Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాఫెల్ డీల్పై ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని ప్రధానికీ, బీజేపీకీ హితవు పలుకుతోంది శివసేన. శివసేన ఏ ఉద్దేశంతో ఈ హితబోధకు పూనుకుందన్నది పక్కనబెడితే, ఇప్పటికే ఈ ఒప్పందంలో ప్రధానీ, ప్రభుత్వాల తీరు పట్ల వెలువడుతున్న ఆరోపణలను, అనుమానాలను ఇది మరింత బలపరుస్తున్నది. ఎన్నికలవేళ ఈ హితవచనాలు తలకెక్కాయో ఏమో గానీ ప్రధానీ, పాలకపార్టీ నేతలు ఈ అంశంపై మాట్లాడటం మానేసారు. దీనితోపాటే ఈ ఐదేండ్ల తమ పాలనాతీరుపై కూడా మాట్లాడటం లేదు. చర్చను దారి మళ్లిస్తూ హిందూత్వ ఉద్రేకాలకు తోడు కొత్తగా జాతీయ భద్రతను కూడా రాజకీయాల్లోకి లాగి ఎన్నికల్లో లబ్ది పొందే పనిలో మోడీ ఆయన బలగం తలమునకలై ఉన్నారు. అయినా రాఫెల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ మోడీని వెంటాడుతూనే ఉంది. తాజాగా... ఫ్రెంచ్ పత్రిక 'లేమాండే' వెల్లడించిన కథనం ఈ ఒప్పందంలో మరో కోణాన్ని ఎత్తి చూపుతోంది. రాఫెల్ డీల్కు ముందు ససేమిరా అన్న ఫ్రెంచ్ ప్రభుత్వం, ఆ డీల్ అనంతరం రిలయన్స్ ఫ్లాగ్కు రూ.1125 కోట్ల భారీ లబ్ది చేకూరుస్తూ పన్ను రాయితీ ఇచ్చిందన్నది ఈ కథనం సారాంశం. ఇప్పటికే అనేక కోణాలలో మోడీని దోషిగా నిలబెడుతున్న ఈ వివాదంలో ఇప్పుడిది సరికొత్త కోణం!
అనిల్ అంబానీకి చెందిన ''రిలయన్స్ కమ్యూనికేషన్స్''కు అనుబంధంగా 'రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్' అనే కంపెనీ ఉన్నది. అది ఫ్రాన్స్లో కేబుల్ నెట్వర్క్స్, టెలికం ఇన్ఫాస్ట్రక్చర్స్ ప్రధానంగా పనిచేస్తోంది. ఈ కంపెనీ చెల్లించాల్సిన పన్ను బకాయిలపై సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ బకాయిల మొత్తం 2007 నుంచి 2012 నాటికి 151 మిలియన్ యూరోలకు చేరింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.1200 కోట్లు. కాగా తాము అంత చెల్లించలేమనీ, తమ కంపెనీ నష్టాల్లో ఉందనీ, కేవలం 7.3 మిలియన్ యూరోలు మాత్రమే చెల్లించగలమని రిలయన్స్ ఫ్లాగ్ సెటిల్మెంట్కు ప్రయత్నించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించక పోవడంతో ఈ వివాదం ఏండ్లతరబడి కొనసాగుతూనే ఉంది తప్ప రాజీకి మాత్రం అవకాశాలు లేకుండా పోయాయి. పైగా రిలయన్స్ ఫ్లాగ్ రికార్డులేవీ సక్రమంగా లేవనీ, ఫ్రెంచ్ నియమ నిబంధనలు వాటిని అంగీకరించవనీ, ఈ కంపెనీ చట్ట విరుద్ధంగా రిలయన్స్ ఫ్లాగ్ లావాదేవీలను రిలయన్స్ గ్రూపు ఇతర కంపెనీల రికార్డుల్లో చూపిందనీ ఫ్రెంచ్ టాక్స్ అథారిటీ తప్పు బట్టింది. అయితే ఇన్ని తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇన్నేండ్లుగా రాజీకి అవకాశమే ఇవ్వని ఫ్రెంచ్ ప్రభుత్వం, ఇప్పుడు రూ.1200 కోట్ల పన్నును రూ.56 కోట్లకే పరిమితం చేయడం, ఏకంగా రూ.1125కోట్ల పన్ను రద్దు చేయడం ఆశ్చర్యంతో పాటు అనుమానాలనూ రేకెత్తించడం సహజం!
ఈ వివాదం కొనసాగుతుండగానే 2015ఏప్రిల్లో ప్రధాని మోడీ ఫ్రాన్స్లో రాఫెల్ ఒప్పందాన్ని పునరుద్ధరించారు. ఈ ఒప్పందం కోసం ఫ్రాన్స్కు వెళ్లిన మోడీ బృందంలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు. విశేషమేమిటంటే ఈ ఒప్పందం పునరుద్ధరణలో విమానాల ధర, సంఖ్య, ఇతర నియమ నిబంధనలలో మార్పులతో పాటు ఇండియన్ పార్ట్నర్గా 'హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్)' స్థానంలో 'రిలయన్స్ డిఫెన్స్' వచ్చి చేరింది. విచిత్రంగా ఆ తరువాత కొద్ది రోజులకే ఫ్రెంచ్ ప్రభుత్వ ఆడిటర్ మారిపోవడం, ఆయన స్థానంలో కొత్త ఆడిటర్ రావడం, రిలయన్స్ పన్నుల వివాదంలో కుదరదంటే కుదరదని చెప్పిన రాజీ కుదిరిపోవడం, అంబానీకి పన్నులు రద్దయి అప్పనంగా 1125కోట్ల లబ్ది చేకూరడం వెంట వెంటనే జరిగిపోయాయి.
ఇదంతా చూస్తుంటే ఈ అంబానీ ప్రయోజనాల కోసమే ఈ ఒప్పందంలో దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారా? అన్న అనుమానం రాకమానదు. రూ.526కోట్ల ధర కలిగిన ఒక్కో యుద్ధ విమానాన్ని 1670కోట్లకు అంటే మూడురెట్ల అధికధరకు కొనుగోలు చేయడం ఎవరికోసం? ఒప్పందంలో కొనుగోలు చేయాల్సిన యుద్ధ విమానాల సంఖ్య 126. వీటిలో 12 మాత్రమే తయారైన విమానాలను తీసుకోవాలి. మిగిలిన 108 యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారు చేయాలన్నది ఒక ముఖ్య నియమం. దీనివలన దేశంలో ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది, ఎకానమీ అభివృద్ధి చెందుతుందన్నది ఈ నియమ ప్రయోజనం. కానీ ఇప్పుడీ కండీషన్ కూడా తొలగించి కేవలం 36 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలి, అది కూడా తయారైన వాటినే తీసుకోవాలని తిరగ రాసారు! ఎవరి ప్రయోజనాల కోసం? 36యుద్ధ విమానాలే మన రక్షణరంగ అవసరాలు తీరుస్తాయా? ఇక కొనుగోలు చేసే యుద్ధ విమానాలతో పాటు వాటిని తయారుచేసే టెక్నాలజీని కూడా మనకివ్వాలని చెప్పే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లాజును తొలగించారు. సదరు కంపెనీ బ్యాంకు గ్యారంటీ అవసరం లేదన్నారు. ప్రభుత్వ పరమైన సావరిన్ గ్యారంటీ కూడా అవసరం లేదన్నారు. ఈ ఒప్పందంలో అవినీతి నిరోధించే ఇంటిగ్రిటీ క్లాజ్ తొలగించారు. తేడా వస్తే తేల్చుకోవల్సింది ఢిల్లీలోనే అని చెప్పే అర్బిట్రేషన్ క్లాజ్నూ తొలగించారు. ఇవన్నీ ఫ్రాన్స్ ప్రభుత్వానికి, ఆ దేశ దసాల్ట్ కంపెనీకి ప్రయోజనం చేకూర్చేవేనని రక్షణశాఖ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మరి అంతగా ఈ దేశం ప్రయోజనాలను పణంగా పెట్టి ఫ్రాన్స్ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సిన అవసరమేమిటి? దేశానికి ఏ ప్రయోజనమూ లేని ఈ ఒప్పందం ఎవరికోసం? అంబానీ కోసమేనా..!? ''లేమాండే'' కథనం రేకెత్తిస్తున్న ప్రశ్న ఇదే.