Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెనెజులా స్వయం ప్రకటిత 'తాత్కాలిక అధ్యక్షుడు' జువాన్ గువాయిడో అమెరికా దన్నుతో చేసిన తిరుగుబాటు గతవారంలో విఫలమైన నేపథ్యంలో అమెరికాలోని కార్పొరేట్ మీడియా ఆ దేశంపై విషప్రచారం సాగిస్తోంది. తిరుగుబాటు విఫలమైన సంకేతాలు వెలువడిన వెంటనే వెనెజులా సైన్యంలో చీలిక వచ్చిందని, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అమెరికా మీడియాలో ప్రసారాలు మొదలయ్యాయి. సైనిక తిరుగుబాటు విఫలమైన విషయాన్ని కాదనలేని స్థితిలో వెనెజులా ప్రభుత్వాన్ని మార్చాలనే అమెరికా అధికారుల అతిశయోక్తు లతో కూడిన ప్రకటనలను సీఎన్ఎన్, ఇతర ప్రధాన న్యూస్ నెట్వర్క్ చానళ్ళు ప్రసారాలు చేశాయి.
క్యూబా పారిపోవటానికి విమానంతో సిద్ధంగావున్న వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను చివరి నిముషంలో 'రష్యన్లు' నచ్చజెప్పి ఆపారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో మీడియాకి చెప్పాడు. పదేపదే ఈ ప్రకటన ప్రసారం చేసినా అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని మాత్రం బయటపెట్టలేదు. వెనెజులా రక్షణ మంత్రి వ్లాడీమీర్ పద్రినో, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్ష భవన రక్షకుడు తదితరులంతా మదురో తన పదవి నుంచి వైదొలగాల్సిందేనని అన్నారని ట్రంప్కు జాతీయ భద్రతా సలహాదారుగా వున్న జాన్ బోల్టన్ చెప్పాడు. పద్రినో, సుప్రీం కోర్టులు గువాయిడో చర్యలను ఖండించినప్పటికీ ఈ ప్రకటనలను వాస్తవాలుగా అమెరికా మీడియా భావిస్తున్నది. అమెరికా మద్దతుతో ప్రయత్నించిన సైనిక తిరుగుబాటు విఫలమైన రాత్రే 'దీన్ని తిరుగుబాటు అనకండి. వెనెజులా ప్రజలకు నియంతృత్వ ప్రభుత్వాన్ని మార్చే హక్కు ఉంటుంది' అని అమజాన్ బిల్లియనీర్ జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని వాషింగ్టన్ పోస్ట్ తన సంపాదకీయానికి శీర్షికగా పెట్టింది. వెనెజులా సంక్షోభానికి సంబంధించిన రాజకీయ, నైతిక సారం సందేహానికి ఏమాత్రం తావులేనిదని వాషింగ్టన్ పోస్టు రాసింది. 'నైతిక సారం', 'స్వేచ్ఛ' అనే మాటలను పదేపదే పునఃచ్ఛరణ చేసినా అసలు విషయం చమురు మీద పెత్తనం కోసమేననేది జగమెరిగిన సత్యం.
వెనెజులాలో గతవారం జరిగిన తిరుగుబాటు సమయంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం రాలేదు. సాయుధ తిరుగుబాటు చేయండని సైన్యానికి, పౌరులకు గువాయిడో చేసిన విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజు ముగింపుకల్లా తిరుగుబాటు ప్రయత్నానికి వ్యూహకర్తగావున్న లోపెజ్ ముందుగా చిలీ రాయబార కార్యాలయంలోను, ఆ తరువాత స్పెయిన్ రాయబార కార్యాలయంలోను ఆశ్రయం పొందాడు. ఈ అమెరికా తొత్తులతో వున్న మరో 25మంది నియంత బోల్సొనారో నాయకత్వంలోని బ్రెజిల్ రాయబార కార్యాలయంలో రక్షణ కోరారు.
గువాయిడో రాజకీయ పార్టీకి వెనెజులాలోని ప్రగతి నిరోధక సంపన్న వర్గాలు సామాజిక పునాదిగా ఉన్నాయి. ఈ వర్గాలకు కార్మిక వర్గాన్ని, పేదలను అణచివేతకు గురిచేసిన చరిత్ర ఉంది. 1989లో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) మిత వ్యయ విధానంపై కారకాజోలో నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపినప్పుడు వేలాదిమంది ప్రజలు చనిపోయారు. మదురో ప్రభుత్వంపై అమెరికా కక్షగట్టిన ఫలితంగా ప్రజలు నానా యాతనలు పడుతున్నప్పటికీ దేశంలోని కష్టజీవులకు గువాయిడో శత్రువనే భావనతో వెనెజులా ప్రజలున్నారు.
ఒక ప్రభుత్వాన్ని ప్రజలు కూలదోయటమంటే అది పాలక వర్గాల అధికారాన్ని కూలదోయటమే అవుతుంది. అలాంటి ప్రక్రియను విప్లవం అంటాం. అలా కాకుండా అధికారంలో వున్న అధ్యక్షుడిని ఒక విదేశీ ప్రభుత్వ మద్దతుతో ఒక సాయుధ ముఠా దించాలని చేసే ప్రయత్నాన్ని వాషింగ్టన్ పోస్ట్కు ఇష్టం వున్నా లేకున్నా సాయుధ తిరుగుబాటనే అంటారు. అలాంటి తిరుగుబాటు విఫలమైన నేపథ్యంలో ద్రోహిగా మారిన ఒక వెనెజులా గూఢచార అధికారి అందించినట్టు చెబుతున్న 'రహస్య సమాచారం' ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ఒక పిట్టకథను ప్రచారంలో పెట్టింది. అదేమంటే సిరియా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన పారిశ్రామిక మంత్రి తారెక్ ఎల్ ఎయిస్సమి ప్రోద్బలంతో 'వెనెజులాకు లెబనీస్ హెజ్బొల్లా సాయుధ దళాలు' వస్తున్నాయని రాసింది. ఇది 'ఇరాక్లో మానవ హనన ఆయుధాలు' ఉన్నట్టు చేసిన ప్రచారంవంటిది కాదా అని అనేకమంది పాఠకులు టైమ్స్ను ప్రశ్నించారు.
అమెరికా మీడియా నైతిక విలువలు పూర్తిగా క్షీణించాయనేందుకు ఇదొక చక్కటి ఉదాహరణ. ప్రజాస్వామిక హక్కులకు, ప్రక్రియలకు అమెరికా పాలకవర్గాలు మద్దతునివ్వటం మాని చాలాకాలమైంది. ఒకప్పుడు అమెరికా ప్రభుత్వాన్ని ఎదిరించి ఆగేయాసియాలో అమెరికా సామ్రాజ్యవాద దురాగతాలను బహిర్గతం చేయటానికి పోటీపడి పెంటగాన్ పేపర్లను ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు నేడు ఊహించలేని స్థాయికి దిగజారాయి. అవి అమెరికా సామ్రాజ్యవాదానికి బాకాలుగా మారాయి. ఈ విషప్రచారాన్ని ప్రజానుకూల మేధావివర్గం తమ రచనల ద్వారా అడ్డుకోవాలి. వెనెజులాలో అమెరికా సైనిక జోక్యం ప్రమాదాన్ని నివారించటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులు సమీకృతమవటమే నేటి కర్తవ్యం.