Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గెలవాలి. ఎలాగైనా గెలవాలి. ఏం చేసైనా గెలవాలి. ఎంతకు దిగజారైనా, మానవ విలువలను ఎంతకు దిగజార్చయినా గెలవాలి. గెలుపొక్కటే నిజం. మిగిలినదంతా నాటకం... అని కమలనాధులు డిసైడైపోయారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ప్రగ్యాసింగ్ రంగప్రవేశం. భోపాల్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రముఖుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరుసింగ్ పైన బీజేపీ తరపున హిందూ సన్యాసిని సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పోటీకి దిగారు. కుటుంబంతో కూడిన సాధారణ సామాజిక జీవితం తుచ్ఛమని భావించి ఆధ్యాత్మికబాట పట్టినట్టు చెప్పుకునే సాధు, సన్యాసినులకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించే రోజులు పోయి చాలా రోజులయింది. అయితే, సాధ్వి ప్రగ్యాసింగ్ నేపథ్యం పరికిస్తే మాత్రం ప్రశ్నించకుండా ఉండలేం. ఆమె మహారాష్ట్రలోని మాలెగాం బాంబు పేలుళ్ల కేసులో పది సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించారు. 2008సెప్టెంబర్ 29న మాలెగాంలో మోటారు సైకిల్కు కట్టిన బాంబు పేలి ఆరుగురు చనిపోగా, 101మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు అమర్చిన మోటారు సైకిల్ ప్రగ్యాసింగ్దిగా నిరూపణ అయ్యింది. దీంతో ఆమె పది సంవత్సరాల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె బెయిల్పైనే బయట ఉన్నారు. మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో జన్మించిన ప్రగ్యాసింగ్ పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. విద్యార్థి దశలో ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ, అనంతరం విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం దుర్గావాహినిలో చురుగ్గా పనిచేశారు. చదువు ముగిసిన అనంతరం సన్యాసినిగా మారిన ప్రగ్యాసింగ్ పూర్తికాలం హిందూ ధర్మ రక్షణకు అంకితమయ్యారు. తనను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన మూడు గంటల ముందు వరకూ ఆమె బీజేపీ సభ్యురాలు కాదు. భోపాల్లో ఎలాగైనా దిగ్విజరుసింగ్ను ఓడించాలని భావించిన సంఫ్ు పరివార్ పెద్దలు అందుకు సాధనంగా సాధ్విని ఎన్నుకుని అప్పటికప్పుడు బీజేపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంలాల్ను భోపాల్ పంపి ప్రగ్యాసింగ్కు బీజేపీ సభ్యత్వం ఇప్పించారు. అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే క్షణమైనా ఆలస్యం చేయకుండా తనను మాలేగాం పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన పోలీసు అధికారి కర్కరే 'నా శాపం వల్లే మరణించాడు' అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల కారణంగానే ప్రగ్యాసింగ్ అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తున్నది. ఆమె అపజయాన్నీ కాంక్షించాల్సి వస్తున్నది.
మాలెగాం, అజ్మీర్, మక్కా మసీదు (హైదరాబాద్) బాంబు పేలుళ్లు హిందూ తీవ్రవాదుల చర్యలుగా దర్యాప్తులో తేలిన అనంతరం ''కాషాయ టెర్రర్'' అని ప్రకటించి కమలదళాన్ని ఇరకాటంలో పెట్టిన దిగ్విజరుసింగ్ను ఓడించాలని సంఫ్ుపరివార్ పంతం పట్టింది వాస్తవమే అయినప్పటికీ, భోపాల్లో ఆయనపై ప్రగ్యాసింగ్ను పోటీకి దించేందుకు ఈ పధకం ఒక్కటే కారణం కాదు. ప్రగ్యాసింగ్ సన్యాసిత్వాన్ని, హిందూ ఉగ్రవాదిగా ఆమె పది సంవత్సరాలు జైలు జీవితం గడపడాన్ని, అంతకు మించి ఆమె ఠాకూర్ కులాన్ని ప్రయోగించి మధ్యప్రదేశ్ మొత్తం ఓటర్లమీద ప్రభావం పడేయాలన్న ఎత్తుగడ కూడా దాగుంది. హిందూ-ముస్లిం సామరస్యానికి చిహ్నంగా భాసిల్లిన భోపాల్లో 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అక్కడ బలం పుంజుకుని భోపాల్ లోక్సభ స్థానంలో వరుస విజయాలు సాధించింది. అదే పన్నాగంతో ఈ ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ విజయానికి ఢోకా ఉండకూడదు. అయితే, 2018 డిసెంబర్లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం పొందడం, కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి దిగ్విజరుసింగ్ బరిలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. కాబట్టి, మాజీ ముఖ్యమంత్రులు ఉమాభారతి, శివరాజ్ సింగ్, చౌహాన్లు ఈ స్థానం నుంచి పోటీచేసేందుకు విముఖత చూపారు. దీంతో హార్డ్కోర్ హిందూ సన్యాసినిని రంగంలోకి దించారు.
వచ్చీ రావడంతోనే ఈ కాషాయాంబరధారిణి శత్రువులను చంపగలిగిన మంత్రశక్తి తనకున్నదన్న వాగ్బాణాన్ని సంధించారు. ఓట్లు వేయకుండా తన అపజయానికి కారణమైన వారు తనకు శత్రువులు ఎలా కాకుండా పోతారు? అలాంటి శత్రువులు తన శాపంతో చావకుండా ఎలా ఉంటారు? అందుకని ప్రాణాలు కాపాడుకునేందుకు బుద్ధిగా తనకు ఓట్లు వేయండి అని ఆమె తనదైన హిందూత్వ ధోరణిలో అభ్యర్థిస్తున్నారు. హేతువాదులకు, నాస్తికులకు ప్రగ్యాసింగ్ బెదిరింపులు పెద్ద జోక్గా కనిపించవచ్చు గానీ, హిందూమత విశ్వాసాలను పాటించే కోట్లాది సాధారణ ప్రజలపై అవి అసాధారణ ప్రభావమే చూపుతాయి. ఇలాంటి వారు ఎన్నికలలో నెగ్గి చట్ట సభలకు చేరితే రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రం కొలువుదీరడం తథ్యం. ఇలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకుని ఎన్నికల బరినుంచి బహిష్కరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఆ పని ఎన్నికల సంఘం ఎలాగూ చేయదు కాబట్టీ ప్రజలే ఆ బాధ్యత తీసుకుని ప్రగ్యా సింగ్ ఠాకూర్ లాంటి వారిని ఓడించాల్సిన అవసరం ఉంది.