Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేండ్లలో విద్యారంగం నిరంతరం దాడులను చవిచూస్తూనే ఉన్నది. నిధుల్లో కోతపెట్టింది. పరిశోధనలను అడుగంటించింది. విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ శక్తులను జొప్పించి, విద్యను కాషాయీకరణ చేయడం కోసం చేయాల్సిందంతా చేసింది. పాఠ్యాంశాలను ఆధునీకరించే పేరుతో పాఠశాల విద్యార్థులకు భారం తగ్గించేందుకు అన్ని పాఠ్యాంశాల్లో పాఠాలను తగ్గిస్తున్నామంటూ కుదించడం వెనుక ప్రభుత్వం ఉద్దేశమేంటన్నది స్పష్టమవుతున్నది. సామాజిక మార్పునకు దారితీసే నవలలు, రైతుల పోరాటాలు, పెట్టుబడిదారీ దోపిడీ తదితర అంశాలు విద్యార్థుల్లో తిరుగుబాటు తత్వాన్ని ప్రేరేపిస్తాయన్న భయంతోనే బీజేపీ ప్రభుత్వం చరిత్రకు సంబంధించిన సామాజిక అంశాలను భావితరాలకు తెలియనీయకుండా పాఠ్యాంశాలనుంచి ఒక్కొక్కటీ వరుసగా తొలగించేందుకు సిద్ధమైంది.
కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ (ఎన్సీఆర్టీ) 9వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి మూడు అధ్యయాలను తొలగించాలని నిర్ణయించింది. వస్త్రధారణ, కుల ఘర్షణలు, క్రికెట్ చరిత్ర, రైతులు-వ్యవసాయం వలసవాద దోపిడీ అనే మూడు అధ్యాయాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా పదో తరగతి పాఠ్యపుస్తకం నుంచి కూడా భారత్ చైనాల్లో జాతీయవాదం, నగరాల పెరుగుదల, నవలలు సమాజ చరిత్ర, అంశాలకు గాను మొత్తం 200పేజీల్లో 72పేజీలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకున్న దరిమిలా విద్యార్థులకు సిలబస్ను సులభతరం చేసే పేరుతో 2016లో కేంద్రప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ తనకు ఇచ్చిన గైడ్లైన్స్తో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని జొప్పించే ప్రయత్నంలో చరిత్రను మరుగున పడేసేందుకు సిద్ధపడటం దారుణం. మిగతా వాటిల్లో కంటే విద్యార్థుల మనస్సుల్లో పెనవేసుకు పోయే పాఠ్యాంశాల తొలగింపునకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతున్నది. వాస్తవానికి పరీక్షల్లో చరిత్ర పాఠ్యపుస్తకంలోని ఎనిమిది అధ్యాయాలలో ఐదింటిని విద్యార్థులు ఎంచుకోవాలి. ఈ ఎంపిక విద్యార్థుల్లో గందరగోళానికి దారి తీస్తుందని చెప్పి చరిత్రలోని ప్రజలు, సామాజిక అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పాఠ్యాంశాలను లేకుండా చేస్తుందంటేనే ప్రభుత్వ ఉద్దేశ్యం అర్థమవుతున్నది. విద్యార్థులకు ఏది అవసరం, పాఠ్యాంశాల నుంచి ఏయే అంశాలను తొలగిస్తే బాగుంటుందన్నది చరిత్రకారులు, మేధావులు, ఉపాధ్యాయులు, నిపుణులు నిర్ణయిస్తారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న సంఫ్ుపరివార్ శక్తులే అన్ని ప్రభుత్వ సంస్థల్లో రాజ్యమేలుతున్నారు. విద్యలోనూ వారు చెప్పినట్టే నడుస్తున్నది. ప్రభుత్వం చేయాల్సిందేమిటి? పరీక్షల్లో రాయాల్సిన సిలబస్ను తగ్గిస్తే సరిపోతుంది. అలా గాకుండా కావాల్సిన పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులకు లేకుండా జేయడమంటే ఏమని భావించాలి.
సామాజిక అంశాల్లో ఆయా సెక్షన్లలో జరిగిన పోరాటాలు, ఆందోళనలు తెలుసుకునే అవకాశాన్ని విద్యార్థులకు లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ రోజున మనదేశం లౌకికదేశంగా గుర్తింపు పొందడానికి ఆ పోరాటాలే కారణం. కాషాయనేతలకు ప్రజాస్వామ్యం ఉండనక్కర్లేదు. భారత్ను లౌకికదేశంగా గాకుండా మతతత్వదేశంగా మార్చాలన్నది బీజేపీ పన్నాగం. అందులో భాగమే విద్యారంగంలో జరుగుతున్న వరుస దాడులు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు కోసం ఏండ్ల తరబడి ఆందోళనలు జరుగుతున్న క్రమంలో వస్త్రధారణ విషయంలో కేరళ నాదర్(దళిత) మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాన్ని కాలగర్భంలో కలుపుతామంటే ఎలా? మోడీ ఈ ప్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తున్నట్టు? 1859లో అప్పటి బ్రిటిషు ప్రభుత్వం ఆ మహిళల కోసం ఉత్తర్వులిస్తే వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరం విద్యార్థులకు లేదా? మహిళల్లో సామాజికతత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేసిన బంకించంద్ర, చందుమీనన్ వంటి వారి నవలలు లేకుండా చేయడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటీ? దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గిట్టుబాటు ధరల కోసం, సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. రైతులను లొంగదీసుకుందుకు సమ్మాన్ నిధి కింద ఎంతోకొంత ముట్టచెబుతున్న పాలకులు, గతంలో ఇంగ్లాండ్లో సాగుదారులు, అమెరికాలోని గోధుమ రైతులు, బెంగాల్లోని నల్లమందు సేద్యం రైతులు సాగించిన పోరాటాలను పాఠ్యాంశాల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చరిత్ర నుంచి రైతుల పోరాటాన్ని చెరిపేసి వారి ఉద్యమాలను విద్యార్థులు తెలుసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేసే ప్రమాదాన్ని ప్రజలు గుర్తించాలి. మతతత్వాన్ని పెంచి పోషిస్తున్న పాలకులపట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్య లౌకికశక్తులు స్పందించాలి.