Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప'' అంటాడు కారల్ మార్క్స్. ఆయన ఈ వ్యాక్యాల వెనుక నడిస్తే చాలు అణువణువునా చైతన్య జలపాతాలు నిలువెల్లా ఉత్తేజంలో నింపుతాయని నిరూపిస్తోంది కాలం. ఆ వెలుగులోనే చికాగోలో కార్మికవర్గం చిందించిన నెత్తురు నేడు ప్రపంచ కార్మిక దినోత్సవమై ప్రవహిస్తూనే ఉంది. పీడిత జాతి విముక్తి మార్గమై వర్థిల్లుతూనే ఉంది. నాడు అమెరికా నుంచి నేడు ఫ్రాన్స్ దాకా ఆ రుధిర ధార పోరాటమై పారాడుతూనే ఉంది. దోపిడి కోటలను బద్దలుకొడుతూ సమతా లోకానికి దారులు తీస్తూనే ఉంది.
నాడు 1848లో వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక స్ఫూర్తితో తూరుపు యూరపునంతా వెలిగిస్తున్న కార్మికవర్గ చైతన్యం తమ దేశ సరిహద్దులను కూడా తాకకూడదని భావించింది అమెరికా. కానీ ఆపగలిగిందా..? అమెరికా గర్భంలోనే పురుడు పోసుకుంది ఎర్రజెండా..! సగానికి పైగా ప్రపంచాన్ని సామ్యవాదానికి నడిపించింది. శ్రమ దోపిడీని నిరసిస్తూ, దోపిడీ లేని వ్యవస్థకు బాటలు వేస్తూ ముందుకు సాగుతోంది. భయపడ్డ సామ్రాజ్యవాదం అడ్డుకోవడానికి అనేక విధాల ప్రయత్నించింది. తన మాయాజాలంతో తాత్కాలికంగా ఒక మేరకు సోషలిస్టు వికాసాన్ని అడ్డుకో గలిగింది. కానీ 'మాయ' ఎప్పుడూ తాత్కాలికమే. నిజమే శాశ్వతం. అదే నేడు నిరూపించబడుతోంది. మాయ పొరలు తొలగుతుంటే వెలుగు తెరలు విచ్చుకుంటున్నాయి. ఈ ప్రపంచం ఆకలికి పెట్టుబడిదారి వ్యవస్థలో పరిష్కారం లేదని తేలిపోతోంది. ప్రపంచంలో సోషలిజం వెనుకపట్టు పట్టిన తరువాత రెండు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని భ్రమల్లో ఉంచగలిగింది పెట్టుబడి. కానీ దశాబ్దకాలంగా అది సంక్షోభంలోంచి భయటపడలేకపోవడమే కాదు, రోజు రోజుకూ పెరుగుతున్న దాని తీవ్రత తిరిగి కార్మికోద్యమాల ఉధృతికి ఆజ్యం పోస్తోంది.
ప్రపంచంలో ఇప్పటికే ఉత్పత్తి అయి చలామణిలో ఉన్న సంపద కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ జనాభా అంతా కాలు మీద కాలు వేసుకుని తిన్నా తరగని సంపద ఇప్పటికే ఉత్పత్తి అయి ఉన్నది. ఇంకా ఉత్పత్తి అవుతూనే ఉన్నది. ఇప్పటి ఈ సంపదను వాడుకోకుండానే అది ఏటా ఉత్పత్తి చేసే సంపదే ప్రపంచ జనాభాకు కడుపునిండా అన్నం పెడుతుంది. అయినా నేడు సగం ప్రపంచం ఆకలితో అలమటిస్తోంది..! పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? దీనికి భిన్నంగా చైనా సోషలిస్టు మార్గంలో పురోగమిస్తోంది. అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా నిలిచింది. ప్రపంచానికి ప్రత్యామ్నాయాన్ని చూపుతోంది. ''ఆక్స్ఫాం'' నివేదిక ప్రకారం ప్రపంచంలో 380 కోట్ల జనాభాకు సమానమైన సంపద కేవలం 26 మంది వద్ద ఉన్నది. మన దేశంలో కూడా 70కోట్ల ప్రజల సంపదకు సమానమైన సంపద కేవలం 9 మంది వద్దే పోగుబడింది. మొత్తంగా ప్రపంచ సంపదలో 77.4శాతం 10శాతం మంది వద్ద ఉంటే, ఒకశాతం మంది దగ్గర 51.53శాతం ఉన్నది. అసలు ఏ సంపదా లేని జనాభానే అసంఖ్యాకంగా మిగిల్చిందీ పెట్టుబడిదారీ విధానం. సంపద కేంద్రీకృతమయ్యే కొద్దీ ఆకలి విస్తృతమవుతున్న స్థితి అంతకంతకూ పెరుగుతోంది.
దశాబ్దకాలం క్రితం 2008లో ప్రారంభమైన ఈ ఆర్థిక సంక్షోభం తరువాత ధనికుల ఆదాయాలు, ప్రజల మధ్య అంతరాలు ఈ స్థాయిలో పెరగటం మునుపెన్నడూ చూడలేదు. మనదేశంలో కూడా శతసహాస్ర కోటీశ్వరుల సంఖ్య ఈ ఏడాదిలో 101 నుంచి 119కి పెరిగింది. ఇక పేదల సంఖ్య ఎప్పుడూ అసంఖ్యాకమే..! శతసహస్ర కోటీశ్వరుల ఆదాయం గత ఏడాదిలో 39శాతం పెరగగా, సగటు భారతీయుని ఆదాయం కేవలం మూడుశాతం మాత్రమే పెరిగింది. అంటే ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు.
ఈ అంతరాలు, అసమానతలు ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమై సామాజిక సంక్షోభానికీ దారితీస్తుందన్నది వర్తమానంలో కనిపిస్తున్న విషాదం! సమాజంలో అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగమే ఇందుకు నిదర్శనం. భారతదేశంలో నిరుద్యోగిత 45ఏండ్లలో మునెన్నడూ చూడని దశకు చేరుకుంది. ఈ నిరుద్యోగం, ఆకలి, అభద్రత, అసమానతలు ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభానికి, వైఫల్యానికి సూచికలు. అందుకే నేడు ప్రపంచమంతటా కార్మికోద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడి సామ్రాజ్యానికి పెద్దన్నలాంటి అమెరికాలోనే సామ్యవాద భావజాలం కొత్త తరంలో పుంజుకుంటోంది. ఫ్రాన్స్లో ప్రపంచం ఇప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో సుమారు ఐదునెలలుగా ప్రతిశని ఆదివారాలలో కార్మికవర్గం వేలాదిగా ఆందోళనలు నిర్వహిస్తోంది. వీరిపై మేడే రోజున జరిగిన దాడి చికాగో స్ఫూర్తికి కొనసాగింపును సూచిస్తోంది. భారత్లో కూడా జనవరిలో కార్మికవర్గం రెండుసార్లు సార్వత్రిక సమ్మెకు పూనుకున్నది. పెరుగుతున్న ఈ ప్రజాపోరాటాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అమెరికాలో ట్రంపు, ఇండియాలో మోడీ భావోద్వేగాల చుట్టూ రాజకీయాలు నడుపుతున్నారు. కానీ పెరుగుతున్న సంక్షోభం పెను విపత్తుగా మారుతుంటే కార్మికవర్గం కాళ్లు ముడుచుకుని కూర్చోదన్నది చారిత్రక సత్యం.. అదే ఈ మేడే సందేశమని ప్రపంచ కార్మికవర్గం ఎలుగెత్తి చాటింది.