగ్ తతంగంలో నరకం చవిచూశారు. పదో, ఇరవయ్యే అయితే అది వేరే విషయం, అలా కాకుండా వేల సంఖ్యలో ఈవీఎంలు మొరాయించడం ఎలా జరిగిందన్నది అంతు చిక్కని విషయం. ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయన్న ఆరోపణలకు ఇలాంటి సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. ఒక్కోచోట 4-5 గంటల పాటు పోలింగ్ ఆగిపోవడం ఈసీ శక్తి సామర్థ్యాలను అపహాస్యం చేస్తున్నాయి. అయినా, ఎన్నికల సంఘం వికృత చర్యలకు విరుగుడుగా మొక్కవోని దీక్షతో ప్రజలు ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యం ఎడల తమ ప్రజలు విశ్వాసాన్ని చాటారు.
ఎన్నికల సంఘం ముఖ్య అధికారులు తమ పదవీఅనంతర ప్రయోజనాల కోసమే పాలకులకు పాలేర్లుగా తయారై ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారన్నది వాస్తవం. వ్యక్తిగత ప్రయోజనాలకోసం తమ వ్యక్తిత్వాలకు మలినమంటించుకునే అధికారులలో మార్పు ఆశించడం కన్నా, ప్రజా చైతన్యంతో అలాంటి వ్యవస్థలో సమూల మార్పులు సాధించడమే నేటి అవసరం. యావత్ దేశ ప్రజలు ఈ దారి పడతారని ఆశిద్దాం.