Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటర్ ఫలితాలు విద్యార్థులూ, తల్లిదండ్రుల్లో అలజడి రేపాయనడంలో సందేహం లేదు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న క్రమంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సంబంధిత కేసు విచారణ సందర్భంగా 'విద్యార్థులూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు. మీ శవాలను మోసేందుకు మీ తల్లిదండ్రులకు చేతులు రావు' అన్న వ్యాఖ్యలే పరిస్థితి చేయిదాటి పోయిందనడానికి సాక్ష్యం. ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బృందం మూడు రోజుల్లో కొండను తవ్వింది గానీ, ఎలుకను కూడా పట్టలేకపోయింది. ఇంటర్బోర్డు వద్ద నిత్యం రోజూ ధర్నాలూ ఆందోళనలూ ప్రభుత్వ నిర్వాకానికి నిదర్శనం. తల్లిదండ్రులు బిడ్డల బంగారు భవిష్యత్ కోసం లక్షలకు లక్షలు ధారపోసి కష్టాలు పడుతున్న తరుణంలో ఇంటర్బోర్డు, బబ్లింగ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న గ్లోబరీనా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన సమయం. అదే సందర్భంలో ఆ సంస్థపై కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత సర్కారుది. తాము కని, పెంచిన పసిమనసులు కండ్లముందే ప్రాణాలొదులుతున్న క్రమంలో వారి ఆవేదన, ఆక్రందన అర్థం చేసుకోదగింది. విద్యావ్యవస్థ మూలాలనూ శాసిస్తున్న ప్రయివేటు భూతం పీచమణచడంలో ప్రభుత్వాలు తరచూ తప్పులు చేస్తూనే ఉన్నాయి. రాజకీయ అవసరాలు, ఎన్నికల కోసం నిధుల సమీకరణ, ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం బాల, బాలికల బతుకులను బండలు చేస్తున్నాయి. విద్యార్థుల బలవన్మరణాలకు కారణం ఎవరో ఇప్పటిదాకా టీఆర్ఎస్ సర్కారు తేల్చలేకపోయింది. దీని వెనుక అసలు కథ వేరే ఉందన్నది నిర్వివాదాంశం. ప్రతిరోజూ ఒకరో, ఇద్దరో పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా, ఇంకా సర్కారు గుండె కరగలేదు. ఫలితాల విషయంలో త్రిసభ్య కమిటీ నివేదిక గోడమీద పిల్లిని తలపిస్తున్నది. చిన్న చిన్న తప్పులు జరిగాయని చెబుతూనే, పూర్తిస్థాయిలో గ్లోబరీనాను వెనకేసుకొచ్చింది. ఇదంతా ఒక భాగమైతే, మరో పార్శ్యం ఇంటర్ ఫలితాల బబ్లింగ్ కోసం బోర్డుతో గ్లోబరీనా చేసుకున్న ఒప్పందం వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. అసలు ఒప్పందమే కాలేదని ఒకసారి, అయిందని మరోసారీ కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రభుత్వం పితలాటకాన్ని నడిపిస్తున్నది. ఒప్పందం జరగకపోతే, బబ్లింగ్ పనులు ఎలా అప్పగించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అర్హతలు లేకున్నా గ్లోబరీనాకు బోర్డు బబ్లింగ్ కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక సర్కారులో రింగుతిప్పుతున్న ఓ పెద్దతలకాయ ఉన్నట్టు మీడియా కోడై కూస్తున్నది. త్రిసభ్య కమిటీ ఆ సంగతి పట్టించుకోకుండా రోజూ జనంలో నానుతున్న ముచ్చట్లనే నివేదిక రూపంలో సర్కారుకు అందించి నవ్వులపాలైంది. ఈ నివేదిక హైదరాబాద్లోని ఏ భవన్లో తయారైందోననే అనుమానాలూ ఉన్నాయి. ఏప్రిల్ 18న ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన ఘటనలు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేవు. మూల్యాంకనంలో జరిగిన లోపాలు, అవకతవకల మూలంగా నష్టం జరిగిన విద్యార్థులకు భరోసా కల్పించేవిధంగా గులాబీ సర్కారు స్పందించకపోవడంతో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఫెయిలైన విద్యార్థుల కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఉచితంగా చేస్తామంటూ గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం, అసలు వాస్తవాలను నిగ్గు తేల్చడానికి ఆసక్తి చూపకపోవడం విదార్థుల ప్రాణాల పట్ల వారి నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. 70 శాతం ఇంటర్ విద్యార్థులు ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. మూల్యాంకనం సైతం 70 శాతం మేర ప్రయివేటు అధ్యాపకులే చేస్తున్నారు. కోడింగ్, డీకోడింగ్లాంటి పనులు డిగ్రీ విద్యార్థులతో చేయిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ చేపట్టి, వసతులను మెరుగు పరిచి వారి సేవలను గరిష్టంగా ఉపయోగించుకోవడం ద్వారా ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో నాణ్యత పెంచుకోవచ్చు. నేడు విద్యావ్యవస్థ కకావికలమైంది. ఇప్పుడు ఇంటర్ విద్యగానీ, సెకండరీ విద్యగానీ ఒకే యాజమాన్యం కింద లేవు. వేరువేరు యాజమాన్యాల కింద ఉండటం మూలంగా ఇలాంటి సమస్యలే వస్తాయి. పాఠశాల విద్యను ఒకే గొడుగు కిందకు తెస్తామని సీఎం, జులై 26, 2014న ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో స్వయంగా ప్రకటించినా, ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. విద్యార్థులకు స్వేచ్ఛగా శాస్త్రీయ పద్ధతిలో విద్య అందించడమే నేడు ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఖైదీలు ఉండే జైళ్లల్లో సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని చెప్పుకుంటున్న సర్కార్, ప్రయివేటు కబంధ హస్తాల్లో చిక్కుకున్న విద్యావ్యవస్థను పెకిలించి శాస్త్రీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాల్సిన తరుణమిది.