Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిందు గుర్తుందా? ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుపరచేందుకు తన ప్రాణాలను పణంగాపెట్టి పోరాడుతున్న మహిళ. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలూ ప్రవేశించవచ్చునంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎలాంటి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వబోమంటూ హిందూ దురహంకార శక్తులు వీరంగం వేస్తున్న స్థితిలో.. కేరళకే చెందిన మరో మహిళ కనకదుర్గ (44)తో కలిసి బిందు (42) అత్యంత సాహసంతో ఆలయ ప్రవేశం చేసి చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచీ ఆమె అనేక అవమానాలను, దూషణలను, దౌర్జన్యాలనూ ఎదుర్కొంటూ ఉన్నారు. ఆలయ ప్రవేశ వివాదం సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో పార్లమెంటు ఎన్నికల డ్యూటీలో ఉన్న బిందుపై మంగళవారం మరో దాడి జరిగింది. ఎన్నికల విధుల్లో భాగంగా రిజర్వ్ అధికారిగా పట్టంబి నియోజకవర్గానికి వెళ్లిన బిందుపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూకలు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగాయి. 'నువ్వు బతికి ఉండొద్దు... చావు పో' అంటూ మెరుపుదాడికి దిగాయి. అయినా, బిందు ఏమాత్రం బెదరలేదు. అదరలేదు. దాడి నుంచి బయట పడిన ఆమె మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, తనపై దాడి చేసిన వారిపై న్యాయపరంగా పోరాడుతాననీ స్పష్టం చేసి అణగారిన ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
ప్రస్తుతం కోజీకోడ్ జిల్లా పోక్కాడ్లో టీచర్గా పనిచేస్తున్న బిందు చిన్నప్పటినుంచీ సామాజిక చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. కేరళ యూనివర్శిటీలో న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన బిందు టీచర్గా స్థిరపడ్డారు. ఆమె భర్త హరిహరన్ కూడా రాజకీయ కార్యకర్త. భార్యా భర్తలు ఇరువురూ కలిసి సామాజిక న్యాయ పోరాటాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ హిందూత్వ వాదులు నానా యాగీ చేశారు. శబరిమలను దక్షిణాది రామజన్మభూమిగా మలచుకుని రాజకీయ లబ్ది పొందాలని తీవ్ర ప్రయత్నం చేశారు. బీజేపీ, దాని సోదర సంఘాల పన్నాగాలను చిత్తు చేయడంలో బిందు కీలకంగా వ్యవహరించారు. 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ఆలయ ప్రవేశం చేస్తే దేశానికే కీడు జరుగుతుందని ప్రచారం చేస్తూ మహిళల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవాలని హిందూత్వ వాదులు చేసిన తీవ్ర ప్రయత్నాలకు బిందు, కనకదుర్గల ఆలయ ప్రవేశంతో అడ్డుకట్ట పడింది. అందుకే బిందు అంటే వారికి అంత ద్వేషం. ఎలాగైనా బిందును అంతం చేసి తమ పంతం నెగ్గించుకోవాలని, భవిష్యత్లో తమ దారికి ఎవరూ అడ్డురాకుండా భయభ్రాంతులకు గురి చేయాలని హిందూత్వ శక్తులు కుయుక్తులు పన్నుతున్నారు. నిత్యం ఆమెను వెంటాడుతూ, సామాజిక మాథ్యమాలలో అవమాన పరుస్తూ మానసికంగా వేధిస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడీ దాడి.
బిందు గురించి మాట్లాడుకునేప్పుడు మనం సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నేడు భోపాల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అయిన ప్రగ్యాసింగ్ పచ్చి హిందూత్వ వాది. మాలేగావ్ ఉగ్రదాడికి సూత్రధారిగా పదేండ్ల పాటు జైలు జీవితం గడిపి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. 'తాను బాబ్రీ మసీదు విధ్వంసంలో స్వయంగా పాల్గొన్నానని' సగర్వంగా ప్రకటించారు. ప్రగ్యా చేసిన నేరపూరిత చర్యలకు సాక్షాత్తూ ప్రధాని మోడీ నుంచి పొగడ్తల వర్షం కురుస్తున్నదిప్పుడు. ఆమె పార్లమెంటులో అడుగుపెట్టేందుకు కాషాయ దళం చెమటోడ్చుతున్నది. అదే కాషాయ దళం రాజ్యాంగ హక్కుల పరిరక్షణకోసం పరితపిస్తున్న బిందును రాచిరంపాన పెడుతున్నది. అలాంటి కాషాయ దళం చేతికి మళ్లీ అధికారం చిక్కితే ఈ దేశం ఏం కాబోతున్నది?
బిందు విషయంలో '1) రాజ్యంగ హక్కులు 2) మత విశ్వాసాలు' అన్న రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ఏ మతాన్నైనా స్వీకరించి, ఏ దేవున్నయినా ప్రార్థించే హక్కు ఇచ్చింది. ఈ రాజ్యాంగ హక్కులను కాపాడడంలో భాగంగానే సుప్రీం కోర్టు అన్ని వయస్సుల మహిళలూ శబరిమల ఆలయ ప్రవేశం చేయవచ్చునని తీర్పు ఇచ్చింది. అయితే, తమ మత విశ్వాసాలు దెబ్బతింటున్నాయంటూ ఈ తీర్పును అంగీకరించబోమని కొందరు యాగీ చేస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పును, రాజ్యాంగాన్నీ ధిక్కరిస్తున్నారు. అయితే మొత్తం ప్రజలలో వీళ్లు అతి తక్కుమమంది. కానీ తాము మెజారిటీ ప్రజల గొంతుకలమని గొడవలు సృష్టించడం వీరి నైజం. అయినా, ప్రజల మధ్య విద్వేషాన్నీ, సమాజంలో వైషమ్యాన్నీ సృష్టించే వీరి ఆగడాలు సమాజం చైతన్యంతో ఎదుర్కొంటుంది. ఇందుకు బిందు, కనకదుర్గలే గొప్ప ఉదాహరణ. బిందులను బతికించుకుందాం. కనకదుర్గలను కాపాడుకుందాం. అప్పుడు మాత్రమే మన దేశంలో ఆధిపత్య శక్తులకు ముకుతాడు పడుతుంది. ప్రజాస్వామ్యం ప్రాణం నిలుస్తుంది. ప్రగతి రథం పరుగులు పెడుతుంది.