Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే ఘన విజయం సాధించాయి. ఆర్థిక విధానాలలో విఫలమైన మోడీ ప్రభుత్వం ఎన్నికల విధానంలో సఫలమైంది. తన ప్రభుత్వ వైఫల్యాల ఫలితమైన అసంతృప్తిని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో జయప్రదమైంది. సాధారణంగా సార్వత్రిక అసంతృప్తి వ్యాపించినప్పుడు ప్రతిపక్షం విజ యం సాధించడం సహజం. 2014లో జరిగింది అదే. ఆనాటి యూపీయే పాలన పట్ల తీవ్ర అసంతృప్తికి లోనైన జనం ప్రత్యామ్నాయంగా ఎవరుంటే వారికే ఓటేసారు. దేశవ్యాప్తంగా 'నేనున్నాన'ని ముందుకొచ్చింది బీజేపీ మాత్రమే. అంతే... కాంగ్రెస్ వద్దనుకున్న జనం బీజేపీ - ఎన్డీయే వైపు చూసారు. ఈసారి కూడా నిజానికి నరేంద్రమోడీ పాలన పట్ల సార్వత్రిక అసంతృప్తి వ్యాపించింది. ఆరు నెలల క్రితం వరకూ మోడీ ప్రభుత్వానికి ఓటమి తప్పదనే అందరూ భావించారు. అందుకు కారణాలు అనేకం. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలైంది. రాజస్థాన్, చతీస్గఢ్, మధ్యప్రదేశ్లలో రాష్ట్ర ప్రభుత్వాలనూ కోల్పోయింది. అయినా బీజేపీ నేతలు, ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు కూడా ఇంకా తమకు టైమున్నదనీ, ప్రజలు తమవైపు తిరుగుతారని చెబుతూ వచ్చారు. ఇక్కడే ఉన్నది అసలు రహస్యం. అదే ఇప్పుడు జరిగింది.
మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ గానీ, ప్రాంతీయ పార్టీలు గానీ జయప్రదం కాలేదు. వారి విధానాలు కూడా అవే కావడం కారణం. నిరుద్యోగం, ధరలు, రైతుల ఆత్మహత్యలు, గ్రామీణ పేదలు, కార్మికులు వంటి ప్రజల సమస్యలకు వీరు చూపించే పరిష్కారం కూడా ఏమీ లేదు. బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలన్నింటి దారీ సరళీకృత విధానాలే. లైంగిక దాడులూ, కుల వివక్ష, కుల దురహంకార దాడులూ పెరిగాయి. ప్రజా సమస్యలకు ప్రతిపక్షాలు పరిష్కారం చూపలేదు. పరిష్కారం కోసం పోరాట మూ చేయలేదు. అయినా పాలకుల పట్ల అసంతృప్తి ప్రతిపక్షానికి ఉపయోగపడుతుందని వీరి అంచనా. కానీ అది జరుగకుండా భావోద్వేగాలను బీజేపీ ముందుకు తేగలిగింది. ప్రజా సమస్యలు చర్చకే రాకుండా చేయటంలో జయప్రదమైంది. ప్రతిపక్షాలు కూడా బీజేపీ నిర్దేశించిన ఎజెండా ఉచ్చులో చిక్కుకుని గిలగిల కొట్టుకున్నాయి. ప్రజా సమస్యలు చర్చకు తేవటంలో వైఫ ల్యంతో ఇది కుర్చీల కోసం కొట్లాటగా మారింది. ఆర్థిక విధానాలు పక్కకు పోయినపుడు మిగిలేది భావోద్వేగాలే కదా! ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపగలిగేది వామపక్షం మాత్రమే. ప్రత్యామ్నాయ విధానాలు ప్రజల ముందుంచగలిగేదీ అదే. ఈ ఐదేండ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసింది వామపక్షాలే కదా! కార్మికుల దేశవ్యాపిత సమ్మెలూ అనేక రాష్ట్రాలలో జరిగిన రైతాంగ పోరాటాలలో కీలక పాత్ర పోషించిందీ కమ్యూనిస్టులే. రాజస్థాన్లో రైతాంగ సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించింది ఎర్రజెండా. నాసిక్ నుంచి ముంబై వరకూ వేలాది మంది రైతులు కదం తొక్కింది అరుణ పతాక నాయక త్వంలోనే. అయినా దేశంలో ఎన్నికలను ప్రభావితం చేయగల శక్తిగా వామపక్షం లేదు. గత కొంత కాలంగా బలహీనపడింది. ప్రత్యామ్నాయ విధానా లను ప్రజల మధ్య ఎజెండాగా మార్చే విషయంలో కమ్యూనిస్టుల శక్తి చాలలేదు. కమ్యూనిస్టులు బలహీనపడిన ఫలితంగా ఏర్పడుతున్న శూన్యా న్ని భావోద్వేగాలు ఆక్రమించాయి. ప్రజా సమస్యలే ఎజెండాగా ఎన్నికలు సాగితే ఫలితాలు మరోవిధంగా ఉండేవన్న విషయంలో భిన్నాభిప్రాయా లకు తావు లేదు. సరిగ్గా ఇది జరుగకుండా ఏడు విడతల ఎన్నికలలో ఏడు రకాల నినాదాలతో చర్చను భావోద్వేగాల చుట్టూ తిప్పింది బీజేపీ. దాని చుట్టే తిరిగాయి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు.
ఆర్థిక విధానాల విషయంలోనే కాదు.. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, డబ్బు పాత్ర వంటి అనేక కీలక విషయాలలో ప్రతిపక్షాలను ప్రజలు ప్రత్యామ్నాయంగా చూడలేకపోయారు. కేంద్రంలో మోడీ నిరంకుశ పోకడలు ఆందోళనకరం. కాంగ్రెస్ గత చరిత్ర చూసినా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల పోకడ చూసినా నిరంకుశ పోకడలలో తక్కువేమీ కాదు. మతాన్ని రాజకీయాల కోసం బీజేపీ వాడుకోవటం సరైంది కాదని చెప్పాల్సిన వీరు తామూ హిందువులమేనని చెప్పుకోవటంలో పోటీ పడ్డారు. లౌకిక విలువల పట్ల నికరంగా నిలబడకుండా అవకాశవాదం ప్రదర్శించారు. ధన రాజకీయాలను ప్రయోగించటంలో కూడా పోటీ పడ్డారు. నిజమైన ప్రత్యామ్నాయం చూపగల్గిన వామపక్షాలు బలహీనపడటమే నేటి ప్రధాన సమస్య. వామపక్షాలకిది సవాలు. ఈ పరిస్థితిని సరిగ్గా విశ్లేషించి సరైన చర్యలు తీసుకోవాల్సిన సమయమిది. ప్రజా సమస్యలను ఎజెండాగా మల్చడంలో వామపక్షాలు ఎందుకు వెనుకబడుతున్నాయో పరిశీలించాలి. వామపక్షాలు బలపడితేనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ముందుకు సాగుతాయి. ఇవి బలపడితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రశ్నించేతత్వం బలపడుతుంది. పేదల మధ్య ఐక్యత, ప్రజల మధ్య సోదరభావం పెరుగుతాయి.