Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టుకతోనే ఒక వ్యక్తిని అస్పృశ్యునిగా పరిగణించడం మహానేరం. ఒక మనిషి సాటి మనిషిని అంటరానివానిగా చూడటం మానవత్వానికే పెను విఘాతం శతాబ్దాలుగా సాగిన ఈ వివక్ష మాసిపోవాలన్న స్వప్నం ఇంకా సాకారం కాలేదు. అంటరాని వారు అంటూనే వారి శ్రమశక్తిని కొల్లగొడుతూ పశువుల కన్నా హీనంగా చూడటం మహాపరాధం. ఈ వివక్షని అంతమొందించాలన్న సదాశయం, రాజ్యాంగం సాక్షిగా ప్రకటించినా ఇంకా కొనసాగుతూనే ఉంది. చివరకు 'దళిత' అనే పదం ఉపయోగించరాదని హుంకరించే స్థాయికి పెచ్చరిల్లింది. కేవలం దళితులయినందునే సకల రంగాల్లో అవమానాల్ని ఎదుర్కోవాల్సి రావడం దారుణం. అంటరానితనం అమానుషం అని చాటిన అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం నేటికీ కొనసాగడం ఈ దారుణాలకు పరాకాష్ట. ఆ మహామనిషి జన్మించి వందేండ్లు దాటిన తర్వాత కూడా దళిత ప్రపంచం అవమానాలతో, రక్తసిక్తగాయాలతో కునారిల్లుతోంది.
మనుషులుగా ఆత్మగౌరవంతో జీవించే హక్కుకోసం బతుకంతా పోరాడిన అంబేద్కర్ విగ్రహాలు దళితులకు స్ఫూర్తిదాయకం. పాలకవర్గాలకు సింహస్వప్నం. అందుకే విగ్రహాల ధ్వంసం ఆధిపత్య కులాలకు పరిపాటయ్యింది. దళితుల మీద నేరుగా దాడులు చేయలేనపుడు అంబేద్కర్ విగ్రహాల్ని లక్ష్యంగా చేసుకుంటారు. అనేకమంది నాయకుల విగ్రహాలున్నా కేవలం అంబేద్కర్ విగ్రహమే లక్ష్యం కావడం గమనార్హం. ఎందుకంటే అంబేద్కర్ ప్రతిమ కేవలం ఉత్సవ విగ్రహం కాదు, ధిక్కార నినాద గొంతుక. అణచివేతకు లోనయ్యే వారి ఆత్మగౌరవ ప్రతీక. ఆధిపత్యకులాల పెత్తనాల మీద తిరుగుబాటు బావుటా. కులనిర్మూలన కోసం సంఘటితమయ్యే పీడిత కులాల సాంస్కృతిక ఆయుధం.
అంబేద్కర్ జయంతులకు, వర్థంతులకు అందరూ నివాళులు అర్పిస్తారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన కృషిని తలపోస్తారు. కానీ ఆచరణలో కుల నిర్మూలన లక్ష్యంగా సాగిన ఆయన ఆలోచనల సారాన్ని అందిపుచ్చుకునే వారు అరుదు. దళితులకు కావాల్సింది తాయిలాలు కాదు రాజ్యాధికారంలో భాగస్వామ్యమన్న మాటని పనిగట్టుకొని పక్కన పెడతారు. దళితుల్ని ఓట్లబ్యాంకుగా మార్చుకున్న నేతలంతా వారి పట్ల వివక్షనీ, పెత్తనాన్నీ మౌనంగా ఆమోదిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. దళితులకు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల మీద అనుకూల, ప్రతికూల చర్చల్ని కూడా వివక్ష కొనసాగింపునకు ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు.
రిజర్వేషన్లు భిక్ష కాదు, హక్కు అన్న మాటని విస్మరించి సకల రంగాల్లో న్యూనత కనబరుస్తున్నారు. ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్నప్పటికీ కేవలం దళితులయిన కారణంగా ఒక పక్కకు నెట్టబడుతున్నారు. సివిల్సర్వీసు స్థాయి అధికారులుగా ఉన్నప్పటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అవమానాలకీ, చిన్నచూపుకీ లోనయినవారు అనేకులు. అంటే ఎంతగా ప్రతిభాసంపత్తులున్నప్పటికీ పుట్టుకతో దళితులయినవారు జీవితపర్యంతం తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడక తప్పడం లేదు. చట్టం ముందు, న్యాయస్థానాల ముందు అందరూ సమానులే అంటారు, కానీ అత్యాచారాలకు, హత్యలకు గురయిన దళితులకు న్యాయం ఎండమావి. కారంచేడు, చుండూరు కేసుల్లో దళితులకు జరిగిన న్యాయం ఏమిటి? లక్షింపేట బాధితులకు చట్టం ఒరగబెట్టిందేమిటి? సత్యంబాబు కేసులో న్యాయం జరగడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఆలోచిస్తే, వివేచిస్తే దళితులకు జరుగుతున్న న్యాయాన్యాయాలపై అనేకానేక ప్రశ్నలు తలెత్తుతాయి.
సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఈ ప్రశ్నల్ని సంధిస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే ముల్క్రాజ్ ఆనంద్ 'అన్బచ్బుల్' అనే నవల రాశారు. తెలుగులో కళ్యాణరావు 'అంటరాని వసంతం' నవల సృజించారు. అంతకుముందే దళితుల సంవేదనని కుసుమ ధర్మన్న, గుఱ్ఱం జాషువా, బోయీ భీమన్నలు వినిపించారు. దళితుల విముక్తిని శివసాగర్ 'మోగుతున్న మాదిగడప్పు' 'ఛండాల స్వప్నం' కవితల్లో ఆలపించారు. శతాబ్దాల పీడన మీద మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో దళిత బహుజనుల ధిక్కారస్వరాలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. వివక్ష ఇంకానా ఇక సాగదు అనే ఆత్మగౌరవ చైతన్యం పరిఢవిల్లుతోంది. అయితే అస్పృశ్యత, అంటరానితనం అనే భావనలపై నిరసన మన సామాజిక జీవితంలో భాగం కాలేదన్నది వాస్తవం. అందుకే అమృతని ప్రేమించిన ప్రణరు హత్యకు గురయ్యాడు. దళితులుగా పుట్టిన వారికి ఇతరుల్ని ప్రేమించే హక్కు, పెళ్లాడే హక్కు లేదనే భావజాలానికి సమాజంలో ఆమోదం లభిస్తున్నది.
భారతీయ సమాజంలో ఇవాళ్టికీ నిచ్చెన మెట్ల కులవ్యవస్థ అమలవుతోంది. అగ్రభాగాన ఉన్న బ్రాహ్మణీయ భావజాలం మొత్తం సామాజిక జీవనాన్ని శాసిస్తున్నది. అంబేద్కర్ పుట్టిన వందేండ్ల అనంతరమూ సమాజం పరివర్తన చెందలేదు. కనుకనే 'ఎవరయినా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా' అని ఒక పార్టీ అధినేత బాహాటంగా అన్నప్పటికీ ప్రధాన స్రవంతి సమాజం స్పందించలేదు. మొత్తం మీడియా ఈ విషయంలో పట్టనట్టుగానే వ్యవహరించింది. ఒక మనిషి పుట్టుక సహజాతి సహజం. కానీ వారి పుట్టుకనే అవమానంగా పరిగణించడం ఎంతటి క్రౌర్యం! ఈ అమానుష వ్యవస్థ పోవాలంటే కులనిర్మూలన జరగాలని అంబేద్కర్ ఆకాంక్షించారు. ఆయన స్వప్నం సాకారం అయినపుడే పుట్టుకతోనే వివక్షకు లోనయ్యే పరిస్థితులు సమసిపోతాయి. అయితే ఈ స్వప్నసాకారం సుదీర్ఘ పోరాటాల ద్వారానే సాధ్యం. అణచివేతకు లోనయ్యేవారంతా సంఘటితమై నిలబడి కలబడటం ద్వారా నెరవేరే స్వప్నం. ఈ స్వప్నసాకార దిశగా సకల పాయల్ని కలుపుకుంటూ వెళ్లడం పీడితుల పక్షాన నిలబడే వారి కర్తవ్యం.