Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దృఢ మనస్కులు భావాల గురించి చర్చిస్తారు, సగటు మెదడున్నవారు సంఘటనల గురించి మాట్లాడుతారు, బలహీన మనస్కులు సామాన్యుల కబుర్ల గురించి ఏకరవు పెడతారంటాడు ప్రఖ్యాత తత్వవేత్త సోక్రటీస్. కండ్ల ముందు కనిపించే సంఘటనల పరంపర చుట్టూరానే సగటు మనిషి మేధ తిరుగాడుతుంటుంది. తనకు తోచిన తీర్మానాలు చేస్తుంది, తీర్పులు చెబుతుంది. కనుక వర్తమాన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవితానికి సంబంధించిన ఘటనల్లోని సారాంశం అంత త్వరగా అంతుబట్టదు. ఏ ఘటన వెనుక ఉన్న నేపథ్యం ఏమిటో, దానిని ఎలా అర్థం చేసుకోవాలో స్ఫురించదు. తక్షణ స్పందనల్లో ఆశ, నిరాశలు, నిస్పృహలు, నిందా రోపణలు మాత్రమే కనిపిస్తాయి. నిజం ఏమిటో యోచించే సహనానికి, తర్కానికి తావుండదు. నింపాదిగా ఆలోచించే వివేచనకు చోటు దొరకదు. మరీ ముఖ్యంగా వాస్తవాలని మరుగు పరచి, లేదంటే మసిపూసి మారేడుకాయ చేసే మీడియా విహలత్వం ముందు అసలు వాస్తవాలు చిన్నబోతాయి.
ప్రచార ప్రభావాల ఒరవడిలో కొట్టుకుపోయే వారికి నిజానిజాల్ని తేల్చి చెప్పడం అంత సులువు కాదు. నికార్సయిన నిజం కండ్లముందు దృశ్యమానం చేస్తే తప్ప నమ్మలేని స్థితి నెలకొన్న దైన్యం వర్తమానాన్ని అలుముకున్నది. రాజకీయాలనే కాదు, ఏ విషయంలోనూ మౌలిక చింతనకు ఆస్కారం లేని సంక్లిష్ట స్థితిలో మనిషి బతుకు సమాచార వాణిజ్యానికి సరుకయ్యింది. సగటు మనిషి మెదడు మీద సకల మీడియా సాధనాలది పైచేయిగా పరిణమించింది. ఆలోచనాపరులనుకునే వారు సైతం జనాల మనోగతాన్ని, ఆలోచనా స్థాయిని తక్కువగా చూసే ధోరణి దాపురించింది. నిన్నమొన్నటి ఎన్నికల ప్రహసనంలో నిజంగా ప్రజాతీర్పు ఒక వైపు మొగ్గు చూపిందా. డెబ్బయి శాతం కూడా దాటని పోలింగ్లో సగం మంది ఆమోదం పొందని వారు కూడా పెత్తనాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే అది 'జనం తీర్పు', 'జనామోదం' అవుతుందా? అసలు ప్రజాకోర్టులో నీతిగా, నిర్భయంగా నిజాలు మాట్లాడిన వారే కనిపించడం లేదు. లోభాలకీ, ప్రలోభాలకీ లోను చేసే కుతంత్రంలో జనమనోగతం వ్యక్తమైందనుకోడం హాస్యాస్పదం!
మనం మాట్లాడే మాటల్లోని అంతరార్థం, అసలు అర్థం గ్రహిస్తే మన ఆలోచనల స్థాయి ఎక్కడ ఆగిపోతుందో బోధపడుతుంది. ఎన్నికలని 'కురుక్షేత్రం'తో పోల్చడం పరిపాటయింది. నిజంగా కురుక్షేత్ర సంగ్రామం లాంటిదే అనుకుంటే ఎవరు గెలిచినట్టు? ఎవరు ఓడినట్టు? పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? ఇద్దరూ వర్ణాశ్రమ ధర్మ పరిరక్షకులు. ఎవరు గెలిచినా ఆ ధర్మచక్రాల కింద నలిగిపోయేది తాడితులు, పీడితులు. ఇంద్రప్రస్థం, హస్తినాపురం నిర్మాణంలో సామాన్యుల చెమట ఉంది. కాని వారికి అప్పుడూ ఇప్పుడూ చోటు లేదు. అలాగే 'చాణక్య తంత్రం', 'అపర చాణక్యుడు' అనే మాటలు ఏం చెబుతున్నాయి? చాణక్యుని ధ్యేయమూ వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణే. అందుకే అపర చాణక్యులు ఎక్కడ ఉన్నా వారు ప్రభువుల పక్షానే నిలుస్తారు. 'చాణక్యం' శ్రమజీవుల చెమటని కొల్లగొడుతూ ప్రభువుల, ధనస్వాముల బొక్కసాలు నింపడానికి ఉపకరిస్తుంది. ఇలాటి 'చాణక్యం' ఛీత్కారాలకు లోను కాకపోగా, ఆకర్షణీయం కావడమే విదూషకత్వం. చరిత్రలో చక్రవర్తుల్ని నిరసించి, జనం పక్షాన నిలచిన చార్వాకుల్ని, సత్యకామజాబాలిలను మరచి చాణక్యులని స్మరించడంలోనే భావదారిద్య్రం, ఆలోచనా లేమి ఇమిడివుంది.
రాజకీయాల్లోనే కాదు సమస్త రంగాల్లో ప్రభువర్గాల భావజాలమే పెత్తనం చెలాయించడం గమనార్హం. వివేచన, విచక్షణ, తర్కం, హేతువు, గతితర్కం లోపించిన ఫలితమే కేవలం ఘటనల గురించిన చర్చకు పరిమితం కావడం. ప్రత్యామ్నాయంగా కనిపించే వారు సైతం భావజాల రంగంలో నిష్క్రియాపరులయిపోవడం అతి పెద్ద విషాదం. కాని భావాలు సమసిపోవు. ఆలోచనలు ఆగిపోవు. ఎక్కడోచోట ఏదో రూపంలో పురుడు పోసుకుంటూనే ఉంటాయి. వాటిని గ్రహించే ఓపిక ఉండాలి. మౌలికమైన సత్యం, జ్ఞానం కోసం నిరంతర అన్వేషణ, తీరని తృష్ణ నిలుపుకోవాలి. మౌలిక భావాల పరివ్యాప్తి ద్వారానే అసత్యాల్ని ఎదుర్కొంటాం. అధికారంలో ఎవరు ఉన్నారన్నది ప్రధానం కాదు, నికార్సయిన భావాలపై పట్టు ఎవరిదన్నదే ముఖ్యం. ఈ విధమైన యోచన ద్వారానే భావాలకు సంబంధించిన చర్చ, భావజాల రంగంలో నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు సరైన దిశలో నడిపిస్తాయి.
ప్రధాన స్రవంతి సమాజంలో ఉంటూనే ప్రత్యామ్నాయాల యోచన చేయడం తప్పనిసరి. ధర్మం పేరుతో కొనసాగే అధర్మం లోని దుర్మార్గాన్ని చూపాలి. భారత రామాయాణాలు ప్రబోధించే ధర్మసూత్రాల ప్రాసంగికతని ప్రశ్నించాలి. పాలించడమంటే పెత్తనం చేయడమనే అధికార దురంధతని నిలదీసే భావాల మేలిమి పదునెక్కాలి. దుడ్డున్నవాడిదే రాజ్యమనే భావాల్ని పరిమార్చే చైతన్యం వెల్లువెత్తాలి. ఇది చెప్పినంత సులభం కాదు. కానీ సాధ్యమే. నిజాలు మాట్లాడినందుకు సోక్రటీస్ విషం మింగాల్సి వచ్చింది. సోక్రటీస్ మరణించినా, ఆయన భావాల దీప్తి పరివ్యాప్తమవుతూనే ఉంది. అబద్ధాల ఆయువు తాత్కాలికం. అసలుసిసలు సత్యమే చరిత్రలో నిలబడి తరం తర్వాత తరాన్ని ఉత్తేజితం చేస్తున్నది. మార్పుదిశగా మానవ సమాజాన్ని నడిపిస్తున్నది. ఈ చారిత్రక సత్యం మీద సడలని విశ్వాసమే భావజాల రంగంలో క్రియాశీలతకు పట్టుగొమ్మ. అంతిమంగా మార్పు దిశగా మన ఆలోచనల ప్రయాణానికి దారిదీపం.