Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఐదేండ్ల పాలనాకాలం మున్నెన్నడూ కనీవినీ ఎరుగని విపరీతాలను కండ్లముందుంచుతున్నది! సాక్షాత్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరుపై లైంగిక వేధింపుల ఆరోపణలు తాజా విపరీతం!? భారత ప్రధాన న్యాయమూర్తిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉన్నది. చీఫ్ జస్టిస్ కూడా ఇందుకు సిద్ధమై వెంటనే ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి తక్షణ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో దోషిగా తేలితే ఆయన ముమ్మాటికీ శిక్షార్హుడేననడంలో సందేహం లేదు. కానీ, ఇవన్నీ నిరాధారమని తేలితే ఆయన చెపుతున్నట్టు ఈ దేశంలో న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు, తనను అస్థిరపరి చేందుకు పెద్ద కుట్రే జరుగు తున్నదని భావించాల్సి ఉంటుంది.
''ఈ దేశంలో రెండు పెద్ద వ్యవస్థలు (పదవులు) ఉన్నాయి. ఒకటి ప్రధానమంత్రి కార్యాలయం, రెండవది ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం. ఈ కుట్ర వెనుకున్నవారి ఉద్దేశం రెండవదానిని నిర్వీర్యం చేయటమే. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతకు పెనుముప్పు'' అంటున్నారు చీఫ్ జస్టిస్. తన సుదీర్ఘమైన సర్వీసులో ఆయన ప్రదర్శించిన నిజాయితీ, నిబద్ధత పాటించిన ప్రమాణాల రీత్యా ఆయన వ్యాఖ్యలను అంత తేలిగ్గా కాదనలేం. అలాగే ఈ వివాదం ఏర్పడిన సందర్భాన్నీ, ఆయన వ్యాఖ్యల వెనుక నేపథ్యాన్నీ విస్మరించలేం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సాగుతున్న సమయంలో, అతి కీలకమైన కేసులు విచారణకు రానున్న తరుణంలో ఈ వివాదం చోటు చేసుకోవటం గమనార్హం!
ఈ నేపథ్యాన్ని ఇంకొంచెం వెనక్కెళ్లి వీక్షిస్తే... న్యాయ వ్యవస్థకూ ప్రభుత్వానికీ మధ్య ఘర్షణలను, న్యాయవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలనూ సూచించే సంఘటనలనేకం కనిపిస్తాయి. న్యాయ నియామకాలలో ప్రభుత్వ జోక్యాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోవటం నుంచి తమ స్వతంత్రను, స్వయం ప్రతిపత్తినీ మరిచి ఏలినవారి కనుసన్నలలో మెదులుతున్న రాజ్యాంగ సంస్థలకు చురకలంటించడం వరకూ ఈ ఘర్షణ కనిపిస్తూనే ఉంటుంది. ఇందులో ముందుగా గుర్తొచ్చేది రెండేండ్ల క్రితం ఆనాటి చీఫ్ జస్టిస్కు వ్యతిరేకంగా నలుగురు న్యాయమూర్తులు పత్రికలకెక్కడం. (ఆ నలుగురిలో నేటి చీఫ్ జస్టిస్, ప్రస్తుతం ఆరోపణలెదుర్కొంటున్న రంజన్గొగోరు కూడా ఒకరు) ఇది సహజంగానే ప్రభుత్వానికి రుచించక పోవచ్చు. ఎందుకంటే అది దాని సమర్థతను సవాలు చేసే చర్య. ఇంతకీ ఆ నలుగురు న్యాయమూర్తుల ఆక్షేపణ ఏమిటీ? నాటి ప్రధాన న్యాయమూర్తి కేసుల విచారణను అప్పగించటంలో నిస్పక్షపాతంగా వ్యవహరించడం లేదనీ, సున్నితమైన, కీలకమైన రాజకీయాంశాలతో కూడిన కేసులలో పక్షపాతం చూపుతున్నారని. ఈ ఆక్షేపణలు అబద్ధమో, అసమంజసమో అయితే ప్రభుత్వం వారిని అభిశంసించవచ్చు. పార్లమెంటుకు ఆ అధికారం ఉంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదంటేనే ఆ ఆక్షేపణలు ఎంత సహేతుకమో, సమంజసమో అర్థమవుతున్నది. రామమందిర నిర్మాణంలో కూడా ప్రభుత్వం ఎన్నికలకు ముందే తీర్పు కోరింది. బహుశా ఆ తీర్పును అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లబ్దిపొందే చర్యలకు పూనుకోవాలన్న ఆలోచనలేమైనా ఉన్నాయేమో! కానీ కోర్టు ఆ అవకాశం ఇవ్వకుండా అందుకు భిన్నంగా స్పందించింది. ఇక రాజ్యాంగ వ్యవస్థలలో ప్రభుత్వ జోక్యాన్ని ప్రశ్నించటం మొదలు ఇటీవల ప్రభుత్వానికి ఉపాంగంగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘాన్ని కూడా మీ స్వతంత్రతను మరిచిపోయారా? అని సుప్రీంకోర్టు హెచ్చరించడం వరకూ మన గమనంలో లేని విషయాలేమీ కావు. ఇలా నిర్దిష్టంగా పరిశీలిస్తే అనేక విషయాలలో అడుగడుగునా ఈ ఘర్షణ కనిపిస్తుండటం విశేషం.
అదే సందర్భంలో రాబోయే వారం రోజుల్లో కొన్ని ముఖ్య కేసులు విచారణకు రానుండటం మరో విశేషం. వాటిలో శారదా చిట్ఫండ్ కుంభకోణం (ప్రధాన నిందితులంతా బీజేపీలో చేరిపోయారు), జాతీయ పౌర జాబితా చట్టం (బీజేపీ పార్లమెంటును బుల్డోజ్ చేసి మరీ తెచ్చిన ఈ చట్టం పట్ల ఈశాన్య భారతంలో ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.) రాఫెల్, ప్రధాని మోడీ బయోపిక్, తమిళనాడు ఎన్నికల్లో భారీ ధన ప్రవాహం వంటి కేసులతో పాటు మరికొన్ని రాజకీయంగా అత్యంత కీలక కేసులపై విచారణ మొదలు కానున్నట్టు తెలుస్తున్నది. ఈ కారణంగానే ఇప్పుడు తనపై ఈ ఆరోపణలు వచ్చినట్టు రంజన్ గొగోరు ఆక్షేపిస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం నేపథ్యాన్నీ, రంజన్ గొగోరు వ్యక్తిత్వాన్నీ చూసినప్పుడు.. దీని వెనుక పెద్ద కుట్ర, పెద్ద శక్తే ఉందన్న ఆయన అనుమానం సత్యదూరమేమీ కాదనిపిస్తోంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై మహాకుట్ర జరుగుతోందనీ, ఈ కుట్రలో తనను కూడా భాగస్వామిని చేసేందుకు పెద్ద మొత్తమే ఇవ్వజూపారనీ చెబుతున్న సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ తాజా ప్రకటన ఈ అనుమానాలను బలపరుస్తోంది. వీటన్నిటికీ మించి తనకు అనుకూలంగా వ్యవహరించని ఇతర రాజ్యాంగ వ్యవస్థల పట్లా, వాటికి నాయకత్వం వహిస్తున్న ఉన్నతాధికారుల పట్లా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వీటికి మరింత ఊతమిస్తోంది!
విచారణ పూర్తయితేకానీ ఈ వివాదంలో నిజానిజాలేమిటన్నది స్పష్టం కాదు. అయితే నిజానిజాలేమైనప్పటికీ వాటి ఆధారంగా ఈ బ్లాక్మెయిలింగ్కు పాల్పడే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేం. అదే గనుక జరిగితే అది ముమ్మాటికీ మన సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రయత్నమే..! వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనాక మిగిలేది ఇక వ్యక్తిస్వామ్యమే..!! అది ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత ప్రమాదం.