Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒక నక్క ప్రమాణస్వీకారం చేసిందట
ఇంకెవర్నీ వంచించనని...
ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట
తోటి జంతువులను సంహరించినందుకు...
ఈ కట్టుకథలు వింటూ గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నారు''. ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ పలుకులివి. ఏడుకొండలవాడి సన్నిధిలో మోడీ చేసిన ప్రసంగం వింటే పదే పదే ఈ పలుకులే గుర్తుకొస్తాయి. తిరుమల సందర్శనకు వచ్చిన ప్రధాని ఈ సందర్భంగా ''ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా నిలబడతా''నంటూ వెంకటేషుని పాదాల సాక్షిగా ప్రమాణం చేసారు. కానీ.. 2014లో కూడా ఇదే వెంకటేషుని సాక్షిగా రాష్ట్రానికి 'ప్రత్యేక హౌదా' ఇస్తానని చేసిన ప్రమాణాన్ని పాతరేశారు. అంతేనా.. 'ఈ బీజేపీ గెలుపు ఎన్నికలతో ముగిసింది. ఇక ప్రజల హృదయాలను గెలిచేందుకు 365 రోజులూ కష్టపడి పనిచేయాలి' అని కూడా సెలవిచ్చారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఆయన ప్రమాణస్వీకారం పూర్తయిన తొలి గడియల్లోనే ఈ సంకేతాలు వెలువడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిందో లేదో... దేశంలోని 45కు పైగా ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రయివేటీకరించడమో, మూసివేయడమో చేయనున్నామనీ, ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర కూడా ఉన్నదనీ నిటి అయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్కుమార్ వెల్లడించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వారు ఎవరి హృదయాలను గెలుచుకోవడానికి కష్టపడనున్నారో అర్థం చేసుకోవడానికి!
మోడీ మంత్రివర్గ కూర్పును చూసినా ఇదే విషయం అవగతమవుతుంది. కాషాయ పెద్దల ఆశీస్సులు, కార్పొరేట్ దిగ్గజాల అండదండలు పుష్కలంగా ఉన్నవారికే మంత్రివర్గంలో చోటు దక్కింది. మరీ ముఖ్యంగా అమిత్షాకు లభిస్తున్న అమితమైన ప్రాధాన్యత గత రెండువారాలుగా దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అసహనాలను రగిలించి, విద్వేషాలను మండించి, ఆ మంటల మాటున ఎన్నికల సమీకరణల్ని కూర్చడంలో, ప్రజల దృష్టిని ఏమార్చడంలో అమిత్షాది అందెవేసిన చేయన్నది నిందకాదు నిజమేనని ఇప్పటికే నిరూపితమయింది. అది ఈ ఎన్నికల్లో మరింత నిగ్గుతేలింది. అటువంటి వ్యక్తికి కీలకమైన దేశీయ వ్యవహారాల (హౌం)శాఖను కట్టబెట్టడమే గాక, పార్లమెంటరీ కమిటీల్లోనూ మరే మంత్రికీ ఇవ్వని ప్రాధాన్యం.. నెం.2గా ప్రాచుర్యం కల్పించడం దేనికి సూచిక!? నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ సమానమే. అయినప్పటికీ ఈ నెం.2 స్థానం చుట్టూ మునుపెన్నడూ లేనంత చర్చ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నట్టూ..!? అటు పాలనాపరంగా ఇటు రాజకీయంగా అమిత్షాకు అపరిమితమైన శక్తులను ఒనగూర్చే ప్రయత్నమే ఇది. అయితే, కారణాలేమైనప్పటికీ బీజేపీ బలమైన విజయాన్ని నమోదు చేసుకున్నందున... భారతీయ సమాజాన్ని ఏకశిలా సదృశ్యంగా మార్చజూసే సంఫ్ు పరివార్ ఆలోచనలే అమలుకానున్నాయా? అన్న అనుమానాలు వెలువడుతున్న తరుణంలో ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవడం గమనార్హం!
కరుకుదనంలో కాషాయీకరణలో మోడీకి కవలసోదరుడనదగ్గ అమిత్షాకు లభిస్తున్న ఈ ప్రాధాన్యతే కాషాయ పెద్దల అంతరంగాన్ని వెల్లడిస్తోంది. ఇందుకు తగ్గట్టే అప్పుడే కాశ్మీర్లో కలవరం మొదలయింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పేరుతో వివాదం రగులుతోంది. ఆర్టికల్ 370 కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని కాపాడుతుండగా, 35ఏ అధికరణం కాశ్మీరేతరులు ఆ రాష్ట్రంలో స్థిరపడటానికి అవకాశం లేకుండా నిరోధిస్తున్నది. వీటిని రద్దు చేసి, కాశ్మీరుకు వెలుపలి నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించడం ద్వారా ఆ రాష్ట్రంలో రాజకీయ, సామాజిక సమీకరణలను మార్చాలన్నది కమలనాథుల యోచన! కానీ, తీవ్రమైన వ్యతిరేకత, ఇతరత్రా రాజకీయ పరిమితుల రీత్యా ఇప్పటికిప్పుడు అది ఆచరణ సాధ్యం కాని నేపథ్యంలో.. దొడ్డి దారినైనా సరే ఆ ప్రయత్నాలను ప్రారంభించాలన్న తలంపే ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వెనుక రహస్యమన్నది రాజకీయ విశ్లేషకుల మాట! ఈ పేరుతో హిందూ ఆధిక్యతగల జమ్మూ ప్రాంతంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచి, ముస్లిం జనాభా అధికంగా ఉన్న కాశ్మీర్లోయను దెబ్బకొట్టడం ద్వారా తమ ప్రయోజనాలను సాధించాలన్నది కాషాయ పెద్దల అభిమతంగా కనబడుతున్నది! దేశంలో ఇలాంటి కుతంత్రాలనేకం సాగించాల్సి ఉండగా వారికి హౌంమంత్రిగా అమిత్షాకు మించిన ఆయుధమేముంటుంది!?
ఇక జాతీయవాదం బీజేపీ డీఎన్ఏలోనే ఉందన్న ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యలు వారి అంతరంగాన్ని మరింత దృవీకరిస్తున్నాయి. 'అఖండ భారత్' అనే భావననే తలకెక్కించుకున్న వీరికి దేశమంటే మట్టే తప్ప మనుషులు కాదు. మనిషి కేంద్రంగా కాక మతం కేంద్రంగా ఈ దేశాన్ని నిర్మించాలన్న వీరి కుహనా జాతీయవాదం ఈ దేశాన్ని ఏ తీరాలకు చేరుస్తుందోనన్న ఆందోళనే ఇప్పుడు దేశం నిండా. ఈ దేశం కులమతాలకతీతంగా ఈ నేలపై నివసిస్తున్న ప్రజలందరిదీ అన్న భావనకు, ఈ దేశం మెజారిటీ మతస్తులది మాత్రమే అనే భావనకు ఎంత తేడా ఉందో అర్థం చేసుకోగలితే తప్ప వీరి వాదన ఎంత ప్రమాదకరమైనదో బోధపడదు. ఇది ఈ దేశాన్ని అప్రియంగావిస్తుంది. అసంఖ్యాకులైన భారతీయ ముస్లింలను, దళితులను, మహిళలను సగానికి పైగా దేశ జనాభాను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేస్తుంది. హిందూ సమాజంలోని అగ్రకులాల ప్రాబల్యాన్ని కాపాడటం, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన ఆర్థికాభివృద్ధిని సాధించడమే కాషాయ పరివారం అంతర్గత ఆకాంక్ష. ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే వారి అడుగులూ పడుతున్నాయి. వారి కట్టుకథలకు తలలూపడం మాని.. ఈ వర్తమానాన్ని గుర్తించినప్పుడే, ఈ వంచనకు ఓడించినప్పుడే మనం ఈ దేశాన్ని కాపాడుకోగలం.