Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరాన్ చమురు దిగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలకు ఇచ్చిన మినహాయింపులను పునరుద్ధరించబోమని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. దానితో చమురు మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఇరాన్ చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న చైనా, ఇండియా వంటి దేశాలకు ఈ ఏకపక్ష చర్య మింగుడుపడటం లేదు. ఇరాన్ చమురు ఎగుమతులను సున్నా స్థాయికి కుదించి ఆ దేశానికిగల ప్రధాన ఆర్థిక వనరుని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో అమెరికా ఈ ఆంక్షల్ని విధించింది.
ఇరాన్ చమురు దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలపై చైనా, ఇండియా, గ్రీస్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, టర్కీలకు అమెరికా ఇచ్చిన మినహాయింపు మే 2వ తేదీతో ముగిసింది. ఇరాన్ చమురు దిగుమతులపై విధించిన ఆంక్షలకు ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించుకోవటంతో ఏర్పడే సరఫరా సమస్యలను అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్వంటి ప్రధాన చమురు ఉత్పత్తిదారుల ఉత్పత్తులతో పరిష్కరించవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 3.5శాతం పెరిగింది. గత నవంబరు తరువాత ఇదే అత్యధిక ధర.
మధ్యప్రాచ్యంలో ఇరాన్ బలపడితే ఇజ్రాయిల్కు ప్రమాదమని భావిస్తున అమెరికా ఇరాన్ను బలహీనపర్చాలనే ధ్యేయంగా వ్యూహరచన చేస్తోంది. అందుకోసం అమెరికా ఎంచుకున్న వ్యూహం ఆంక్షలను విధించటం. అలా ఆంక్షలను విధించి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసింది. 2012-2015 మధ్యకాలంలో ఇరాన్ చమురు ఎగుమతులు 50శాతానికి పడిపోయాయి. విదేశాలలో ఇరాన్కు గల 120బిలియన్ డాలర్ల ఆస్తులను కూడా ఉపయోగించుకునే వీలులేకుండా చేశారు. 2015లో బహుళపక్ష అణ్వస్త్ర ఒప్పందం జరిగింది. దీనినే జేసీపీఓఏ(జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్)అని అంటారు. ఈ ఒప్పందం పర్యవసానంగా ఆంక్షల కోసం ఒబామా పాలనలో విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను రద్దు చేశారు. వీటితోపాటుగా ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్లు విధించిన ఆంక్షల్నీ కూడా తొలగించారు.
ఐక్యరాజ్య సమితి భదత్రా మండలి చేసిన 2231నంబరుగల నాన్ బైండింగ్ తీర్మానం ప్రకారం అణ్వస్ట్రాలను మోసుకుపోగల క్షిపణులను తయారుచేయకూడదు. అలాగే ఇరాన్ ఆయుధాలను దిగుమతి, ఎగుమతులను చేయకూడదు. అయితే క్షిపణుల అభివృద్ధిని కొనసాగించటం ద్వారా ఇరాన్ ఈ తీర్మానాన్ని ఎదిరించింది. జేసీపీఓఏ ఒప్పందం తరువాత పొందిన ఉపశమనంతో ఇరాన్ తన చమురు ఎగుమతులను ఆంక్షల ముందటి స్థాయికి పెంచగలిగింది. తద్వారా విదేశీ మారక ద్రవ్యనిధులు సమకూరాయి. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థతో ఇరాన్ పునఃఅనుసంధానం కాగలిగింది. ఆర్థికాభివృద్ధి 7శాతం సాధించటంతో విదేశీ పెట్టుబడులు కూడా వచ్చాయి.
అయితే ట్రంప్ అధ్యక్షుడైన తరువాత ఇరాన్ను లొంగదీసుకునేందుకు మరింత ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అమెరికా ఇక ఏ మాత్రం జేసీపీఓఏలో పాల్గొనబోదని, 2018నవంబరు నుంచి ఆంక్షలను తిరిగి విధించటం జరుగుతుందని మే నెల 8న ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమెరికా ఆంక్షల పరిధిని అధిగమించి జేసీపీఓఏతో వచ్చే లాభాలను ఇరాన్కు చేరేలా చేయటానికి యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు 2019జనవరిలో ఒక వాణిజ్య యంత్రాంగాన్ని (స్పెషల్ పర్పస్ వెహికిల్) సృష్టించాయి. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు పరిమాణాన్ని క్రమేణా తగ్గించుకోవాలనే షరతుతో 2018నవంబరు 5న ఎనిమిది దేశాలకు 180రోజులపాటు 'ప్రధానమైన తగ్గింపు మినహాయింపు(సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఎక్సెప్షన్-ఎస్ఆర్ఇ')ను ఇవ్వటానికి అమెరికా సమ్మతించింది. 2019 ఏప్రిల్ 22న సదరు ఎస్ఆర్ఇలను కొనసాగించటం సాధ్యపడదని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇరాన్పై బుధవారం నుంచి అమలులోకి వచ్చిన అమెరికా ఆంక్షలతో అంతకుముందు మినహాయింపు పొందిన భారతదేశం సంకటస్థితి ఎదుర్కొంటున్నది. భారత చమురు దిగుమతిలో ఇరాన్ చమురు వాటా 13శాతందాకా ఉంది. విదేశీ మారక ద్రవ్యంతో ఇరాన్ చమురును కొనకూడదనే ఆంక్షవల్ల అనివార్యంగా వస్తుమార్పిడి పద్ధతి అవలంబించవలసిన అవసరం ఏర్పడింది. అంటే భారతదేశం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న చమురు విలువకు సమానంగా ఇరాన్కు కావలసిన వస్తువులను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఇరాన్కు భారతదేశ ఆహారధాన్యాలు, ఔషధాలు, అనేక ఇతర సరుకులు అవసరమవుతాయి.
ఇరాన్పై ఆంక్షలను విధించటమే కాకుండా భారతదేశంసహా కొన్ని దేశాలకు ఇచ్చిన మినహాయింపును కూడా ఎత్తివేయటంతో అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం పరాకాష్టకు చేరింది. ఇంతకు ముందు ఇటువంటి ఆంక్షలనే అమెరికా వెనుజులాపై కూడా విధించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో తనకు నచ్చని దేశాలను కూడా సంక్షోభంలోకి నెట్టటం వల్ల ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న సంక్షోభం మరింతగా తీవ్రతరం కానుంది. అటువంటి స్థితిలో ఏర్పడే ప్రతికూల పర్యవసానాల పట్ల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండటం నేటి చారిత్రకావసరం.