Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇక్కడ ఎల్లరూ అనుకుంటున్నదే ఇప్పుడు ఎల్లలు దాటింది. అమెరికాలోని ప్రఖ్యాత ''టైమ్స్'' మ్యాగజైన్ ''ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్'' అంటూ మోడీ ముఖచిత్రాన్ని ప్రదర్శించడమే కాక, ''ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం మరో ఐదేండ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా'' అని ప్రశ్నిస్తోంది. దేశంలో సార్వత్రిక సమరం ముమ్మరంగా సాగుతుండగా వెలువడిన ఈ సంచలనాత్మక కథనం.. భారతీయ సమాజంలోనే కాదు, అంతర్జాతీయ సమాజం లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజంగా మోడీ ఈ దేశాన్ని విడదీసేవాడా? ఆయన ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం భరించలేనంత ప్రమాదకర మైనదా..? ఇప్పుడీ ప్రశ్నలకు లభించే సమాధానాల మీదే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటి? అవుననా? లేక కాదనా? కాదంటే ఇప్పుడు దేశంలో విషం చిమ్ముతున్న విద్వేషాలకు కారణాలేం చెపుదాం..? చెలరేగుతున్న ఉద్రేకాలనూ, ఉద్వేగాలనూ ఎలా దాచిపెడదాం? ధ్వంసం అవుతున్న వ్యవస్థలనూ, హింసకు గురవుతున్న ప్రజల అవస్థలనూ ఏ చీకట్లో కలిపేద్దాం? విద్వేషమే దేశభక్తిగా, ప్రశ్నించడమే దేశద్రోహంగా చలామణీ అవుతున్న వర్తమానాన్ని దేంతో చెరిపేద్దాం? నిజం మాట్లాడినంతనే నిర్దాక్షిణ్యంగా నెత్తుట మునుగుతున్న కలాలు, గళాల శబ్దాన్ని, ప్రమాదపుటంచులకు చేరిన ప్రజాస్వామ్య రక్షణకు జరుగుతున్న యుద్ధాన్ని ఎక్కడ సమాధి చేద్దాం? ఒక్క ప్రశ్నకు అబ్ధపు సమాధానం చెపితే వంద ప్రశ్నలు నిలదీస్తున్నప్పుడు ఏం చేసి ఈ దేశాన్ని కాపాడుకోగలం? అబద్ధమెప్పుడూ ఆత్మవంచనే అవుతుంది. నిజం మాత్రమే పరిష్కారాన్ని సూచిస్తుంది.
కాబట్టి 'టైమ్' కథనాన్ని నిజమని అంగీకరించడమే తప్ప ఆక్షేపించి ప్రయోజనం లేదు. ఎందుకంటే అది ఈ దేశంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నది. అదే కథనం పేర్కొన్నట్టు... గత ఎన్నికల్లో అభివృద్ధి, అవినీతి గురించి మాట్లాడి అధికారానికొచ్చిన మోడీ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్ను మించిన అవినీతి కండ్లముందు కనిపిస్తుంటే, అభివృద్ధి ఒక్కడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా ఆర్థికపతనంలో కొట్టుమిట్టాడుతుంటే.. ఆయన వాటి గురించి ఎందుకు మాట్లాడుతారు? అందుకే ఆయనిప్పుడు నిబంధనలు అంగీకరించక పోయినా, న్యాయస్థానాలు హెచ్చరించినా లెక్కచేయకుండా... బాలాకోట్ దాడుల గురించి మాట్లాడుతున్నారు. పైగా ఉగ్రవాదుల్ని చంపడానికి ఈసీ అనుమతి కావాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. భారత సైనిక పాటవాన్ని నిర్లజ్జగా తన రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇక ఆయన వందిమాగధులయితే ఏకంగా భారత సైన్యాన్ని మోడీ సైన్యంగా అభివర్ణిస్తున్నారు. తానేమో కొత్తగా ఓటు పొందిన యువతరమంతా ఆ సైనిక వీరులకే తమ ఓట్లను అంకితం చేయాలని సెలవిస్తున్నారు. తాజాగా భారత వాయుసేనకే తను రాడార్ పాఠాలు చెప్పినట్టు గొప్పలు పోతున్నారు! అజ్ఞానమో అవివేకమో తెలియని స్థితిలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జాతీయ పౌరసత్వ వివాదాన్నీ ముందుకు తెస్తున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తానంటారు. అడుగడుగునా ముస్లిం వ్యతిరేకతనే ఆయుధంగా ప్రయోగిస్తారు..! ఇవన్నీ దేనికి సూచికలు? తాను అత్యంత వెనుకబడిన కులానికి చెందినవాడిననీ చెపుతారు. ప్రతిపక్షాలు తనను చంపాలని చూస్తున్నాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. ఎప్పుడో మరణించిన రాజీవ్గాంధీని ఇప్పుడు తెరమీదకు తెచ్చి విమర్శిస్తారు. ఆయన తన రాజకీయ ప్రయోజనా లకు ఎంతకైనా దిగజారుతారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?
ప్రధానమంత్రి స్థాయిని దిగజారుస్తూ నోరు తెరిస్తే అబద్ధాలు వల్లించడం, కాలు కదిపితే అసహనాన్ని రెచ్చగొట్టడం తప్ప... తన ఐదేండ్ల పాలనాకాలంలో సాధించిందేమిటో, తిరిగి అధికారమిస్తే సాధించబోయేదేమిటో మాటవరసకైనా మోడీ చెప్పరు. అయినా అటువంటిదేమైనా ఉంటే కదా చెప్పుకోవడానికి. ఆయన పదవీకాలమంతా సాధింపులకే సరిపోకపోతే ఇంక సాధించటానికి సమయం ఎక్కడిదీ?! ఇన్ని వైఫల్యాల మధ్య కూడా ఆయన ఇంకా బలమైన నేతగా ప్రచారంలో ఉండటం వైచిత్రి! ఆయన బలం దేశాన్ని ఐక్యం చేయడంలో, అభివృద్ధి పరచడంలో కనిపిస్తే ఈ దేశానికి అంతకంటే కావాల్సిందేముంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఆయన బలం ప్రజలను విభజించడంలో, అభివృద్ధిని అడుగంటించడంలో కనిపిస్తుండటం ఆందోళనకరం. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని మత ప్రాతిపదికన చీల్చడానికే మోడీ ప్రయత్నిస్తున్నారని ''టైమ్'' పత్రిక చేసిన వ్యాఖ్యానాలను ఎలా కాదనగలం? ఒక ప్రధానమంత్రి స్థాయికి ఇంతకు మించిన తలవంపులేముంటాయి?
ఇదే పత్రికలో మోడీకి బలమైన సంస్కర్తగా కితాబునిస్తూ మరో కథనాన్ని ప్రచురించారు. నిజమే కదా! దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి విదేశీ బహుళజాతి కంపెనీలకు, స్వదేశీ బడా కార్పొరేట్లకు దోచిపెట్టే సంస్కరణల అమలులో మోడీని మించిన బలవంతులెవరున్నారు? దేశ ప్రయోజనాలను కాపాడటంలో, దేశాన్ని సంఘటితశక్తిగా ఐక్యపరచడంలో మాత్రమే ఆయన అత్యంత బలహీనుడు! ఈ నిజాలను ఇప్పటికైనా గ్రహించకపోతే దేశం అబద్ధంలోనే మనుగడ సాగించాల్సి ఉంటుంది. అది అంతిమంగా అనాగరికతకూ అనేక అనర్థాలకూ దారితీస్తుంది.