Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధానిగా రెండోసారి నరేంద్రమోడీ బాధ్యతలు తీసుకోబోతున్న తరుణంలో ఉన్నత విద్యారంగం ప్రస్థానం ఎలా ఉంటుందన్న దానిపై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. తన హయాంలో గతంలో విద్యారంగంలో మిగిలిపోయిన బిల్లులన్నీ రాబోవు ఐదేండ్లలో మోడీ పూర్తి చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సూచనలతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) తొమ్మిది అంశాలతో ఓ నివేదిక సిద్ధం చేసి ఉంచడం ఇందులో భాగమే. కొత్త సర్కారు ఏర్పడ్డ తర్వాత వంద రోజులలో కొత్త విద్యావిధానాన్ని రూపొందిం చాలని సంకేతాలందాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నత విద్యారంగాన్ని ప్రయివేటీకరణ చేయడం ఖాయమని తేలుతున్నది. గత అనుభవాలే ఇందుకు ఉదాహరణ. తనకు రెండోసారి ప్రజలిచ్చిన అధికారంతో గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రయివేటీకరణ నిర్ణయాలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నారని ఇటీవలి మోడీ మాటలను బట్టి వ్యక్తమవుతున్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రద్దు, వర్సిటీల ప్రయివేటీకరణ వంటి అంశాలూ ముఖ్యమైనవిగా ఉండటం గమనార్హం.
మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చీరాగానే విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర క్యాబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్, హరిగౌతమ్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీలు యూజీసీ రద్దు చేయాలని సూచించాయి. ఈ పరంపరలో కేంద్రప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత కేంద్రం నిటి అయోగ్ ద్వారా అనేక నూతన ప్రణాళికలను రూపొందించింది. దీని ద్వారా విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని లక్ష్యాలను నిర్దేశించుకుంది. యూజీసీ స్థానే ప్రత్యామ్నాయ వ్యవస్థకు రంగం సిద్ధం చేసింది. అంతకంటే ముందు కూడా యూజీసీ, ఏఐసీటీయూ స్థానంలో ఉన్నతవిద్యా కమిషన్(హీరా) చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధపడినా అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తటంతో వెనక్కుతగ్గింది. ఆ తర్వాత ఉన్నత విద్య నియంత్రణకు నూతన చట్టం తేవాలని నిర్ణయించింది. ఇందుకు 1952లో ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చట్టాన్ని, నిధుల సంఘాన్ని రద్దు చేసి కొత్తగా భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్ఈసీఐ) ఏర్పాటుకు ముసాయిదా చట్టం బిల్లును గత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే తేవాలనుకుంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల నిర్వహణ బాధ్యతను పర్యవేక్షిస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సంస్థను ఎత్తేసి, ఇక నుంచి రాజకీయ నాయకుల గుప్పిట్లో ఉండే కంట్రోల్బాడీ లాంటి కమిషన్ను నియమించడం ప్రభుత్వ ఉద్దేశం. దేశంలో ఉన్న ఆయా వర్సిటీలకు ప్రయివేటు ఏజెన్సీల ద్వారా గుర్తింపునివ్వాలని దీని సారాంశం. గత ప్రభుత్వం హయాంలో ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదించినా అప్పుడు సర్వత్రా వ్యతిరేకత రావడంతో సర్కారు దానిపై వెనక్కితగ్గింది. జూన్లో కొత్త లోక్సభ మొదటి సమావేశాలలో గానీ, ఆ తర్వాత జరిగే పూర్తి బడ్జెట్ సమావేశాలలో గానీ విద్యారంగంలో ఆగిన బిల్లులన్నింటినీ ప్రవేశపెడితే ఇంతకంటే దారుణం మరోటి ఉండదు. పాతదాంట్లో లోపాలనూ, పనితీరునూ చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి కేంద్రీకృతం చేస్తామనడం ప్రమాదకరం.
యూజీసీ ఆధ్వర్యంలో దేశంలో 860కిపైగా విశ్వవిద్యాలయాలు, 40వేలదాకా కాలేజీలు, మరో పదకొండున్నర వేల సంస్థలున్నాయి. వాటిల్లో ప్రమాణాలు కలిగినవి చాలా తక్కువ. బోగస్ విశ్వవిద్యాలయాల, బోగస్ కళాశాలల జాబితా మాత్రమే యూజీసీ విడుదల చేసేది. శిక్షించే అధికారం లేదు. కానీ కొత్తగా ఏర్పడే సంస్థకు వాటిని రద్దు చేసే అధికారం ఉంటుందని చట్టంలో పేర్కొంది. అయితే నిధుల మంజూరు అధికారం లేదు. దీనివల్ల ప్రయివేటు వ్యక్తుల జోక్యం పెరుగుతుందన్నది విద్యావేత్తల ఆందోళన. ఇప్పటికే ప్రయివేటు ఉన్నత విద్యాసంస్థల్లో ఉన్నత విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది.
వీటితో పాటు కీలకంగానే గాక వివాదాస్పదంగా ఉన్న మరో అంశం దేశంలో పేరెన్నిక కలిగిన 30వర్సిటీలను నెలకొల్పడం. వీటిని ప్రభుత్వ పరంగా కాక ప్రయివేటు రంగంలో ప్రోత్సహించడమే అసలు సమస్య. దీనికింద ప్రభుత్వం 'గ్రీన్ఫీల్డ్', 'బ్రౌన్ఫీల్డ్' వర్సిటీలను నెలకొల్పనుంది. గ్రీన్ఫీల్డ్లో ఇదివరకే విద్యారంగంలో సేవలందిస్తున్న వర్సిటీలుండగా.. బ్రౌన్ఫీల్డ్లో బడా కార్పొరేట్లు నెలకొల్పనున్న వర్సిటీలు ఉన్నాయి. బ్రౌన్ఫీల్డ్ వర్సిటీలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలుండాలని ప్రభుత్వం చెబుతున్నది. గతేడాది రేటింగ్ ఇచ్చిన ఆరు వర్సిటీలలో ఐఐటీ-బొంబాయి, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ- బెంగళూరుతో పాటు ప్రయివేట్ రంగానికి చెందిన బిట్స్ పిలానీ, మణిపాల్ వర్సిటీ, జియో ఇనిస్టిట్యూట్లున్నాయి. అందులో అసలు ప్రారంభమే కాని జియోకు ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిందంటే రెండోసారి గద్దెనెక్కనున్న మోడీ ఉన్నతవిద్యారంగాన్ని ఎవరి చెప్పుచేతల్లో ఉంచబోతున్నారన్నది అర్థమవుతున్నది. విద్యను సార్వత్రికం చేయాలని ప్రపంచ వ్యాపితంగా ఆకాంక్ష వ్యక్తమవుతున్న తరుణంలో దీనిని వ్యాపారీకరించాలని చూడడం ఎంతవరకు సమంజసం? విద్యలో నాణ్యతపెరగాలన్నా, ఉన్నత విద్యలో చేరే వారి సంఖ్య ప్రపంచ యావరేజి స్థాయికి పెంచాలన్నా విద్యారంగంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించడం ద్వారానే సాధ్యం.