Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టి భారాన్ని మోసినప్పుడే విత్తు మొక్కవుతుంది. మట్టిగడ్డను చీల్చుకుని విత్తనం మొలకెత్తుతుంది. చివరకు మానుగా ఎదిగి చుట్టూతా విస్తరించి సమస్త ప్రాణికోటికి ప్రాణవాయువు అందిస్తుంది. ఈ ప్రక్రియలో విత్తనానికి తగిన కాలవ్యవధి ఉన్నందునే చెట్టుగా రూపాంతరం చెందుతుంది. సహనం వహించిన గొంగళిపురుగు రంగురంగుల సీతాకోకచిలుకగా మారి కనువిందు చేస్తుంది. అంటే ఆశించిన ఫలితాలు సాధించుకోవాలంటే మనిషి తన ప్రయత్నంతో పాటు ఓర్పూ, సహనం సహజసిద్ధంగా వొంట బట్టించుకోవాలి.
కర్ణుడికి కవచకుండలాలు ఎలాంటివో మనిషి విజయానికి సహనం అలాంటిదని పెద్దలంటారు. కానీ అనేక సందర్భాల్లో తాత్కాలికంగా ఎదురయ్యే అననుకూల పరిస్థితు లకు తీవ్రంగా ప్రతిస్పందించి, కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ తర్వాత తీరిగ్గా బాధపడుతూ ఉంటాం. అయ్యో..! ఆ క్షణంలో కొంత సహనాన్ని పాటించి, ఓపికగా ఉండి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు కదా అని పశ్చాత్తాప పడుతూ ఉంటాం. ఒకవేళ అది జీవితానికి సంబంధించినది అయి ఉంటే చేజేతులా కోల్పోయామని కుమిలిపోతూ ఉంటాం. క్షణికావేశం అలాంటి పర్యవసానాలకు దారితీస్తుంది మరి! వయస్సుకు తగిన మానసిక పరిణితి, ఆత్మ పరిశీలన కొరవడటం, కించిత్ అనుభవరాహిత్యం కూడా ఇందుకు కారణం కావొచ్చేమో. ఇతరుల మనస్సు గాయపడకుండా మనస్సులోని మాట వివరించి చెప్పగలిగేంత సహనం, ఓర్పూ నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇంట్లో కావొచ్చు. పనిచోటా కావొచ్చు. అహంకారాన్ని కాస్త దూరం పెట్టి, సౌమ్యంగా ప్రవర్తించగలిగే పరిణితి కోసం ప్రయత్నించాలి. అప్పుడే ఆలోచనాశక్తి ఇనుమడిస్తుంది. చక్కని నిర్ణయాలు చేయగలిగిన సామర్థ్యం అలవడుతుంది.
అనుభవానికీ, ప్రతిస్పందనకూ మధ్య తలెత్తే స్థితే సహనం. అది కొంతమందికి అనుభవం ద్వారా లభిస్తే మరి కొందరికి అసలు అనుభవంలోనే రాదు. వచ్చినా ఆవేశం దానిని గ్రహించకుండా అడ్డుపడుతుంది. ప్రతి విషయానికీ ఆవేశం పరిష్కారం చూపదు సరికదా అభివృద్ధికి ఆటంకమవుతుంది. అందుకే 'ఓర్పు ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం అంత మధురంగా ఉంటుంది' అని అరిస్టాటిల్ అంటారు. అంటే ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించినప్పుడే ఓర్పు అలవడుతుంది. వారి నైపుణ్యాన్నీ తెలియపరుస్తుంది. అయితే, నేడు చాలామంది ఎవరికివారు జబ్బలు చరచుకోవడం పరిపాటిగా మారిపోయింది. 'మేం చెప్పిందే వేదం.. మాకు మాత్రమే అన్నీ తెలుసు' అనే అపోహలో ఉండిపోతున్నారు. ఇలాంటివారు ఎదుటివారి గొప్పతనాన్ని, మనోభావాల్ని గుర్తించకుండా అసహనం ప్రదర్శిస్తుంటారు. 'వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక..' అనేదానికి భిన్నంగా ఇతరులు చెప్పేది కూడా వినకుండా అతి తొందరగా సహనాన్ని కోల్పోతుంటారు. తమ అభిప్రాయాలతో ఎదుటివారిని అంచనా వేస్తారే తప్ప సహనం వహించరు. దీనివల్ల ఇరువురి మధ్యా కలహాలే తప్ప కలిసిపోయేంత మైత్రి ఏర్పడదు.
అసలు ఓర్పుగా ఎందుకుండాలి? సహనం ఎందుకు ప్రదర్శించాలి? అంతా మన మంచి కోసమే..! ఎన్నోసార్లు మన నుంచి తప్పులు జరిగినప్పటికీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, ఇతరులు క్షమిస్తూనే ఉంటారు. వారి సహనగుణమే మనల్ని ఆలోచింపజేస్తుంది. తప్పు చేసినవారందరినీ దండిస్తూ పోతే అసలీ ప్రపంచంలో ఎవరూ మిగలరు. అందుకని ఓర్పుతో మెలగాలి. ఓపికను నేర్పుగా అలవర్చుకోవాలి. పుట్టుకతోనే ఎవరూ పరిపూర్ణులు కారని మన మనస్సుకు మనమే నచ్చజెప్పుకుంటూ ఉండాలి. ఎవరైనా తప్పులు చేసినా పోతే పోనీ.. సర్దుకుపోతూ ఉండాలి. తమ తప్పు తెలుసుకొని, సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నామన్న మాట! ఇది చాలా ముఖ్యం. దృఢమైన వారు మాత్రమే ఎటువంటి సమస్యనయినా సహనంతో క్షమించగలరు. ఓర్పు, సహనంతో ఉన్నామంటే ఇతరుల ఎదుగుదలకు సహకారాన్నివ్వడమే. అది కాలికి దెబ్బ తగిలిన వారికి తాత్కాలిక ఆధారం ఇవ్వడం లాంటిది. మన మీద ఇతరులు ఆధారపడటానికి అవకాశం ఇస్తున్నామంటే మంచితనం నుంచి వారు కొంచెం ప్రయోజనం పొందడానికి అనుమతిస్తున్నామని అర్థం. దానివల్ల తమ బలహీనతల నుంచి బయటపడి, తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడానికే అనే విషయం 'ఓర్పు' గలవారికి మాత్రమే అర్థమవుతుంది. అంటే మనసెరిగి మసలుకోవడమని తాత్పర్యం.
ప్రతి ఒక్కరూ తాము సమాజంలో ఒక భాగంగానే భావించాలి. వ్యక్తికి అనుకూలంగా వ్యవస్థ ఉండదు. వ్యవస్థకు అనుకూలంగానే వ్యక్తి మసలుకుంటూ రాణించే ప్రయత్నం చేయాలి. ప్రతి సందర్భం నుంచీ పాఠాలు నేర్చుకుంటూ ఎదగాలి. ఇది నిత్య ప్రక్రియ. అప్పుడే విజ్ఞతా విచక్షణా అనే సద్గుణాలు అలవడుతాయి. ఒక సంఘటనను ఓపిగ్గా పరిశీలించగలిగినప్పుడే, దాన్నుంచి మంచిని స్వీకరించగలుగుతాం. ఏకాంతంగా మనతో మనం గడుపుతున్నప్పుడు బాగానే ఉంటుంది. నలుగురితో కలిసి నడవాల్సి వచ్చినప్పుడే అది సహనానికి పరీక్ష...! ఆ సమయంలోనే మనను మనం నియంత్రణలో పెట్టుకోవాలి. నలుగురితో సానుకూలంగా మసలుకోవాలి. నిరంతరం పరిస్థితులు, పరిసరాలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మన ఇష్టాయిష్టాలకు అతీతంగా పరిస్థితులు చుట్టుముట్టవచ్చు. అప్పుడే సహనంగా, సంయమనంతో వ్యవహరించాలి. ఆ పరిపక్వతే అభ్యున్నతికీ, మార్పునకు వడివడిగా అడుగులు వేయిస్తుంది. మనం నాటిన మొక్క చిగురేసి మొగ్గేసి నిండుగా వికసిస్తుంది.