Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజేని ఈక్వడార్ ప్రభుత్వం కుట్రపూరితంగా బ్రిటిష్ పోలీసులకు అప్పగించిన తరువాత అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్ఎఫ్) ఆ దేశానికి ఒక బిలియన్ డాలర్ల అప్పు ఇస్తున్నట్టు ప్రకటించింది. బ్రిటిష్, ఈక్వెడార్, అమెరికా ప్రభుత్వాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించి జూలియన్ అసాంజేని అమెరికాకు తరలించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం అసాంజేని బ్రిటన్ నుంచి తరలించటానికి సంబంధించిన ప్రక్రియ సమర్పించింది. అయితే అంతర్జాతీయ న్యాయసూత్రాలను అనుసరించి చేసే తరలింపు (ఎక్ట్సాడిషన్)కు, న్యాయ ప్రక్రియతో ప్రమేయం లేకుండా వ్యక్తులను రాజ్యమే అపహరించి చర్యకు దిగటం అనే ఈ రెండింటి మధ్య విభజన చెరిగిపోయింది.
'వార్ ఆన్ టెర్రర్' కాలంలో అనుసరించిన అసాధారణ పద్ధతి అసాంజే విషయంలో కూడా అనుసరించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. 2001నుంచి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ప్రపంచవ్యాప్తంగా అనేక వందలమందిని అపహరించి, వారిని వివిధ దేశాలలో తన నిర్బంధ శిబిరాలలో ఉంచి క్రూరంగా హింసిస్తోంది. అసాంజేని ఒక్కసారి అమెరికాకు స్వాధీనం చేయటమంటూ జరిగితే తిరిగి ఆయన ప్రపంచానికి కనపడటం ప్రశ్నార్థకమే. ఇలా జరగటానికి ముందు మానవ హక్కుల ప్రశ్న తలెత్తకుండా అసాంజే ఒక రాక్షసుడని మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్నది. ఈ మీడియా నివేదికలు పట్టించుకోని విషయం ఏమంటే లక్షలాదిమంది పౌరులు, వేలాది మంది అమెరికా సైనికులు మరణించిన యుద్ధాలలో సామ్రాజ్యవాదం చేసిన నేరాలను, ఘోరాలను ఆయన ఎండగట్టాడు. ప్రభుత్వం, కార్పొరేట్ మీడియా రాజ్య రహస్యంగా మార్చిన హేయమైన నేరాలను ఆయన ప్రపంచం కండ్లకు కట్టాడు. అసాంజేని అమెరికా తరలించటం అమెరికా, బ్రిటిష్, ఈక్వెడార్ ప్రభుత్వాలు సమర్థించుకుంటున్నాయి. ఒక పాస్వర్డ్ను అధిగమించి సమాచారాన్ని సేకరించేందుకు చెల్సియా మాన్నింగ్కు సహకరించాడన్నదే అస్సాంజేపై అమెరికా మోపుతున్న అభియోగం. అయితే ఆయన అరెస్టు తరువాత కార్పొరేట్ మీడియా, రాజకీయ నాయకుల ప్రకటనలు అసలు విషయాన్ని పక్కనబెట్టి జరగబోయే కుట్రను సూచిస్తున్నాయి. పశ్చిమ దేశాలలోని ప్రజాస్వామ్యాన్ని రష్యా గూఢచార వర్గాలు నాశనం చేసే ప్రయత్నంలో అసాంజే భాగస్వామి అయ్యాడనే అభియోగాన్ని అదనంగా మోపే అవకాశం ఉన్నట్టు వాషింగ్టన్ పోస్టు తన సంపాదకీయంలో రాసింది. అలాగే హిల్లరీ క్లింటన్ ప్రచారాన్ని నిర్వీర్యం చేయటంలో రష్యా పోషించిన పాత్ర గురించి తెలుసుకునేందుకు ఆయన ఊపయోగపడే వనరు అవుతాడని న్యూయార్క్ టైమ్స్ రాసింది. రహస్య పత్రాలను పదేపదే విడుదల చేస్తూ అసాంజే అమెరికా, దాని మిత్రదేశాల జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశాడని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీకి చైర్మన్గా వున్న డెమోక్రట్ ఎలియట్ ఏంజల్ ట్వీట్ చేశాడు.
అసాంజేని తప్పుడు ఆరోపణలతో అమెరికాకు తరలించే ప్రయత్నం జరుగుతోందని ఈ ప్రకటనలను బట్టి మనకు అర్థమౌతోంది. ఆయనపై ప్రభుత్వం చేస్తున్న ఒకే ఒక ఆరోపణ ముసుగు మాత్రమే. అమెరికా యుద్ధ నేరాలను బహిర్గతం చేసినందుకు ఆయనను తీవ్రంగా శిక్షించే ఆలోచన అమెరికాకు ఉంది. డెమోక్రటిక్ సెనేటర్ జో మంచిన్ ఇలా చెప్పాడు: 'అసాంజే మా ఆస్తి. ఆయన నుంచి అన్ని వాస్తవాలను, నిజాలను రాబడతాం.' అయితే అసాంజే తనపై తానే సాక్ష్యం ఇచ్చుకోవలసిన అవసరం ఉండదు. అమెరికా రాజ్యాంగంలోని 5వ సవరణ అందుకు రక్షణగా ఉంది. కానీ మీడియా, రాజకీయ నాయకుల ప్రకటనలతో ఇక్కడో ప్రశ్న తలెత్తుతుంది. ఆయన నుంచి 'వాస్తవాలను రాబట్టటానికి' ప్రభుత్వం ఏమి చేయబోతోంది? అబు ఘరైబ్, బాగ్రాం వాయుసేన స్థావరంలో జరిపినట్టుగా నిషేధిత థర్డ్ డిగ్రీ పద్ధతులను ఉపయోగించాలని అనుకుంటున్నారా? అనేది తేలవలసివుంది.
అమెరికాలో అసాంజేపై జరగనున్న విచారణ న్యాయబద్ధంగా ఉండే అవకాశంలేదు. ఇప్పటికే రాజకీయ, మీడియా వర్గాలు ఆయన నేరం చేశాడని ప్రచారం చేస్తున్నాయి. 'రహస్య పత్రాలు', 'జాతీయ భద్రత'ల పేరుతో ఆయన లాయర్లకు సాక్ష్యాలను సమీక్షించే అవకాశాన్ని అమెరికా ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు. ప్రజల ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించే యంత్రాంగమే లేనప్పుడు అసాంజేకి న్యాయం ఎలా జరుగుతుంది? వ్యక్తులను అపహరించి విచారణ జరపటాన్ని మానవాళికి వ్యతిరేకంగా చేసే నేరమని అంతర్జాతీయ న్యాయానికి ఆధారమైన న్యూరెంబర్గ్ సూత్రాలు చెబుతున్నాయి. వ్యక్తులను నిరంకుశంగా నిర్బంధించటం చట్టవిరుద్ధమని ఫ్రాన్స్, అమెరికాలలో జరిగిన బూర్జువా విప్లవాలు చట్టాలు చేశాయి. అయినా వీటిని పాలక వర్గాలు పట్టించుకోవటం మానేసి చాలాకాలమైంది.
ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అసాంజే మార్గాంతరం లేక ఆశ్రయం పొందిన తరువాత గడిచిన ఈ ఏడేండ్లలో అంతర్జాతీయ స్థాయిలో వర్గ పోరాటాలు తీవ్రమయ్యాయి. ఈ శకం అందించిన అంతర్జాతీయ విప్లవకారులు అసాంజే, ఎడ్వర్డ్ స్నోడెన్, చెల్సియా మాన్నింగ్ల విముక్తి సమస్యను ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం సాగే పోరాటాలలో భాగం చేయాలి.