Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానున్న రెండేండ్లలో 10,000 మంది ఒప్పంద కార్మికులను తొలగించనున్నట్టు ఆస్ట్రేలియా టెలికామ్ కంపెనీ టెల్స్ట్రా మంగళవారంనాడు ప్రకటించింది. ఈ కంపెనీ అంతకుముందే 5,000మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. 2022సంవత్సరానికల్లా టెల్స్ట్రాలో పనిచేస్తున్న 25శాతం శాశ్వత ఉద్యోగులను అంటే 8,000మంది ఉద్యోగులను తొలగించాలనేది ఈ కంపెనీ ప్రణాళికగా ఉంది. 2019 సంవత్సర ఆర్థిక నివేదికలో 1.75బిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని పొదుపు ఖాతాలో చూపటానికి రానున్న నెలల కాలంలో 6,000మంది ఉద్యోగు లను టెల్స్ట్రా తొలగించనుంది.
కార్మికుల కుటుంబ జీవితం నాశనమవుతున్నా కార్పొరేట్- ఫైనాన్షియల్ పెట్టుబడిదారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. వేలాదిమంది కార్మికులను తొలగించటం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రక్రియగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా, తదితర దేశాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన వాణిజ్య రక్షిత విధానాలవల్ల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మాంద్యం తీవ్రమైంది. ఇలా తీవ్రమైన మాంద్యం పర్యవసానంగా కార్పొరేట్ కంపెనీలు పెద్ద సంఖ్యలో కార్మికులను ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నాయి.
మార్కెట్లు కుదింపునకు గురైనా, అమ్మకాలు తగ్గినా శ్రామికులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించి, పొదుపు చర్యలను పాటించినప్పుడు మాత్రమే లాభాలు తగ్గకుండా ఉంటాయని ద్రవ్య పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈ తర్కాన్ని ఆమోదించి వేలాదిమంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలలగిస్తున్నట్టుగా అనేక కంపెనీలు ప్రకటించాయి. అమెరికాకు చెందిన అతిపెద్ద కార్ల కంపెనీ జనరల్ మోటార్స్ ఏడు ప్యాక్టరీలను మూసివేసి 14,000మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది. తద్వారా 6బిలియన్ డాలర్లను పొదుపు చేయటమే కాకుండా లాభాలను కూడా గడిస్తామని ఆ కంపెనీ ప్రధాన కార్యనిర్వహణాధికారి మేరీ బర్రా ప్రకటించారు.
అలాగే అమెరికాకు చెందిన మరో కార్ల కంపెనీ ఫోర్డ్ తన 'స్మార్ట్ రీడిజైన్' కార్యక్రమం కింద ఆగస్టుకల్లా 10శాతంమంది కార్మికులను అంటే 7,000మందిని ఉద్యోగాల్లోనుంచి తొలగించనుంది. మోర్గాన్ స్టాన్లే విశ్లేషణ ప్రకారం ఈ కంపెనీ తన వ్యయాన్ని కుదించుకునే లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో 23,000 మంది కార్మికులను తొలగించవలసి ఉంటుంది. అందుకే అమెరికాతోపాటుగా జర్మనీ, బ్రిటన్, బ్రెజిల్, రష్యా, చైనా దేశాలలో వున్న ఫోర్డ్ ప్యాక్టరీలలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నది. ఫోర్డ్ కంపెనీతో 'వ్యూహాత్మక భాగస్వామ్యం'గల ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు వోక్స్ వ్యాగన్ కంపెనీ 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది.
తన పవర్ ప్లాంట్ యంత్రాలకు డిమాండ్ పడిపోయినందువల్ల ఫ్రాన్స్లోగల తన బెల్ఫోర్ట్ ప్యాక్టరీలో వేయిమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెరికా బహుళజాతి కంపెనీ జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ ప్రకటించింది. అలాగే ప్రపంచంలో మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ ఏటి అండ్ టి గత సంవత్సరం 19.4బిలియన్ డాలర్ల లాభం గడించినప్పటికీ 11,780 ఉద్యోగాలను తగ్గించింది. ట్రంప్ ప్రవేశపెట్టిన కార్పొరేట్ పన్ను కోత విధానం కారణంగా ఈ కంపెనీకి 20బిలియన్ డాలర్లు అందాయి. అలాగే బ్రిటిష్ అంతర్జాతీయ రిటైల్ కంపెనీ స్పెన్సర్స్ బ్రిటన్లో 70,000 ఉద్యోగాలను, అమెరికాలో 41,000 ఉద్యోగాలను తగ్గించింది.
అమెరికాలో ఒకవైపు వేలాదిమంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతున్నదని, నిరుద్యోగం రికార్డ్ స్థాయిలో తక్కువగా నమోదవుతున్నదని కార్పొరేట్ నియంత్రిత రాజకీయ నాయకులూ మీడియా మాట్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో కార్పొరేట్ లాభాలు పెరిగాయని, స్టాక్ మార్కెట్ నాలుగు రెట్లు పెరిగిందని, 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం తరువాత అత్యంత సంపన్నులకు ఎన్నడూ లేనంతగా సంపద బదిలీ అయిందనే విషయాల కారణంగా ఈ కార్పొరేట్లు ఖుషీలో మునిగి తేలుతున్నారన్న వాస్తవాన్ని గమనించాలి.
అమెరికాలో అధికారికంగా తక్కువగా నిరుద్యోగం రేటు నమోదైనట్టు చూపుతున్న గణాంకాలలో రికార్డు స్థాయిలో ఉద్యోగాల నుంచి తొలగింపబడిన కార్మికుల లెక్కలు ప్రతిబింబించటం లేదు. వర్తమాన శ్రామిక భాగస్వామ్యం (లేబర్ పార్టిసిపేషన్) 2007లో కంటే తక్కువగా ఉంది. కార్మికులకు, ఉద్యోగాలకు అందుతున్న వేతనాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. పెన్షన్లుగానీ, ఇతర భద్రతలు గానీ ఉండటం లేదు. అమెరికాలో గత సంవత్సరం నిజ వేతనాలు 1.3శాతం తగ్గాయి. ఇది గడిచిన నాలుగు దశాబ్దాల నిజవేతన క్షీణతకు కొన సాగింపు. నేడు అందుతున్న వేతనాల విలువ 2008లో అందు బాటులోవున్న వేతనాల విలువలో మూడోవంతు మాత్రమే.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2008 సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభ భారాన్ని రాజ్యం ఒకవైపు కార్మికవర్గం మీద మోపుతూనే మరోవైపు ద్రవ్య పెట్టుబడిదారీ వర్గ సంపదను పెంచుతోంది. కార్మికవర్గ సామాజిక, ప్రజాస్వామిక హక్కులపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ప్రతిఘటించేందుకు కోట్లాదిమంది కార్మికులు, యువత సిద్దపడుతోంది. తమ జీవన పరిస్థితులు దుర్భరం కావటానికి వలసలు కారణం కాదని, పెట్టుబడిదారీ వ్యవస్థ కారణంగానే ఇదంతా జరుగుతోందని ఈ వర్గాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి. ఈ చేతన వేగంతో మానవాళి మనుగడ ముడిపడి ఉందనేది సుస్పష్టం.