Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంత దాచిపెట్టాలనుకున్నా గుండెకు తగిలిన గాయాన్ని అంత సునాయాసంగా మరచిపోగలమా? దాని పర్యవసానాలు అంత తీవ్రంగా ఉంటాయి. మోడీ ప్రభుత్వం సృష్టించిన పెద్ద నోట్ల రద్దు కూడా అంతకంటే పెద్ద గాయమే. మోడీ, బీజేపీ పరివార్ గుర్తు లేనట్టు నటించినా అది రాజేసిన గాయం ఇంకా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూనే ఉన్నది. ప్రస్తుత ఎన్నికల సమయంలో నోట్లరద్దు అంశాన్ని ప్రస్తావించకుండా మోడీ ఎన్ని మాయ మాటలు చెప్పినా దానివల్ల కలిగిన దుష్ఫ్రభావాలను కప్పిపెట్టడం సాధ్యం కాదు. నోట్లరద్దు వల్ల నిరుద్యోగం పెరగడమే కాదు. ఉన్న ఉద్యోగాలూ ఊడిపోయాయి. లక్షలాది మంది రోడ్లపాలయ్యారు. పారిశ్రామిక ప్రగతి మరింత సన్నగిల్లింది. నోట్లరద్దు యాభై లక్షల ఉద్యోగాలను ఊడబీకిందన్న అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యయనంతో అది సమాజానికి ఎన్నటికీ తేరుకోలేనంత అన్యాయం చేసిందన్న వాస్తవాన్ని తెలియచెబుతున్నది. మహిళల పరిస్థితి మరీ దారుణం. బీజేపీ ప్రభుత్వం సృష్టించిన మెరుపుదాడి ఇంతటితో ఆగదనీ, మరిన్ని భయానక పరిస్థితులకు దారితీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అంచనా. అంటే భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలను చూడాల్సి వస్తుందో!
అవినీతిని, నల్లధనాన్ని, నకిలీనోట్లను నిరోధించడంతో పాటు ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు 2016లో ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవరికో అనుకూలంగా ఉండేందుకు నోట్లరద్దు సరికాదని, ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని ఎంతోమంది మేధావులు, ఆర్థికవేత్తలు, వామపక్షాలు, ప్రజాతంత్రవాదులు చెప్పినా వారిని కాషాయ పెద్దలు దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. మోడీ ఆచరణలో ఏమి జరిగిందన్నది జగమెరిగిన సత్యమే. సమాజం ఎన్నటికీ తేరుకోలేనంత దెబ్బతగిలింది. 130 కోట్లమంది ప్రజలు నగదు లేక అల్లాడిపోయారు. ఎటీఎంల వద్ద బారులు తీరిన ప్రజల్లో ప్రాణాలు విడిచిన వృద్ధులను మరచిపోగలమా? వందమంది దాకా చనిపోయినా ఆర్ఎస్ఎస్, పరివార్శక్తులకు అవి మామూలే. ఇంతచేసినా నల్లడబ్బు వెనక్కి వచ్చిందా అంటే అదీ లేదు. నకిలీ నోట్లను ఏరిపారేయడం వంటి లక్ష్యాలు నెరవేరలేదు. నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు నోట్ల రద్దు నిర్ణయం చేశామన్న ప్రభుత్వం, అలాంటి వాస్తవ సమాచారం తమవద్ద లేదని పార్లమెంటులో ఆర్థికమంత్రి చెప్పడమంటేనే తాము తీసుకున్న నిర్ణయం ఎంత ఘోరమన్నది తెలుస్తూనే ఉన్నది. నల్లడబ్బు తెచ్చి ఒక్కొక్కరి ఎకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి అలా అనలేదని హౌం మంత్రి రాజ్నాథ్సింగ్ వ్యాఖ్యానించారంటే దేశప్రజలను ఎంతగా మోసపుచ్చారన్నది అర్థవుతున్నది.
ముఖ్యంగా నోట్లరద్దు చిన్నతరహా ఉత్పత్తి, వ్యవసాయ రంగాలను కోలుకోలేని దెబ్బతీసింది. ఆర్థిక, ఉత్పత్తి కార్యకలాపాలు మందగించాయి. రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు, ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోయారు. కాంట్రాక్టు కార్మికులు, దినసరి కూలీలు, వలస కార్మికులు నానా అవస్థలు పడ్డారు. నిరుద్యోగం ఒక్కసారిగా పెరిగింది. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019 నివేదిక ప్రకారం.. దేశంలో నిరుద్యోగ సమస్య 2015 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది జనవరిలోనే లీకైన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా భారత్లో నిరుద్యోగం రేటు 45 ఏండ్లలో 2017 -18లో అత్యధికంగా 6.1 శాతం రికార్డు అయినట్టు తెలిపింది. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టయినబుల్ ఎంప్లాయిమెంట్(ఏపీయూసీఎస్) జరిపిన సర్వే ప్రకారం 2016 నుంచి 2018 కాలంలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని కుండబద్దలు కొట్టింది. మహిళలు కోల్పోయిన ఉద్యోగాలను లెక్కిస్తే ఈ సంఖ్య అనేక రెట్లు అధికంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొనడం తీవ్రత తెలియజేస్తున్నది. పెద్దనోట్ల రద్దు, ఆగమేఘాలపై అమలు చేసిన జీఎస్టీ వల్ల 2018లో దాదాపు 1.10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సీఎంఐఈ జనవరి నివేదిక వెల్లడించింది. అంతేగాదు 20 మాసాలలో ఎన్నడూలేనంతగా గత ఫిబ్రవరిలో దేశంలో పారిశ్రామిక వద్ధి 0.1శాతంగా నమోదైంది. పరిశ్రమల వద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.1 శాతానికి పడిపోయింది. ఈ సర్వేలన్నీ ఇంతగా నెత్తీనోరూ బాదుకుంటున్నా, నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలపై ఏ మేరకు ఉందో తెలిపే సమాచారం తమ వద్ద లేదని కేంద్రం వెల్లడించడమే బాధ్యతారాహిత్యం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన మరిచిన మోడీ ప్రభుత్వం, తమ నిర్ణయాలతో లక్షలాది మందిని రోడ్లపాలు చేసింది వాస్తవం కాదా? రోజురోజుకు నోట్లరద్దు కష్టాలు బయటపడుతున్నా వాటిగురించి మాట్లాడేందుకు మోడీ సాహసించడం లేదంటే భయపడుతున్నారనే కదా అర్థం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను ప్రస్తావించకుండా ఈ ఎన్నికల్లో కాషాయ నేతలు జాతీయ భద్రతను ప్రధాన ప్రచారాంశంగా చేసుకున్నారంటేనే వాస్తవమేంటన్నది బోధపడుతుంది. ఇలాంటి విషయాలు తెలిస్తే తమ పాలనతీరుపై ప్రజలలో ఎక్కడ వ్యతిరేకత వస్తుదోనన్న భయంతోనే పాక్తో యుద్ధం, సైనిక విజయాలు..వంటి భావోద్వేగ అంశాల్ని ఎన్నికల ప్రచారంగా మలచుకున్నారన్నది నిజం. కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ ప్రజల జీవితాలతో ఆడుకోవడమే గాకుండా మతాల వారీగా విభజిస్తూ రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.