Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడితప్పిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ పేరుతో ఐదు నెలలుగా సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. చివరకు విద్యార్థుల బంగారు భవిష్యత్తునూ ప్రశ్నార్థకం చేసింది. మరోవైపు వర్షాలు, వడగండ్లతో రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున పంటలు నష్టపోయి దిగాలుపడిన రైతులకు ఓదార్పు కరువైంది. ఇంకా అనేక సమస్యలు రాష్ట్ర ప్రజలపై ముప్పేట దాడి చేస్తున్నా ప్రభుత్వం మిన్నకుండి మొద్దునిద్ర నటిస్తున్నది. ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మార్చింది. చివరికి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగాల్సి వచ్చింది. 'ఈ సమస్య ప్రభుత్వానికి పట్టదా.. మీడియాకే పడుతుందా..మంత్రి రాడా..పిల్లల భవిష్యత్కు గ్యారంటీ ఎవరు ?' అంటూ నిలదీసింది ఓ తల్లి.. 'టెన్త్లో 9.5 మార్కులు వచ్చి, ఇంటర్ ఫస్టియర్లో 470కి 460 మార్కులు సాధించి, సెకండీయర్లో 306 మార్కులు ఎలా వస్తాయని' ఓ తండ్రి ఆవేదన. సాఫ్ట్వేర్ లోపాలు, ఇంటర్బోర్డు చేతగానితనం మూలంగా ఉన్నత చదువులకు వెళ్లి తమ పథాన్ని ఎంచుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు సర్కార్ అక్షరాలా మోకాలడ్డింది.
పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ తరువాత బబ్లింగ్ పద్ధతిలో మార్కులను రికార్డుల్లోకి ఎక్కించడం ఆనవాయితీ. అయితే ఇక్కడే ఇంటర్బోర్డు పప్పులో కాలేసింది. బబ్లింగ్ కోసం ప్రయివేటు సంస్థ గ్లోబరినా చేసిన సాఫ్ట్వేర్ తప్పిదాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులూ ఆందోళనకు దిగారు. సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమకారులను అణచివేయడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్కారు, మొండిగా వ్యవహరిస్తున్నది. తాత్కాలిక ఉపశమన చర్యలతో సాగదీస్తున్నది. ప్రజావ్యతిరేకత ఉప్పెనలా లేచింది. గత రెండు రోజులుగా బోర్డు ముందు కొనసాగుతున్న వందలాది మంది విద్యార్థులు, ప్రజాప్రతినిధుల ఆందోళనలే ఇందుకు సాక్ష్యం. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కిమ్మనడం లేదు.
ఇకపోతే అకాలవర్షాలతో వడగండ్లు రైతులకు నష్టం తెచ్చాయి. ఫిబ్రవరి నుంచీ వేలాది ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. సాధారణంగా సాగైన వరితోపాటు పసుపు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని రైతులకు కన్నీళ్లు, కడగండ్లే మిగిలాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీస్థాయిలో పిడుగులుపడి తీవ్ర నష్టం జరిగింది. అనేక మంది చనిపోయారు. కోతకు వచ్చిన పంటలు, కోసి నూర్పిళ్లు చేసిన రాశులు, మార్కెట్కు తరలించిన ధాన్యం, మొక్కజొన్న, మిరప, పత్తి, మామిడి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, జనగామ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లో రైతులకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి చెప్పారు. నాలుగేండ్లుగా 300 మండలాల్లో కరువుతో రైతులు అల్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో సమన్వయం చేసుకోలేకపోయాయి. జరిగిన నష్టాన్ని సైతం కేంద్రానికి పంపకపోవడం మూలాన రాష్ట్రంలోని రైతులకు అన్యాయం జరుగుతున్నది. 2015-16లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.791 కోట్లు వచ్చింది. ఆర్మూర్ ఏరియాలో రూ. 3000 కోట్లు నష్టం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులచేత దాడులు చేయించి, కేసులు బనాయించారు. రైతులకు బేడీలు వేస్తున్నారు. ఇంత నష్టం వాటిల్లినా రైతులను పరామర్శించి, గణాంకాల ఆధారంగా పరిహారం ఇవ్వాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కారులో కనిపించడం లేదు. ఏ రైతు కూడా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట, ఆచరణలో అడుగు కూడా ముందుకుపడలేదు. ఈ నేపథ్యంలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలను రంగంలోకి దించి నష్టాల సమాచారం సేకరించి వారికి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 14వ ఆర్థిక సంఘం ప్రకటించిన ప్రకృతి వైపరీత్యాల పరిహారానికితోడు రూ. 15 వేలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 6 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతున్నాయి. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారాన్ని గాలికొదిలి, ప్రజస్వామ్యాన్నీ ఖూనీ చేస్తూ, రాజ్యాంగం అపహాస్యమయ్యేలా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే పనిలో క్షణం తీరికలేకుండా ఉండటం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ముందు సీఎం స్పందించి రెవెన్యూ శాఖ ప్రక్షాళన గురించి హడావుడి చేశారు. ఇప్పుడు 9.5లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఇంటర్ ఫలితాలపై సీఎం హోదాలో కనీసం స్పందించకపోవడం పట్ల యావత్తు తెలంగాణ సమాజం నివ్వెరపోతున్నది.