Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త కుబేరులు పుట్టుకొస్తున్నారు. తిరుగులేని ఆర్థికశక్తులుగా ఇప్పటికే కొందరు స్థిరపడగా, తాజాగా ఆ జాబితాలో కొత్త ముఖాలు చేరాయి. మోడీ ప్రభుత్వం వేగంగా అమలుపరిచిన సరళీకరణ ఆర్థిక విధానాలతో ఈ ఐదేండ్లకాలంలో కుబేరుల సంఖ్య రెట్టింపు అయింది. 2013 నుంచి 2018 మధ్య కాలంలో శత కోటీశ్వరుల (బిలియనీర్ల) సంఖ్య రెట్టింపై 119కి చేరినట్టు బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. 2023 నాటికి ఆ సంఖ్య 2,167కు చేరే అవకాశం ఉంటుందని నివేదిక అంచనా. దేశంలో పేదరికం పెరిగి నిరుపేదలు పెరుగుతుంటే, మరోవైపు కొత్త కుబేరులు పుట్టుకు రావడం వెనుక ఆశ్రిత పెట్టుబడులే కారణం. అంటే, నరేంద్రమోడీ తరచూ చెబుతున్న అభివృద్ధి ఇదే! కార్పొరేట్లు సులభంగా లాభాలను సంపాదించేందుకు వీలుగా బీజేపీ ప్రభుత్వం రకరకాల విధానాలను అవలంబించడం, పనిలోపనిగా తమ పార్టీ ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకుంటూ లాభాలు గడిస్తున్నది. 1991నుంచి సరళీకరణ విధానాలు ప్రారంభమైన గత 28ఏండ్లల్లో జీడీపీ, విదేశీ పెట్టుబడులు పెరిగాయని ప్రభుత్వాలు ఎంత గొప్పగా చెప్పుకున్నా ప్రజల్లో అసమానతలు అలానే ఉన్నాయి. ఈ సంపద అదానీ, అంబానీ, బిర్లా వంటి కొద్దిమంది పెట్టుబడిదారులకు ఉపయోగపడింది తప్ప అసంఖ్యాకులైన పేదలకు చేరలేదు. పేదల్లో జీవనప్రమాణాలు రోజురోజుకు క్షీణించాయి. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీల్లో అట్టడుగు స్థానం నుంచి దేశాన్ని లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి. ఇప్పటికీ పౌష్టికాహారం అందని పేదలెందరో! రక్తహీనత లోపాలు.. రోజుకు 450గ్రాముల ఆహారం కూడా అందని దీనస్థితి. దేశం ఎంతో ముందుకు పోతున్నదనీ, ఇంత వేగంగా ఏ దేశమూ అభివృద్ధి చెందడం లేదనీ, ప్రపంచ దేశాలను దాటేస్తున్నామనీ, మనదగ్గర ఉన్న సంపద మరే దేశంలోనూ లేదని మోడీ తన మాటలతో మాయ చేస్తున్నారు కానీ ఆ సంపద ఎవరి చేతుల్లోకి పోతున్నట్టు? 2017లో ఉత్పత్తి అయిన అదనపు సంపదలో 73శాతం ఒక్కశాతంగా ఉన్న ధనికులు దగ్గరనే పోగైందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
స్వాతంత్రం వచ్చిన కొత్తలో పారిశ్రామికవేత్తలు తమతో పాటు ప్రభుత్వ వ్యవస్థల బలోపేతానికి సహకరించేవారు. వారి ఆలోచన తాము లాభపడేందుకు తప్ప ప్రజల గురించి కాదు. ఇప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ వ్యక్తిగత లాభాలు పొందుతున్నారు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. అందులో భాగంగానే కొత్తకొత్తగా కార్పొరేట్లు పుట్టుకొస్తున్నారు. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం శత కోటీశ్వరుల జాబితాలో చేరిన వారిలో దేశంలో అతి పెద్ద ఆన్లైన్ రిటైల్ ట్రేడ్ కంపెనీ ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు బిన్ని బన్సల్, సచిన్ బన్సల్ అగ్రస్థానంలో ఉన్నారు. బెంగుళూరు కేంద్రంగా వీడియో పాఠాలు బోధించే 'థింక్ అండ్ లెర్న్' వ్యవస్థాపకులు బిజు రవీంద్రన్, పేటీఎం మాతసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ను ప్రారంభించిన విజరు శేఖర్ శర్మ కుబేరుల జాబితాలో చేరారు. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన పెద్ద నోట్ల రద్దుతో పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్లకు ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. అందుకు మోడీ విధానాలే కారణం. డబ్బుల్లేక పేదలు అల్లాడినా పట్టించుకోని ప్రధాని మోడీ డిజిటల్ వ్యవస్థను ఉపయోగించు కోండని సెలవిచ్చిన మహానుభావుడు. కృతజ్ఞతగా పేటీఎం సంస్థ ప్రధాని మోడీ ఫొటోతో అన్ని ప్రముఖ పత్రికల్లో ఫుల్ పేజి అడ్వర్టైజ్మెంట్లిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారిని చూపించి దేశం అభివృద్ధిలో ముందుకు పోతున్నదని చెప్పడమే హాస్యాస్పదం.
దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాల అమలుతో కార్పొరేట్ శక్తులు, కొంతమంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అపవిత్ర కూటమిగా ఏర్పడి దేశాన్ని దోచుకుంటున్నారు. అధికారంలో ఉన్న పెద్దల అండదండలు వారికి పుష్కలంగా అందుతున్నాయి. దీంతో రెచ్చిపోయిన కార్పొరేట్లు వివిధ జాతీయ బ్యాంకుల సంపదను కొల్లగొట్టారు. వారిలో నీరవ్మోడీ, విజరుమాల్యా, లలిత్మోడీ ప్రథమస్థానంలో ఉన్నారు. వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్నారంటే అదంతా మోడీ చలువే. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన అనిల్ అంబానీ ప్రస్తుతం కోర్టుల్లో పలుకేసులను ఎదుర్కొంటున్నారు. మోడీ ఈ ఐదేండ్లుగా ఇటువంటి ఆర్థిక నేరస్తుల సేవలోనే తరిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణమే ఇందుకు పెద్ద ఉదాహరణ. జాతీయత, దేశభక్తి అని పదేపదే గొప్పలు చెప్పుకొనే బీజేపీ అడ్డగోలుగా అంబానీకి అయాచిత లబ్ది చేకూర్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ కోసమే మొదట 126విమానాలు కొనాల్సి ఉన్నా ఆ తరువాత 36కు తగ్గించడం ద్వారా మన వైమానిక దళ ఆయుధ సంపత్తికి గండి కొట్టారు. అటు ఖజానాకు నష్టం, ఇటు రక్షణ రంగ పాటవాన్ని దెబ్బ తీయడం కేవలం కార్పొరేట్లకు మేలు చేయడానికే! కొత్త కుబేరుల్లో అత్యధికులు ఇలా నడమంత్రపు సిరిని కూడబెట్టుకున్న వారే! ఇదే అభివృద్ధి అనుకుంటే అంతకంటే మోసపోవడం మరోటి ఉండదు. సకల అనర్ధాలకు కారణమైన కార్పొరేట్ శక్తులకు, వారి కోసమే ఉపయోగపడుతున్న నయా ఉదారవాద విధానాలకూ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగాలి.