Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెప్సికో కంపెనీపై గుజరాత్ రైతులు విజయం సాధించారు. కంపెనీ మెడలొంచి తమపై వేసిన కేసును ఉపసంహరించుకునేలా ఆలుగడ్డ రైతులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. వారికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతులు, వ్యవసాయకార్మికులు, ప్రజాస్వామ్యవాదులు, వామపక్షాలు, పలు రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి. సోషల్ మీడియా కూడా రైతుల పోరాటంలో పాలు పంచుకుంది. న్యాయపరంగా ఒత్తిడి పెంచడానికి దోహదం చేసింది. ఒకరకంగా నయా ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తున్న మోడీ సర్కార్కు ఇది చెంపపెట్టులాంటిది. దేశభక్తి పేరుతో జబ్బలు చరుస్తున్న సోకాల్డ్ జాతీయవాదులు, దేశభక్తులు ఈ పోరాటంతోనైనా కండ్లు తెరవాలి.
తాము రిజిస్టర్ చేసుకున్న ఆలుగడ్డలను పండిస్తున్నారని ఆరోపిస్తూ పెప్సికో గుజరాత్లో నలుగురు రైతులపై కేసులు పెట్టింది. ఎకరాకు రూ. కోటీ ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. గత ఏప్రిల్లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కంపెనీకి అనుకూలంగా రావడంతో ఒక్కసారిగా స్వచ్చంధ సంస్థలు, మేధావులు, రైతు సంఘాలు, పలు రాజకీయ పార్టీలు రైతులకు బాసటగా నిలిచాయి. పెప్సికో తయారు చేస్తున్న లేస్ చిప్స్ బహిష్కరించాలంటూ ఆందోళన చేశాయి. కంపెనీ యాజమాన్యం దిగిరాక తప్పలేదు. పెప్సికోకు మద్దతిచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజల డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. చివరకు రైతులపై పెట్టిన కేసును కంపెనీ యాజమాన్యం సోమవారం ఉపసంహరించుకున్నది. అయితే, కేసు వెనక్కు తీసుకున్నా తమను వేధిస్తూ దొంగలుగా చిత్రీకరించినందుకు క్షమాపణ చెప్పాలని రైతులు పట్టుబట్టారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఎంతవరకైనా రైతులు వెళతారనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వంతో చర్చలు జరిపి దీర్ఘకాలిక డిమాండ్లను సాధించుకుంటామని కంపెనీ యాజమాన్యం చెబుతుందంటే, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్నది స్పష్టం. వాస్తవానికి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే పెప్సీకో, మోన్సాంటో, డుపాంట్, బేయర్ లాంటి బడా కంపెనీల కోర్టు లిటిగేషన్లను సామాన్య రైతులు ఇంతకాలం ఎదుర్కొని నిలబడటమే వారికి లభించిన మొదటి విజయం. ఇది భవిష్యత్తులో తమపై ఎలాంటి దాడులు జరిగినా దేనికైనా సిద్ధమని చెప్పడమే! ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన రైతాంగ ఆందోళనలు వారికి మరింత స్ఫూర్తినిచ్చాయని చెప్పవచ్చు.
ఒక బహుళ జాతి సంస్థ ఇంతగా బరితెగించడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణం. అవి అమలు చేస్తున్న విధానాలు, చట్టాలే కారణం. 1947 ముందు వరకు ఈస్టిండియా కంపెనీ పేరుతో బ్రిటీషు వారు ఈ భూభాగాన్ని ఎలా దోచుకున్నది, వారికి ఏ రకంగా ఇక్కడున్న పాలకులు సహకరించారన్నదానికి చరిత్రే సాక్ష్యం. ఆ తర్వాత భారతదేశం ఏర్పడిన తర్వాత కూడా ప్రపంచీకరణ పేరుతో 1993లో ఆనాటి పాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదీ తెలిసిందే. ఈ విదేశీ సంస్థలు కూడా వాణిజ్యం పేరుతో దేశంలోకి జొరబడడానికి పాలకులు అనుసరించిన విధానాలే ప్రధానం. ఇదంతా డబ్ల్యుటీఓ షరతుల ఫలితమే. గతంలో మోన్సాంటో కంపెనీకి వ్యతిరేకంగా చేసిన పోరాటం ప్రస్తుత రైతాంగానికి ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని చెప్పవచ్చు. తమకంటే జాతీయవాదులు మరొకరులేరంటూ విర్రవీగిన బీజేపీ.. కాంగ్రెస్ కంటె మరింత ఉత్సాహంగా విదేశీయులకు బార్లా తలుపులు తెరిచింది. తమకు కల్పించిన మేధో హక్కుల చట్టాల ఆధారంగానే కేసు పెట్టినట్టు పెప్సికో చెబుతున్నా 'విత్తన రకాలు, రైతుల హక్కుల పరిరక్షణ చట్టం (పీపీవీఎఫ్ఆర్ఏ) - 2001' ఆధారంగా రైతులు తమ పంటలోని విత్తనాలను దాచుకోవడంతో పాటు ఒకరికొకరు మార్చుకునే స్వేచ్ఛ కూడా ఉన్నది. రిజిస్టర్ చేసుకున్న విత్తనాలను వాడకూడదన్నది చట్టంలో ఎక్కడా లేకున్నా కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తుండటం దారుణం.
ప్రస్తుతం విదేశీ, బహుళజాతి కంపెనీల జోక్యం రోజురోజుకు పెరుగుతున్నది. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు సాగు చేసుకునేందుకు విదేశీ కంపెనీలొస్తే, మోడీ సర్కార్ హయాంలో వారు చెప్పిందే వేదంగా మారడం గమనార్హం. టాటా, బిర్లా, రిలయెన్స్, ఐటీసీ, అదానీ వంటి పెద్దరైతులు విత్తన సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. వారంతా మోడీ సర్కార్కు అండదండలు ఇస్తున్నవారే. విత్తనంపై తమకే పేటెంట్ హక్కు ఉందని చెప్పినా మోడీ సర్కార్ నోరెత్తకపోవడం కూడా వారి ఆగడాలకు మరింత ఊతం ఇచ్చినట్టయింది. మోడీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ఆరుగురు చెప్పినట్టు నడవాల్సిందే. ఇప్పటికే రూ.1600 కోట్ల విత్తన పెట్టుబడులు సాగిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం ఖాయం. అందుకే పెప్సికో కేసు ఉపసంహరించుకున్నా ప్రమాదం పొంచే ఉన్నది. గుజరాత్ ప్రభుత్వంతో చర్చించుకుని మిగతా డిమాండ్లను సాధించుకుంటామని అనడం అందులో భాగమే. హామీల పేరుతో దగా చేసిన మోడీ రైతులకు ఏదో చేస్తారనుకోవడం అత్యాశే. నయా ఉదారవాద ఆర్థిక విధానాలను వ్యవసాయరంగంలో దూకుడుగా అమలు చేస్తున్న పాలకపక్షాలు కల్పించే భ్రమల పట్ల రైతులు, ప్రజలు, ప్రజా సంఘాలు అప్రమత్తంగా ఉండాలి. భూమి, విత్తు, వనరులపై హక్కుల పరిరక్షణకు మరే కంపెనీ అడ్డుపడకుండా ఆలుగడ్డ రైతులు రగిలించిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి.