Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతే రాజనేది పాత నానుడి. ఇప్పుడు దానికి పాలకులు చెల్లుచీటి పాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న నూతన ఆర్థిక విధానాలు వ్యవసాయాన్ని కుదేలు చేసాయి. జూన్ ఒకటి నుంచి సెప్టెంబరు 30 వరకు ఖరీఫ్ ప్రణాళిక అమల్లో ఉంటుంది. కానీ సర్కార్ ఖరీఫ్ ప్రణాళిక ప్రకటించనేలేదు. విత్తనాలు, రుణాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం, వ్యవసాయ ఉద్పాదకత పెంచడం ఖరీఫ్ లక్ష్యం. ప్రణాళిక ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు ఆర్థికంగా వెన్నుతట్టడం ప్రభుత్వాల బాధ్యత. రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసలు ఖరీఫ్ ప్రణాళికే మరిచారు. మే 31 నాటికే 2019-20 ఖరీఫ్ ప్రణాళిక ప్రకటించాల్సి ఉంది. మామూలుగా ప్రతియేటా ఖరీఫ్లో కోటి 38 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ఇందులో వరి 30 లక్షల ఎకరాలు, పత్తి 45 లక్షల ఎకరాలు, మిగతా భూమిలో ఇతర పంటలు సాగు చేస్తారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో కేవలం 29 లక్షల మంది మాత్రమే రైతుబంధుకు అర్హత పొందారు. మిగతా 27 లక్షల మందికి ఈ రోజుకు కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదు. వీళ్లంతా ఎవరో కాదు..సన్న, చిన్నకారు రైతులే. వీరందరికీ సాగుచేసే పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాల్సి ఉంది. అవేవీ అమలు కావడం లేదు. తాజా రుణమాఫీ కూడా ప్రశ్నార్థకమే. రాష్ట్ర వ్యాప్తంగా 5800 మేర బ్యాంకులు ఉన్నాయి. ప్రతియేటా ఒక్కో బ్యాంకు బ్రాంచీ 100 మంది కొత్త రైతులకు రుణాలు ఇవ్వాలనే ఆర్బీఐ నిబంధనలున్నా, వాటిని పెడచెవిన పెట్టారు. చిన్న, మధ్య తరగతి రైతులకు యేటా 8 శాతం మేర రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ చెబుతున్నా, 6.15 శాతం మాత్రమే ఇచ్చినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) నివేదిక స్పష్టం చేస్తున్నది. అలాగే 2018-19లో వాణిజ్య బ్యాంకుల నుంచి పంట రుణాలను రూ. 42,494 కోట్లకుగాను, రూ. 33,751 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలియజేసింది. ఖరీఫ్లో 77శాతం రుణ లక్ష్యం చేరుకోగా, రబీలో మాత్రం 82.5శాతంగా ఉంది. అలాగే సహకార బ్యాంకుల నుంచి ఖరీఫ్లో రూ.2747 కోట్లు, రబీలో రూ. 2584 కోట్లూ ఇచ్చారు. రుణాల జారీలో గ్రామీణ బ్యాంకులు దారుణంగా వెనుకబడ్డాయని ఆ నివేదికలో పేర్కొంది. చొరవ చూపి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది.
ఇప్పటిదాకా 29 లక్షల మంది రైతులకే రుణాలు అందగా, మిగతా 26లక్షల మంది గురించి మరిచింది. ఖరీఫ్ రుణాలు సాంతం పెద్ద రైతులకే. పేద రైతుల సంగతి సర్కారుకు పట్టకపోవడం దారుణం. భూసార పరీక్షల సంగతినే ఇటు ప్రభుత్వం, అటు వ్యవసాయ శాఖ పట్టించుకోవడం మానేశాయి. ఇస్తామన్నా సాయిల్ హెల్త్ కార్డు పనులు ఇంకా పట్టాలెక్కలేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తామంటూ ముందుకొచ్చింది. రైతుబంధు కింద మరో రూ.50వేలను ప్రకటించింది. ప్రభుత్వాల లక్ష్యాల మేరకు దిగుబడుల్లేవు. ఖరీఫ్లో కోటి 17లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి చేయాల్సి ఉంది. కాగా 85 నుంచి 90లక్షల టన్నులు దాటకపోవడం గమనార్హం. దాదాపు 60లక్షల టన్నుల మేర తక్కువగా వస్తున్నది. ఉన్నభూమిలోనే ఉత్పత్తినీ పెంచాల్సి ఉంది. ఇదిలావుండగా రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన రాష్ట్రంలోని 27 పరిశోధనా కేంద్రాలు పనీపాటా లేకుండా ఉన్నాయి. 250ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక్కో కేంద్రం ,విత్తనాలు ఇతర అంశాల్లో పరిశోధనలు చేసి రైతులకు సాయం చేయడంలో విఫలమవుతున్నాయి.
ఇకపోతే ఎన్నికల ముందు కేంద్రం ఆర్కెవివై పథకాన్ని ప్రకటించింది. దాదాపు రూ.4 వేల కోట్లు ఆ పథకం ద్వారా వస్తాయి. ఆ నిధులను వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు సర్కారు ఖర్చు చేస్తుండటం తెలిసిందే. ప్రతియేటా జనాభా 1.9శాతం పెరుగుతున్నది. కానీ సాగు విస్తీర్ణం కృశిస్తోంది. ఇదిలావుంటే టాటాలు, బిర్లాలు, ఐటీసీ, బేయర్, రిలయన్స్ తదితర సంస్థలు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి రైతులను దివాళా తీయిస్తున్నాయి. మధ్యదళారులను ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. విత్తన రంగంలో బహుళజాతి సంస్థలు రంగ ప్రవేశం చేసి పెత్తనం చెలాయిన్నాయి. వ్యవసాయం దండుగ కాదు పండగ అని చేసి చూపిస్తమన్న రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఆరంభంలో ఉన్నా, ఖరీఫ్ ప్రణాళిక వెలువరించలేదు. రైతులే తోచినమేరకు ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం సరిపోదని రైతు సంఘాలు, ప్రజాసంఘాలు అంటున్నాయి. పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు రుణాలు అందించాలనే డిమాండ్ గత కొన్నేండ్లుగా ప్రభుత్వాల ముందున్న నగ సత్యం. పాత ప్రభుత్వాల వైఫల్య విధానాలనే అవలంబిస్తూ, ఇప్పటి సర్కారు చేస్తున్న తప్పిదాల మూలంగా రైతుకు నష్టం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన ముచ్చటే. పేరుకు వ్యవసాయ శాఖ మంత్రి పదే పదే ప్రకటనలు చేస్తున్నా, ఖరీఫ్ ప్రణాళిక దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. కేసీఆర్ తనను రైతులకు పెద్దజీతగాడిగా నియమించాడంటూ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలతో రైతులకు ప్రయోజనమేమీ లేదు.