Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజరూపాన్ని కొన్ని రోజులు కొంత మేరకు దాచగలరేమో గాని, అన్ని రోజులూ అంతమేరకు దాచడం అసాధ్యం. బీజేపీ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది యిదే. బీజేపీ జాతి వ్యతిరేక స్వభావం నగంగా బయటపడుతూ ఉన్నది. ఆ పార్టీ భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. జాతిపిత గాంధీని హత్య చేసిన గాడ్సేను ఉద్దేశించి 'ఆయన దేశ భక్తుడు. ఎప్పటికీ దేశ భక్తుడే. గాడ్సే ఎలాంటి వాడని తెలుసుకోకుండా ఆయనను ఉగ్రవాదిగా పిలుస్తున్న వ్యక్తులకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు' అని ఆమె హెచ్చరించారు. ఆ సాధ్వీమణి నిర్వచనం ప్రకారం జాతిపితను చంపిన గాడ్సే దేశ భక్తుడయితే, ఆ దేశభక్తునిచేత చంపబడిన గాంధీ ఎవరు? దేశ ద్రోహా?!
నిజంగా ఆమె మాటలకు దేశ ప్రజల దిమ్మ తిరిగింది. ఎందుకంటే ఆమె వ్యాఖ్యల నేపథ్యం అటువంటిది మరి! హిందువుల ఓట్లను రాబట్టుకునేందుకోసం 'ఒక హిందువు ఉగ్రవాద చర్యలో పాల్గొన్న ఘటన ఒక్కటైనా ఉందా?' అని ప్రధాని మోడీ సవాల్ విసిరారు. అంటే - 'ఈ దేశంలో ముస్లింలు అంతా ఉగ్రవాదులని, వారినుంచి సాధుజీవులైన హిందువులకు ప్రమాదం పొంచి ఉందని, ఆ ప్రమాదంనుంచి వారిని రక్షించే శక్తి తమకే ఉంది కాబట్టి, తమను గెలిపించడం హిందువుల అవసరమనీ' ఆయన మాటల వెనుక దాగిన అర్థం. మోడీ మాటలపట్ల లౌకికవాది అయిన గొప్ప నటుడు, మక్కల్ నీది వయ్యమ్ (ఎంఎన్ఎం) నేత కమల్ హాసన్ 'స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే' అని ఘాటుగా స్పందించారు. బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. జాతిపిత గాంధీ హంతకుడైన గాడ్సేకు సంఫ్ుపరివార్కూ మధ్య ఉన్న సంబంధం జగద్విదితం. గాడ్సే ' హిందూ మహాసభ సభ్యుడు'. ఈ హిందూ మహాసభ సంఫ్ు పరివార్లో అంతర్భాగం. కాబట్టే, గాంధీ హత్యానంతరం సంఫ్ుపరివార్కు తల్లివేరైన ఆర్ఎస్ఎస్ను అప్పటి హౌంమంత్రి సర్దార్ పటేల్ తన స్వహస్తాలతో నిషేధించారు. ఆ సందర్భంగా ఆర్ఎస్ఎస్ తాను బతికి బయట పడేందుకోసం 'గాంధీ హత్యకు ముందు గాడ్సే మా సంస్థలో సభ్యుడే. ఆ సమయంలో మాత్రం లేడు' అని ప్రకటించింది. అయితే, ఆర్ఎస్ఎస్ ప్రకటనను గాడ్సే కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. హిందూ మహాసభ మాత్రం గాడ్సేను ఇప్పటికీ సొంతం చేసుకుంటూనే ఉంది. 'గాంధీ హత్యా సమయంలో గాడ్సే హిందూ మహాసభలో ఉన్నాడు. అందుకు మేము గర్విస్తున్నాం. ఆయనకు గుడులు కడతాం. స్మారక మందిరాలు నిర్మిస్తాం' అని సగర్వంగా ప్రకటించింది. కాగా, 'గాంధీపై నాకెంతో గౌరవాభిమానాలు ఉన్నా ఆయన ముస్లిం అనుకూల వైఖరి ఆగ్రహం తెప్పించింది. దేశ విభజనకు కారణం కావడమేగాక, ముస్లింల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండడాన్ని సహించలేక పోయాను' అంటూ గాంధీని హత్యచేసేందుకు గల కారణాన్ని గాడ్సే వివరించాడు. గాడ్సేను దేశభక్తుని చేసిన కమలనాథులు ప్రజలను వెర్రి వెంగళప్పలను చేస్తున్నారు. ఉదయం ఒకటి ప్రకటించి, మధ్యాహ్నం దాన్ని ఖండించి, రాత్రికి తాము మాట్లాడినది తామే మరిచిపోయే నేటి కాషాయ నేతల్లో నిలువెల్లా విషముంది. ఆ విషాన్నే విచ్చలవిడిగా దేశం నలుమూలలా వెదజల్లుతున్నారిప్పుడు.
బూర్జువా నేతలు ఎన్నికల్లో విజయం కోసం అనేక అబద్ధాలాడుతారు. మోసకారి మాటలు మాట్లాడుతారు. ఇది ఈ దేశంలో సహజమే. కానీ బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు కేవలం ఎన్నికల వ్యవహారం మాత్రమే కాదు. అవి కేవలం రాజకీయాధికారానికే పరిమితం కావు. ఆ మాటలు మన దేశ శ్రామికులను నిలువునా చీల్చేందుకు ఉద్దేశింపబడినవి. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశింపబడినవి. అలాగే, తాము ఏ మతం వారిని ఉద్ధరించేందుకు పాటుపడుతున్నామని చెబుతున్నారో ఆ మతానికి చెందిన మెజారిటీ ప్రజలైన అణగారిన కులాలకు చెందిన శ్రామికులపై వివక్షను సుస్థిరం చేసేందుకు ఉద్దేశింపబడినవి. కాబట్టి గాడ్సే మొదలు ప్రగ్యా వరకూ తాము హిందువుల ఉద్ధారకులమని గొంతుచించుకుంటున్నా వారికి మెజారిటీ ప్రజల మద్దతు లభించడం లేదు. ఎన్నికలలో సైతం వారికి మెజారిటీ హిందూ ప్రజల మద్దతు లేదన్నది సత్యం. ఇందుకు వారికి ఎన్నికల్లో పోలవుతున్న ఓట్ల శాతమే నిదర్శనం.
అది ఏ సమాజమైనా, ఆ సమాజంలోని మెజారిటీ ప్రజలెప్పుడూ హింసా, అశాంతీ కోరుకోరు. మతి తప్పిన ఉగ్రవాదాన్ని సహించరు. మతం పేరిట హింసను అస్సలు మన్నించరు. అయినా బిందెడు పాలను విషతుల్యం చేసేందుకు బొట్టు విషం చాలు. కోట్ల ప్రజల బతుకుల్లో కల్లోలం రేకెత్తించేందుకు, లక్షల ప్రాణాలను గాల్లో కలిపేసేందుకు గాడితప్పిన నాయకులు గుప్పెడుమంది చాలు. అవును! బీజేపీ నాయకులు పూర్తిగా గాడి తప్పారు. కాబట్టే, సాక్షాత్తూ ప్రధాన మంత్రి సైతం తన కనీస బాధ్యత విస్మరించి విద్వేష రాజకీయాలను నడుపుతూ, విధ్వంస పాలన చేస్తున్నారు. ఆయన సహచరగణం చెలరేగిపోతున్నది. ప్రజలు చైతన్యంతో, సమైక్యతతో ఈ మూకలకు సమాధానం చెప్పేందుకు ఇదే సరైన సమయం.