Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యుడు భగభగ మండుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలూ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండల ధాటికి తట్టుకోలేక జనం విలవిల్లాడుతున్నారు. ఇంటిగడప దాటాలంటేనే గుండెలు గుభేల్ మంటున్నాయి. ఈ వేసవిలో కనిష్టంగా 41, గరిష్టంగా 46డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. ఏప్రిల్లో 41డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం సూర్య ప్రతాపం ఏ మేర ఉందో అర్థంచేసుకోవచ్చు. ఈసారీ ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత కనిపిస్తున్నది. ఎండలతో పాటు వడగాడ్పులూ వీస్తున్నాయి. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇక్కట్లకు గురవు తున్నారు. కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్లో 44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 45.6 డిగ్రీలు ఉంది. ఇవి సాధారణం కంటే 4నుంచి 6.5డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ సమాచారం. ఇలా ఎండలు మండిపోవడానికి కార్బన్ ఉద్గారాల వల్ల భూగోళం వేడెక్కడమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి నిల్వలు మార్చి 25నాటికే 16శాతానికి తగ్గిపోయినట్టుగా ఆయా నివేదికలు తెలియజేస్తున్నాయి. గాలిలో తేమ తగ్గడం మూలాన వేడిగాలులు వీచి మనుషులు, ఇతర జంతుజీవ రాశులు మంటకు గురవుతున్నాయి. అన్ని జిల్లాల్లో గాలిలో తేమ శాతం 30శాతానికి తగ్గిపోగా, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం 20శాతానికి కంటే తక్కువగా ఉంటున్నది. ఈనెల 10వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలియజేస్తోంది. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట, నల్లగొండ, కొమురంభీం- ఆసిఫాబాద్, కరీంనగర్, జయశంకర్-భూపాలపల్లి, జనగామ, యాదాద్రి-భువనగిరి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులు వీచే అవకాశముంది. వడదెబ్బకు ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సోమవారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా 37డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ తట్టుకోగలిగిన పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత పెరిగే ఒక్కో డిగ్రీతో శరీరం తట్టుకోవడం కష్టం. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీడపట్టున ఉండటమేగాక ఎక్కువ నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట వడగాడ్పులు, రాత్రివేళ విపరీతమైన ఉక్కపోత ప్రజలు భరించలేని పరిస్థితి నెలకొంది. మండే ఎండలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50మంది వరకు విగతజీవులయ్యారని సమాచారం. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు ఛత్తీస్గఢ్ ఈశాన్య ప్రాంతం నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు 900మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడటమే కారణమని వాతావరణ శాఖ చెబుతున్నది. నాలుగేండ్లుగా వడగాల్పుల మూలంగా దేశవ్యాప్తంగా 4620మంది చనిపోగా, వీరిలో 4246మంది తెలుగు రాష్ట్రాల వారే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా మండే ఎండలతో వడదెబ్బకు మరణించే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉందని న్యూఢిల్లీలోని భారత ప్రజారోగ్య సంచాలక కేంద్ర కార్యాలయం ప్రకటించింంది. డీహైడ్రేషన్ కారణంగా శరీరంలోని ఇతర అవయవాలపైనా ప్రభావం పడి, ప్రాణాపాయం కలిగిన సందర్భాలూ ఉంటున్నాయని అభిప్రాయపడింది. ప్రతియేటా ఉష్ణోగ్రతలు అధికమవుతున్న నేపథ్యంలో వడగాడ్పులపై గతేడాది నుంచి భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నది. పదేండ్ల నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 2016ను అత్యంత వేడిమి సంవత్సరంగా ఐఎండీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2017లోనూ తీవ్ర వడగాలులు వీచాయి ఈ గాలుల మూలంగా సంభవించే మనుషుల మరణాలను అడ్డుకోవడంతోపాటు, జంతుజీవరాసి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రతియేటా ఐఎండీ సూచిస్తూనే ఉన్నది. అయితే ఆ తరహా చర్యలు తీసుకోవడంలో, ప్రజలకు కనీస అవగాహన కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇటు ప్రకృతి విపత్తుల శాఖ, అటు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిరుపేద ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులూ, రైతులూ, విద్యార్థులూ చనిపోతున్నా కించిత్తు బాధ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దారుణం. సింగరేణి పరిస్థితి వర్ణనాతీతం. ఓపెన్కాస్ట్ గనుల్లో ఎండల ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 50డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఆయా ప్రాంతాల్లో సెలవులు ప్రకటించాలి. ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులివ్వాలి. రోడ్లను నీటితో తడపాలి. ప్రజలకు తడి గోనెసంచులు పంపిణీ చేయాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఇదిలావుండగా అడవులను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రభుత్వాల లక్ష్యం కావాలి. ఈ తరహా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 48ఏండ్ల క్రితం ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు అటువంటి వాతావరణం కనిపిస్తున్నది. వాస్తవ ఉష్ణోగ్రతలు చూపించడంలోనూ ప్రభుత్వాలు కపటనీతి ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేస్తూ, తమ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.