Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలోనేగాక దేశవ్యాప్తంగా నేడు జరుగనున్న లోక్సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రాజకీయ నేతలు, పోటీచేసిన అభ్యర్థులను వేడెక్కిస్తుండగా, ఎండలు విభిన్న వాతావరణాన్ని కల్పించాయి. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో వడద్బెకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత మార్చి నుంచి ఇప్పటి దాకా దాదాపు 200మంది చనిపోయినట్టు సమాచారం. ఒక్క మే నెలలోనే 72మంది ప్రాణాలు వదిలారు. రాష్ట్రంలో పగటి ఉష్టోగ్రతలు 46డిగ్రీలవరకు నమోదవు తున్నాయి. వడదెబ్బకు చనిపోతున్నవారిలో ఆరు బయట పనిచేస్తున్నావారు, ప్రయాణికులే ఎక్కువగా ఉంటున్నారు. కూలి పనులకు వెళ్లేవారు, వ్యవసాయ పనులు, ధాన్యం విక్రయాలకు వెళుతునన్న వారు మరణించినవారిలో ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో దాదాపు 150మంది వరకు అనారోగ్యం పాలై ఆస్పత్రి పాలయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్ల్లాలో ఇప్పటికే 50మంది వడదెబ్బతో చనిపోయారు. అలాగే నల్లగొండ జిల్లాలో 22మంది, ఆదిలాబాద్లో 11మందిది అదే పరిస్థితి. మిగతా జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో ఈ తరహా మరణాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 250మందికిపైగా మరణాలు చోటుచేసుకున్నట్టు రాష్ట్ర వైద్యశాఖకు చెందిన అత్యవసర నిర్వహణ, పరిశోధన సంస్థ(ఎమెర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) పేర్కొంది. ఇదిలావుంటే రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవైపు రోజంతా భగభగమంటున్న సూర్యుడితో ప్రజలు అల్లాడిపోయారు. అయితే రాత్రిపూట అప్పుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు, మోస్తరు వర్షాలతో సేదతిరుతున్నారు. ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. ఒక్కోసారి ఉదయం పది దాటితే బయట అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. వచ్చే వారంరోజుల పాటు ఎండలు తీవ్రంగా కొట్టే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 45డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిన తర్వాత గాలిలో తేమ కూడా తగ్గిపోతున్నది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరేదాకా ఎండల ప్రభావం ఉంటుందని ప్రకటించింది. అయితే మరో పదిరోజుల వరకు ఉష్ణోగ్రత పెరిగే పరిస్థితి ఉన్నట్టు కూడా తెలియజేసింది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం మూలంగా రాష్ట్రంలో ఈదురుగాలులు సైతం వీచాయి. ఆసిఫాబాద్, నిజామాబాద్,మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆయా చోట్ల 3మిల్లీమీటర్ల నుంచి 42.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు నిప్పులు కురిపిస్తుంటే, సాయంత్రానికి పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడు కారుమబ్బులు కమ్ముకుని, వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రానికి 115చోట్ల వానలు కురిసాయి. కాగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్లో 46.3డిగ్రీలు, బేలలో 46.2, సోనాల, తాంసీలో 46.1, ఆదిలాబాద్లో 45.7, తలమడుగు, అర్లిలో 45.9, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 45.3, హైదరాబాద్లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. అమెరికాలోని పసిఫిక్ తీరంలో సంభవించే 'ఎల్నినో', మన దేశంలో రుతుపవన వ్యవస్థపై చూపే ప్రతికూల ప్రభావమే అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణమని సమాచారం. ఎండల నేపథ్యంలో సాధారణ ప్రజలతోపాటు ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వీటి మూలంగా అధిక చెమట, ఎక్కువ దాహం, నోరు తడారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, కడుపులో మంట, ఆకలి మందగించడం, కళ్లమంటలు, ఎర్రబారడం, వడదెబ్బ ముప్పు తదితర సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. వేడిగాలుల తీవ్రతకు 25 ఏండ్లుగా దేశవ్యాప్తంగా 22వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరుసగా ఆరో ఏడాది దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వేడిగాలుల బారిన రోజూ వందల సంఖ్యలో జనం ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తున్నది. 135కోట్ల జనాభా ఉన్న భారత్లో సుమారు 40శాతానికిపైగా జనం నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణంలోని మార్పులు నగరాల్లోని జనాభాకే పెనుసవాళ్లు విసురుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా ప్రజాజీవనానికి ఆటంకాలు ఏర్పడకుండా రాష్ట్రాలన్నీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణా సంఘం రాష్ట్రాలకు లేఖలు రాసింది. వేసవి ముంచుకొస్తే పెనుసమస్యలు చుట్టుముడతాయన్నది కొత్తగా కనిపెట్టిన విషయం కాదు. అధిక ఉష్ణోగ్రతల తాకిడికి వేల సంఖ్యలో ప్రజలు మరణించిన చేదు అనుభవాలు వెన్నాడుతున్నాయి. ఈ ఏప్రిల్లో వడదెబ్బ తాకి వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలైన వాస్తవాలు కండ్లేదుటే కనిపిస్తున్నాయి. క్రియాశీల చర్యలతో ముప్పును ఎదుర్కోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాసుకుని బాధ్యతల నుంచి తప్పుకోవడం బాధాకరం. పొట్టచేతపట్టుకుని పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు తరలివస్తున్న లక్షల మందికి దాహమైతే చారెడు నీళ్లతో గొంతు తడుపుకునే సదు పాయాలుగానీ, వేడిగాడ్పులు తీవ్రమైతే నీడపట్టున కాసేపు సేదతీరే కనీస సౌకర్యాలుగానీ దేశంలో, రాష్ట్రంలో కనిపించకపోవడం గమనార్హం.